పుంగనూరు: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైయస్ఆర్సీపీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ బాణావత్ మునీంద్ర నాయక్ గారిని నియమించారు. ఈ నియామకం రాష్ట్రవ్యాప్తంగా గిరిజన శ్రేణుల్లో హర్షాతిరేకాలను కలిగించింది. ఈ మేరకు శనివారం ఈ సందర్భంగా పుంగనూరు మండలం సుగాలి మిట్టలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో గిరిజన నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని డాక్టర్ మునీంద్ర నాయక్ను పుష్పగుచ్ఛాలు, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ మునీంద్ర నాయక్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ కీలక బాధ్యత అప్పగించిన వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నియామకానికి సహకరించిన మాజీ మంత్రివర్యులు, పుంగనూరు శాసనసభ్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి గారు, ఉమ్మడి చిత్తూరు జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు భూమన్ కరుణాకర్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా గిరిజనుల హక్కుల పరిరక్షణ, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. గిరిజనుల అభివృద్ధి, విద్య, వైద్యం, ఉపాధి, సంక్షేమ పథకాల అమలే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు సర్పంచ్ శ్రీనివాసులు నాయక్, మాజీ సర్పంచి రామయ్య, గిరిజన వైఎస్ఆర్సిపి నాయకులు శ్రీరాముల నాయక్, రవికుమార్ నాయక్, మనోజ్ కుమార్ నాయక్, అంజి నాయక్, వెంకటరమణ నాయక్, ఎం. కృష్ణ నాయక్, వైయస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిన్న రాయుడు, జనార్ధన్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.