తాడేపల్లి: పెత్తందార్లు- పేదలకు మధ్య జరిగిన ఎన్నికల యుద్ధంలో అంతిమ విజయం పేదలదే అని, పేదలవైపు ఉన్న వైయస్ఆర్ సీపీకి ప్రజలు అఖండ విజయం చేకూర్చబోతున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రావెల కిషోర్ బాబు అన్నారు. వైయస్ జగన్ తన ఐదేళ్ల పాలనలో బడుగుల సంక్షేమం ధ్యేయంగా అద్భుతమైన ప్రజరంజక పాలన చేశారన్నారు. బహుజనులు వైయస్ఆర్ సీపీ వైపే ఉన్నారని మరోసారి నిరూపితం కానుందన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో రావెల కిషోర్ బాబు మీడియాతో మాట్లాడారు. పెరిగిన ఓటు శాతం ప్రభుత్వంపై వ్యతిరేకత అని పచ్చమీడియాలో దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వంపై అనుకూలత ఈ ఎన్నికలలో ప్రస్పుటంగా కనిపించిందన్నారు. వైయస్ జగన్ ఐదు సంవత్సరాలుగా అమలు చేసిన పధకాలకు పెద్ద ఎత్తున మద్దతు లభించిందని చెప్పారు. గత ఎన్నికలలో లభించిన 151 స్థానాలకంటే అధికంగా వైయస్ఆర్ సీపీ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు కూటమి నేతలు చేసిన దుష్ప్రచారాన్ని ప్రజలు ఏమాత్రం నమ్మడం లేదన్నారు. చంద్రబాబు, టీడీపీ నేతలది మేకపోతు గాంభీర్యమేనని కొట్టిపారేశారు. తెలుగుదేశం పార్టీకి కొందరు పోలీసు అధికారులు వత్తాసు పలికారనేది హింసాత్మక సంఘటనల ద్వారా రుజువైందన్నారు.