ప్రతిపక్షంలో ఉన్నారు.. పనికొచ్చే మాటలు మాట్లాడండి

సీఎంకు పేరు రావడం తట్టుకోలేక చంద్రబాబు తప్పుడు ప్రచారాలు

చిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా మీరు మారరా..?

అక్టోబర్‌ 2న హేళన చేస్తూ మాట్లాడిన చంద్రబాబును శిక్షించాలి

మద్యం అమ్మకాలు ఎక్కడ జరిగాయో చూపించాలి

చంద్రబాబుకు వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే విడదల రజని సవాల్‌

 

తాడేపల్లి: ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పనికొచ్చే మాటలు మాట్లాడాలని, ఇంట్లో టైంపాస్‌ కాక ప్రభుత్వంపై ఏదో ఒక బురదజల్లాలని మాట్లాడుతున్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. ప్రజా రంజక పాలన చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మంచిపేరు రావడం చూసి ఓర్వలేక చంద్రబాబు తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. గాంధీ జయంతి రోజున ప్రభుత్వం మద్యం అమ్మిందని చంద్రబాబు మాట్లాడారని, ఎక్కడ అమ్మకాలు జరిగాయో వచ్చి చూపట్టే దమ్ముందా అని సవాలు విసిరారు. తాడేపల్లి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే విడదల రజని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గత ఐదేళ్లు చేసిన మోసాలకు తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి ఇంట్లో కూర్చోబెట్టారన్నారు. అయినా చంద్రబాబులో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. గాంధీ జయంతి రోజున చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమని, లేనిది ఉన్నట్లుగా ఎందుకు ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.

అక్టోబర్‌ 2వ తేదీ మహాత్మా గాంధీ 150వ జయంతిన ఆయనకు నివాళులర్పిస్తూ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ఒక మంచి పరిపాలన, సిరిసంపదలు కలిగే గ్రామాల్లో సచివాలయాల వ్యవస్థను ప్రారంభించారన్నారు. గాంధీ సిద్ధాంతాన్ని అమలు చేస్తూ సచివాలయాలు ప్రారంభించి గాంధీజీకి ఘనమైన నివాళులర్పించారన్నారు. సచివాలయ వ్యవస్థతో లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం తట్టుకోలేక చంద్రబాబు ప్రభుత్వంపై విషప్రచారం చేశారననారు. అక్టోబర్‌ 2న మద్యం దుకాణాలు ఓపెన్‌ చేశారు. మద్యం పోలీసుల ద్వారా సరఫరా చేస్తున్నారని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు.
 
గాంధీజీవి సత్యం, అహింస మార్గాలు అయితే.. చంద్రబాబుది అసత్యం, హింసామార్గమని ఎమ్మెల్యే రజని అన్నారు. అక్టోబర్‌ 2 లాంటి పవిత్రమైన రోజును కూడా హేళన చేస్తూ మందు అమ్ముతున్నారని మాట్లాడిన చంద్రబాబును శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ‘అబద్ధమా.. అబద్ధమా నువ్వు ఎందుకు నవ్వుతున్నావంటే.. చంద్రబాబును చూసి నవ్వుతున్నానని చెప్పిందంట’ చంద్రబాబును చూసి అబద్ధం కూడా నవ్వే పరిస్థితి వచ్చిందన్నారు.

వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రాష్ట్రంలోని 43 వేల బెల్టుషాపులు మూతపడ్డాయి. 40,380 పర్మిట్‌ రూంల లైసెన్స్‌లు కూడా రద్దయ్యాయి. దశలవారి మద్య నిషేధ పథకంలో భాగంగా 20 శాతం దుకాణాలను కూడా సీఎం తగ్గించారని గుర్తుచేశారు. కానీ, చంద్రబాబు హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్‌ వ్యాపారాల ద్వారా 40,380 మద్యం దుకాణాలు వెలిస్తే వాటికి అనుబంధంగా 43 వేల బెల్టుషాపులు పుట్టుకొచ్చాయన్నారు. సీఎం వైయస్‌ జగన్‌కు మంచిపేరు రావడం  ఓర్వలేక చంద్రబాబు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌లా భావించి ప్రభుత్వం కష్టపడుతుందన్నారు. చేతనైతే మంచి పనులు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించాలి కానీ, లేనిపోని విమర్శలు చేయడం తగదని చంద్రబాబుకు సూచించారు. ఇప్పటికైనా వైఖరి మానుకొని అవగాహన చేసుకొని మాట్లాడు చంద్రబాబూ అని కోరారు.

Back to Top