తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో 213వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, మేకపాటి గౌతమ్రెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, రాష్టస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి, ఆర్బీఐ రీజినల్ డైరెక్టర్ నిఖిల, నాబార్డు సీజీఎం సుధీర్ జన్నావర్, వివిధ బ్యాంకుల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే.. ‘రైతులకు 99 శాతం పంట రుణాలు ఇచ్చారు. రైతుల ఆదాయం రెట్టింపుపై దృష్టిసారించాలి. పెట్టుబడి వ్యయం తగ్గాలి, పంటలకు మార్కెట్ సదుపాయాలు రావాలి. విపత్తులు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలి. పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. వైయస్ఆర్ రైతు భరోసా ద్వారా రూ.13,500 చెల్లిస్తున్నాం. వడ్డీలేని రుణాల కింద ప్రయోజనాలు పొందడానికి రైతులను చైతన్య పరుస్తున్నాం. వడ్డీలేని రుణాల కింద గతంలో ఉన్న అన్ని బకాయిలను చెల్లించాం. పంటల బీమా రూపంలో రైతులపై భారం లేకుండా చేశాం. రైతులు కట్టాల్సిన ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే కడుతుంది.
- 10,641 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం. విత్తనం నుంచి పంట అమ్మే వరకూ ఆర్బీకేలు రైతులకు అండగా ఉంటాయి. నాణ్యమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు రైతులకు అందుబాటులోకి వస్తాయి. కౌలు రైతులకు రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలి. ప్రస్తుతం ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవు.
- జగనన్న తోడు కింద చిరువ్యాపారులకు రూ.10 వేలు వడ్డీలేని రుణాలిస్తున్నాం. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చిరువ్యాపారులకు గుర్తింపు కార్డులు.
- వైయస్ఆర్ ఆసరా, వైయస్ఆర్ చేయూత పథకాల ద్వారా మహిళల స్వయం సాధికారితకు అడుగులు వేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళల జీవితాలను మార్చేలా కార్యక్రమాలు. 45 నుంచి 60 ఏళ్లలోపు మహిళలకు నాలుగేళ్ల పాటు రూ.75 వేలు. మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడేలా కార్యక్రమాలు రూపొందించాం. మహిళలు ఎంపిక చేసుకున్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు బ్యాంకర్ల ముందుకు రావాలి.
- ఎంఎస్ఎంఈలకు బ్యాంకర్లు అండగా నిలబడాలి. 2014 నుంచి పరిశ్రమలకు రాయితీల బకాయిలను రూ.1100 కోట్లు చెల్లించాం’ అని సీఎం వివరించారు.