అల్లూరి జిల్లా : డుంబ్రిగుడ మండలం కిల్లోగుడ (జైపూర్ జంక్షన్)లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఇంగ్లీష్ మీడియం బాలికల పాఠశాలలో విద్యార్థినుల సౌకర్యార్థం సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణానికి శనివారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. జగనన్న హయాంలో నాడు–నేడు పథకం ద్వారా సుందరంగా అభివృద్ధి చేయబడిన ఈ ఆశ్రమ పాఠశాలలో, పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యుల అభ్యర్థన మేరకు అరుకు పార్లమెంట్ సభ్యురాలు డా. గుమ్మ తనూజ రాణి గారి ఆదేశాల ప్రకారం ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.20 లక్షలతో ఈ సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో డుంబ్రిగుడ మండల ఎంపీపీ,జడ్పీటీసీ బాకా ఈశ్వరి , చటారి జానకమ్మ , మండల వైస్ ఎంపీపీ శెట్టి ఆనందరావు , మండల పార్టీ అధ్యక్షులు పాంగి పరశురాం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, గిరిజన విద్యార్థుల విద్యా సౌకర్యాల మెరుగుదలకై ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు అందిస్తున్న సహకారం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ సిమెంట్ ప్లాట్ఫాం నిర్మాణంతో పాఠశాలలో విద్యార్థినిలకు మరింత సౌకర్యం కలుగుతుందని తెలిపారు.