నెల్లూరు: ఎన్డీఏ కూటమికి ఓటేస్తే ముస్లింలు కోరి పతనం తెచ్చుకున్నట్టే..! అని జమియతే ఉలమా(హర్షద్మద్), మజ్లిస్ ఏ ఉలమా సంస్థల పెద్దలు మౌలానా సుభాన్సాహెబ్, మహ్మద్ జియాఉల్ హక్ స్పష్టం చేశారు. నెల్లూరు మినర్వా హోటల్లో జమియతే ఉలమా(హర్షద్మద్), మజ్లిస్ ఏ ఉలమా సంస్థల పెద్దలు శ్రీ మౌలానా సుభాన్సాహెబ్, మహ్మద్ జియాఉల్ హక్ మీడియాతో మాట్లాడారు.. ఇంకా వారు ఏమన్నారంటే.. ఉగ్రవాది... విశ్వగురువు ఎలా అయ్యాడు బాబూ? తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ముస్లీంలకు అండగా ఉంటాం. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామంటున్నారు. మరి, మీరు పొత్తు పెట్టుకున్న బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తున్నప్పుడు, ఆ పార్టీ కార్యక్రమాలను మీరు ఎలా కట్టడి చేయగలరు...? గత పదేళ్లపాటు నరేంద్ర మోదీ ఈ దేశ ప్రధానిగా ఉండి ఏం చేశారో మీ కళ్లతో చూశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే నరేంద్రమోదీని ఉగ్రవాదిగా పోల్చి చెప్పారా.. లేదా..? మళ్ళీ అదే నోటితో నేడు ఆయన్ను విశ్వగురువుగా పొగుడుతున్నారే..? ఇదెంత విడ్డూరంగా ఉందో అందరూ గమనిస్తున్నారు. నీ మాటలు నమ్మలేం బాబూ.. నరేంద్రమోదీ ప్రధానిగా ఉండి, ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బీహార్లలోని మైనార్టీలపై ఏ విధంగా దాడి చేశారో ప్రపంచం మొత్తం చూసింది. మైనార్టీల ఆస్తుల్ని ధ్వంసం చేయడం, వారిపై మరణకాండ సృష్టించడమే ప్రధాన ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం పనిచేయడాన్ని చూశాం. కొద్ది నెలల కిందట్నే మణిపూర్ ఘటనను దేశమంతా చూశారు. చర్చిలను కూలగొట్టడం, నడిరోడ్డుపైన మైనార్టీ మహిళలను వివస్త్రలను చేసి బీజేపీ నాయకులు లాక్కుని పోవడం అత్యంత దారుణం. ఇంతటి ఘోరాలను చూశాక కూడా మీరు అదే బీజేపీతో పొత్తుపెట్టుకుని మైనార్టీలను కాపాడుతామంటే.. మేము ఏ విధంగా మిమ్మల్ని నమ్మాలి..? మోదీ, షా నిర్ణయాల్ని చంద్రబాబు అడ్డుకోలేరు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రాష్ట్రాల్లో మైనార్టీల 4 శాతం రిజర్వేషన్ను రద్దు చేస్తామని బీజేపీ నేతలు బహిరంగంగానే పలు మార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లోనూ కూటమి గెలిస్తే భవిష్యత్తులో ఇదే పరిస్థితి జరుగుతోందనేది వారు గట్టిగానే చెబుతున్నారు. బీజేపీ పెద్దలు పలు రాష్ట్రాల్లో చేసిన ప్రసంగాల్లోనూ ముస్లీం హక్కుల్ని కూడా కాలరాస్తామంటూ బెదిరిస్తున్నారు. మరి, రేపటి ఎన్నికల్లో కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఏర్పడితే, బీజేపీ నేతల మాటల ప్రకారం పార్లమెంట్లో వారు ప్రవేశపెట్టే బిల్లులకు చంద్రబాబు ఏం చేయగలరని ప్రశ్నిస్తున్నాం. గడచిన ఐదేళ్లల్లో కేంద్రం ప్రవేశపెట్టిన మైనార్టీ వ్యతిరేక బిల్లులను తెలుగుదేశం పార్టీ తరఫునున్న ముగ్గురు ఎంపీలు సమర్థించారు కదా..? మరి ఏ విధంగా మోదీ, అమిత్ షా నిర్ణయాలను మీరు కట్టడి చేయగలరో.. ఆ శక్తి మీలో ఉందో లేదో అనే విషయంపై చంద్రబాబు మైనార్టీలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మైనార్టీ బిడ్డల భవిష్యత్తుకు పనిచేసింది జగనే గడచిన ఐదేళ్లలో ముస్లీం మైనార్టీల కుటుంబాలకు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అనేక విషయాల్లో అండగా ఉన్నారు. ముస్లీం పేదల ఆర్థిక ఉన్నతికి తోడ్పాటునందించి.. మా జీవనప్రమాణాల్లో మార్పును తెచ్చారు. మా బిడ్డల చదువులకు సంబంధించి జగన్ గారు ప్రవేశపెట్టిన విద్యాసంస్కరణలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మా బిడ్డల భవిష్యత్తుకు ఏమేమి చేయాలో .. అన్నీ చేసి చూపించిన ఘనత జగన్ మోహన్రెడ్డి గారికి దక్కుతోందని మేం గర్వంగా చెబుతున్నాం. వైయస్ జగన్ గారి స్థానం మా గుండెల్లో చెరపలేరుః మైనార్టీ సోదరులకు అండగా ఉన్న జగన్మోహన్రెడ్డి గారిపై చంద్రబాబు బురదజల్లుతున్నారు. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ను కల్పించిన, మహానేత దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర్రెడ్డి. అయితే, ఆ రిజర్వేషన్కు సంబంధించి చంద్రబాబు ఇదే నెల్లూరుకు వచ్చినప్పుడు ఏం అన్నాడు..? సుప్రీం కోర్టులో ఉన్న రిజర్వేషన్ వ్యాజ్యాన్ని మేము లాయర్లను పెట్టి వాదిస్తున్నాం. అంతే తప్ప మనం ఏమీ చేయలేమని మీరు చెప్పారా.. లేదా..? మరి, జగన్మోహన్రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో నెల్లూరు గాంధీబొమ్మ సెంటర్లో నిండు సభలో మాట్లాడుతూ.. ముస్లీంల కోసం నా తండ్రి రాజశేఖర్రెడ్డి గారు అమలు చేసిన 4 శాతం రిజర్వేషన్ను కొనసాగిస్తామన్నారు. ఆరోజు ఆయన నోటివెంట వచ్చిన ఆ ఒక్కమాట వల్ల ముస్లీంల హృదయాల్లో జగన్మోహన్రెడ్డి గారు నిండిపోయారు. మాకు అన్నివిధాలా అండగా ఉంటూ.. మా బాగోగులు చూస్తోన్న అలాంటి మహానుభావుడుని మా గుండెల్లో నుంచి ఎవరూ చెరపలేరు. చంద్రబాబు కల్లబొల్లి కబుర్లకు మేం మోసపోలేం అదేవిధంగా ముస్లీంల మనోభావాలను కించపరిచినా.. మైనార్టీలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏ రకమైనా బిల్లులనైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్థించబోదని జగన్గారు బహిరంగంగా చెప్పారు. మరి, అలాంటి దమ్ము మీలో ఉందా..? అని చంద్రబాబును ప్రశ్నిస్తున్నాం. ముస్లీం సామాజికవర్గాన్ని అణగదొక్కాలని.. ముస్లీం బిడ్డల భవిష్యత్తును సర్వ నాశనం చేయాలని కంకణం కట్టుకున్న పార్టీ బీజేపీ. అలాంటి పార్టీతో మీరు పొత్తు పెట్టుకుని మా భవిష్యత్తును మీరు నిర్ణయిస్తారా..? బీజేపీ చర్యల్ని అడ్డుకునే దమ్మూధైర్యం మీలో లేదు. కనుక, మీ కల్లబొల్లి మాటలతో అమాయక మైనార్టీలను ఓట్లు కోసం వాడుకోవాలనే కుట్రని ఇవాళ మేము అర్ధం చేసుకున్నాం. ముస్లీంలంతా ఏకమై వైయస్ జగన్గారిని గెలిపించుకోవాలిః ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని భుజానికెత్తుకుని కేంద్రంలో ముస్లీంలకు అండగా ఉంటామని చంద్రబాబు ప్రచారం చేసిన సంగతి ఎవరూ మరిచిపోలేరు. మరి, అలాంటి వ్యక్తి ఇవాళ బీజేపీ నేతలకు సీట్లిచ్చి గెలిపించాలంటూ .. ముస్లీంలకు ఎలాంటి అన్యాయం జరగదని మాయ మాటలు చెబితే ఇక్కడ మోసపోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. అప్పటికీ, ఇప్పటికీ.. మరెప్పటికీ జగన్ గారిది ముస్లీంలపై ఒకటే మాటగా ఉంది. మాకు ఆర్థిక, సామాజిక, రాజకీయ గుర్తింపును ప్రసాదించిన జగన్ గారిని మేమెలా మరుస్తాం..? ఈ ఎన్నికల్లో 7 మంది మైనార్టీలకు ఎమ్మెల్యే సీట్లిచ్చి.. నెల్లూరు సిటీలో అబ్ధుల్ఖలీల్ గారికి సీటిచ్చిన జగన్ గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకునేందుకు ముస్లీం మైనార్టీలంతా ఏకం కావాలని పిలుపునిస్తున్నాం.