నేటి నుంచి వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా

సీఎం చేతుల మీదుగా గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రారంభం

ఆరోగ్యశ్రీ శస్త్రచికిత్స అనంతరం విశ్రాంతి కాలానికి ఆర్థిక సాయం

రోజుకు రూ. 225  లేదా నెలకు గరిష్టంగా రూ. 5 వేల లబ్ధి

ఏటా ప్రయోజనం పొందే వారు 4.5 లక్షలు

ఏటా వ్యయం రూ. 300 కోట్లు
 

 

 అమరావతి:  ఆరోగ్యశ్రీ పథకంలో భాగంగా పేద రోగులకు ఊరట కల్పించే మరో కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స చేయించుకున్న రోగులకు వైద్యం అనంతరం విశ్రాంతి కాలానికి డబ్బు చెల్లించే ‘వైయస్‌ఆర్‌ ఆరోగ్య ఆసరా’ను గుంటూరు జనరల్‌ ఆస్పత్రిలో సోమవారం సీఎం ప్రారంభించనున్నారు. శస్త్రచికిత్స అనంతరం వైద్యులు సూచించిన విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5 వేలను ఈ పథకంలో అందచేస్తారు. రోగులకు ఈ తరహా చేయూత అందించడం భారతదేశంలో ఇదే ప్రథమం. కుటుంబ పెద్ద జబ్బుబారిన పడితే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో సీఎం ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని వల్ల ఏటా 4.5 లక్షల మంది లబ్ధి పొందుతారు.

సీఎం చేతుల మీదుగా చెక్కుల పంపిణీ
గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో జరిగే కార్యక్రమంలో ఆరోగ్యశ్రీలో వైద్యం పొందిన రోగులు ముఖ్యమంత్రి చేతుల మీదుగా చెక్కులు అందుకుంటారు. డిసెంబర్‌ 1 నుంచే పథకం అమల్లోకి వచ్చినా సోమవారం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయిన 48 గంటల్లో విశ్రాంతి తీసుకునే కాలానికి రోగుల అకౌంట్లలో నేరుగా నగదు జమ చేస్తారు. 26 ప్రత్యేక విభాగాల్లో 836 రకాల శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి ఇది వర్తించేలా ప్రభుత్వం రెండ్రోజుల క్రితమే మార్గదర్శకాలు జారీచేసింది. రోగి డిశ్చార్జి సమయంలో బ్యాంకు ఖాతా, ఆధార్‌ కార్డు వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ బ్యాంకు ఖాతా లేకపోతే బంధువుల బ్యాంకు ఖాతా ఇస్తే దానికి సొమ్మును జమచేస్తారు. ఈ పథకం అమల్లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 

 

వైయస్‌ఆర్‌ ఆసరా వివరాలు 
మొత్తం స్పెషాలిటీ విభాగాలు 26
ఎన్నిరకాల శస్త్ర చికిత్సలు 836
రోజుకు ఇచ్చే మొత్తం రూ.225
నెల రోజుల విశ్రాంతికి   రూ.5000
లబ్ధిదారుల సంఖ్య  4.50 లక్షలు
ఏటా వ్యయం దాదాపు రూ.300 కోట్లు

Read Also: ప్రజల రుణం తీర్చుకునేందుకు సీఎం వైయ‌స్ జగన్ నిరంతరం తపిస్తున్నారు

Back to Top