రాయదుర్గం: రాయదుర్గంలో సామాజిక సాధికార యాత్రకు జనం జైకొట్టారు. ఎమ్యెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన బస్సుయాత్ర, బహిరంగ సభ విజయవంతమయ్యాయి. వేలాదిగా జనం తరలి వచ్చారు. బహిరంగ సభ జరుగుతున్నంత సేపు కదలకుండా నిలుచుండిపోయారు. యువకులు, మహిళలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. మంత్రులు గుమ్మనూరు జయరామ్, ఉషశ్రీచరణ్, ఎంపీ తలారి రంగయ్య, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డితో పాటు జెడ్పీ చైర్ పర్సన్ గిరిజమ్మ తదితరులు బహిరంగసభలో పాల్గొన్నారు. వీధివీధిలో సామాజిక న్యాయం వెల్లివిరిసింది. యువత బైక్ ర్యాలీతో సందడి చేశారు. ముందుగా శాంతినగర్లోని వైఎస్ విగ్రహానికి మంత్రులు గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్, విప్ కాపు రామచంద్రారెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు. అక్కడి నుంచి వేలాది మందితో ప్రారంభమైన బస్సు యాత్ర తేరుబజారులో ఏర్పాటు చేసిన సభా వేదిక వద్దకు చేరుకుంది. అప్పటికే వేలాది మందితో సభా ప్రాంగణం నిండిపోయింది. వారికి యాత్రలో వచ్చిన ప్రజలు కలిసి ఆ ప్రాంతమంతా జనసంద్రంలా కనిపించింది. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఓటు బ్యాంకుగా వాడుకుని వదిలేయగా.. జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని విధాలా పెద్దపీట వేసి రాజ్యాధికారం కల్పించారని వక్తలు చెప్పడంతో సభికుల నుంచి పెద్దఎత్తున హర్షం వ్యక్తమైంది. మనకు సాధికారత కల్పించిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి మరోమారు అధికారం కట్టబెడదామని మంత్రులు, నేతలు పిలుపునివ్వడంతో ప్రజలు ఈలలు, కేకలతో మద్దతు ప్రకటించారు. మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ.... – సామాజిక న్యాయానికి నిదర్శనంగా నాలాంటి బడుగు, బలహీనవర్గాలకు చెందిన ఎందరో నాయకులున్నారంటే.. అది ముఖ్యమంత్రి జగనన్న ఘనతే. – మేము సైతం జగన్ కోసం అంటూ సామాజిక సాధికార యాత్రల్లో బడుగు, బలహీనవర్గాల ప్రజలు నినదిస్తున్నారు. – సీఎం జగన్కు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలతో పాటు, అగ్రవర్ణ పేదల్లోనూ నానాటికీ ఆదరణ పెరుగుతోంది. – పేదల పిల్లలు మంచి చదువులు చదివేలా, పేద మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా చేస్తున్న జగనన్నను మించిన రాజకీయనాయకుడు మరొకరు లేరు. – చంద్రబాబు మళ్లీ అబద్దాలతో ప్రజల్ని నమ్మించడానికి వస్తున్నారు. నిన్ను నమ్మం బాబూ అని ఆయన్ను వెనక్కు పంపించడం మన బాధ్యత. మంత్రి గుమ్మనూరు జయరామ్ మాట్లాడుతూ... – రాష్ట్రంలో సామాజిక విప్లవానికి నాంది పలికింది జగనన్న. – సామాజిక న్యాయం నినాదం కాదు అమలు చేయాల్సిన విధానమని అధికారంలోకి వచ్చిన మొదటి రోజే చెప్పిన జగనన్న. – కనీవినీ ఎరుగని రీతిలో నవరత్నాల్లోని సంక్షేమ పథకాల ద్వారా పేదల ఖాతాల్లోకి రూ.2.40 లక్షల కోట్లను డీబీటీ ద్వారా జమ చేశారు. ఇందులో 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే చేరాయి. ఆ వర్గాల ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కి, ఆర్థిక సాధికారత సాధించడానికి బాటలు పడ్డాయి. – నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.67 లక్షల కోట్ల లబ్ది చేకూరింది. – 30 లక్షల మందికి పైగా ఇంటి స్థలాలను ఇచ్చి, పక్కా గృహాలను కడుతూ, పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న సీఎం జగన్. – మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేలా పథకాలు అందిస్తున్నారు. ఒకటో తేదీ ఉదయాన గడపల దగ్గరే పింఛన్లు అందిస్తూ, అవ్వాతాతల మొహాల్లో వెలుగులు నింపుతున్నారు. – మన బడుగు, బలహీన వర్గాలు, పేదలు ఎప్పుడూ బాగుండాలన్నా, మన పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా.. మళ్లీ జగనన్నే రావాలి. ఎంపీ తలారి రంగయ్య మాట్లాడుతూ.... – 25 మంది మంత్రివర్గంలో సామాజిక న్యాయాన్ని ఎలా చేయాలో దేశానికి చాటి చెప్పిన జగనన్న. – ఐదుగురు డిప్యూటీ సీఎంలను నియమిస్తే, నలుగురు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల వారే. – 2022 మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆ వర్గాలకు చెందిన వారికి ఏకంగా 17 పదవులిచ్చారు. – ఎవరు మనకు ధైర్యాన్ని ఇస్తారో, ఎవరు మనకు మంచి చేస్తారో ఆలోచించి.. సరైన నిర్ణయాలు తీసుకోవాలి. – మనకు సాధికారత ఇచ్చిన జగనన్నకు మనం తిరిగి అధికారం ఇవ్వాలి. ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ... – జగనన్న నిరంతరం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వారి సంక్షేమానికి ఎంతో కృషి చేస్తున్నారు. – అట్టడుగువర్గాల పిల్లల కోసం, పేద పిల్లల కోసం.. వారి ప్రాథమిక విద్య నుంచే లబ్ది చేకూరేలా సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు జగనన్న. – ప్రభుత్వ పాఠశాలలను నాడు–నేడు ద్వారా కార్పొరేట్ స్కూళ్ల స్థాయికి అభివృద్ధి చేశారు. ఇంగ్లీషు మీడియం బోధనను ప్రవేశ పెట్టి, అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెన పథకాల ద్వారా నాణ్యమైన విద్యను అందించారు. – ఎన్నెన్నో హామీలిచ్చి.. ఏ ఒక్కటీ నెరవేర్చని చంద్రబాబు మళ్లీ వస్తున్నాడు. ఆయన మోసాలు అందరికీ తెలుసు. ఆయనను నమ్మితే నిండా మునిగినట్టే. – ఇక్కడ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన అరాచకాలు, దోపిడీల గురించి ఎంత చెప్పినా తక్కువే. – అభివృద్ధి, సంక్షేమం విషయంలో జగనన్నతో పోటీపడేవారే లేరు.