రైతులకు బీమా ఇచ్చారో తెలుసా?

రామోజీ అర్ధసత్యాల ‘బీమా’ కలాపం

బాబు హయాంలో ఐదేళ్లలో 30 లక్షల రైతులకే పరిహారం 

ఐదేళ్లలో పరిహారంగా చెల్లించిన మొత్తం రూ.3,411 కోట్లు  

ఈ ప్రభుత్వంలో మూడున్నరేళ్లకే 44.66 లక్షల రైతులకు బీమా 

వీరికి చెల్లించిన మొత్తం రెట్టింపు.. అంటే రూ.6,684.84 కోట్లు 

గతంలోనే కేంద్ర పథకం నుంచి బయటికొచ్చి సొంతంగా రాష్ట్ర బీమా 

ప్రీమియం మొత్తం తనే చెల్లించేలా రాష్ట్ర పరిధిలోనే బీమా కంపెనీ 

దీనికోసం దరఖాస్తు... కేంద్రానికి సైతం అనుమతి కోసం అభ్యర్థన 

లోటుపాట్లు సరిదిద్దుతామని మళ్లీ చేరాలని కేంద్రం అభ్యర్థన 

షరతులకు ఓకే అనటంతో మళ్లీ కేంద్ర పథకంలో చేరనున్న రాష్ట్రం 

రబీలో పంట నష్టం అరుదు... ప్రభుత్వ బాధ్యతగా పరిహారం 

అవన్నీ వదిలేసి బీమా ప్రీమియం చెల్లించలేదంటూ రామోజీ తప్పుడు వార్త 

బురద జల్లటమే లక్ష్యంగా ‘ఈనాడు’ కథనం  

అసలు చంద్రబాబునాయుడి హయాంలో మొత్తం ఐదేళ్లలో పంట నష్టపోయినందుకు ఎంతమంది రైతులకు బీమా ఇచ్చారో తెలుసా? కేవలం 30.85 లక్షల మందికి!. మరి వారికిచ్చిన మొత్తమెంతో తెలుసా? కేవలం 3,411.20 కోట్లు!. అది కూడా... ఐదేళ్లూ కరువుతో అల్లాడిన రాష్ట్రంలో. నిజానికి కరువు పరిస్థితులున్నపుడు దెబ్బతినే పంట ఎక్కువుంటుంది. అయినా సరే.. బాబు రైతులకిచ్చిన పరిహారం ఇంతే!!. 

ఈ ప్రభుత్వ పనితీరును పోల్చాలంటే గత ప్రభుత్వంతోనే కదా? అంతకన్నా మెరుగ్గా చేశారా లేదా అన్నదే కదా ప్రామాణికం. ఎందుకంటే వై.ఎస్‌.జగన్‌ సర్కారు బాధ్యతలు చేపట్టిన తొలిరోజు నుంచీ చక్కని వర్షాలు పడ్డాయి. పంటలూ విరగపండాయి. మునుపటితో పోలిస్తే నష్టం తక్కువ జరిగినా... ప్రతి ఎకరాన్నీ పరిగణనలోకి తీసుకోవటంతో... గడిచిన మూడున్నర ఏళ్లలో ఏకంగా 44.66 లక్షల మందికి బీమా పరిహారమిచ్చింది ఈ సర్కారు.

వారికి చెల్లించిన మొత్తం ఏకంగా రూ.6684.84 కోట్లు. ఈ రెండింటికీ అసలు ఏ కొంచమైనా పోలిక ఉందా? మరి గతంలో దరఖాస్తులు పెట్టుకున్న వారికి కూడా బీమా పరిహారం చెల్లించలేదని రైతుల తరఫున ఒక్క అక్షరమైనా ‘ఈనాడు’ రాసిందా? ఎందుకు పెన్నెత్తలేదు రామోజీ? ఇప్పుడెందుకు ఇంత మేలు చేస్తున్న ప్రభుత్వంపై అదేపనిగా బురద జల్లుతున్నారు? ‘బీమా ఆశలపై నీళ్లు’ అంటూ సోమవారం పతాక శీర్షికల్లో అచ్చేసిన కథనం దేనికి చిహ్నం? గత ప్రభుత్వం కన్నా ఎందులోనైనా వెనకబడితే అడిగినా తప్పులేదు!. 

కానీ పోలికే లేని విధంగా మూడున్నరేళ్లలో నాటి ప్రభుత్వం ఐదేళ్లలో చెల్లించిన బీమా మొత్తానికి దాదాపుగా రెట్టింపు పరిహారం చెల్లించిన ఈ ప్రభుత్వాన్ని విమర్శించటం తగునా రామోజీ? అసలు ‘ఈనాడు’ రాసిన రాతల్లో ఏది నిజం? 

నాడు... రైతులే బీమా ప్రీమియం చెల్లించాలి 
విశేషమేంటంటే చంద్రబాబునాయుడి హయాంలో రైతులే బీమా ప్రీమియం చెల్లించాలి. చెల్లించినా కూడా వారికి పరిహారం వస్తుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే దిగిపోతూ దిగిపోతూ రైతులకిచ్చే పరిహారంలో ఏకంగా రూ.715 కోట్ల బకాయిలు పెట్టి మరీ దిగిపోయిన చరిత్ర చంద్రబాబుది. దాన్నికూడా ఏనాడూ ‘ఈనాడు’ ప్రశి్నంచలేదు. అప్పట్లో చాలామంది రైతులు ప్రీమియం చెల్లించలేకుంటే వారిని నారా వారు పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం వచ్చాక ఏ ఒక్క రైతూ నష్టపోకూడదనే ఈ–క్రాప్‌ వ్యవస్థను తెచ్చింది.

ఈ–క్రాప్‌లో నమోదైన నోటిఫైడ్‌ పంటలు ప్రతి ఎకరాకీ ఆటోమేటిగ్గా బీమా అమలవుతుంది. ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లిస్తుంది. పైపెచ్చు ఎప్పటికప్పుడు సోషల్‌ ఆడిట్‌లో భాగంగా ఆర్బీకేల్లో పేర్లు ప్రదర్శించటం... పేర్ల నమోదులో తేడాలుంటే సరిదిద్దటం చిత్తశుద్ధితో చేస్తోంది. అందుకే రైతుల్లో ఆ సంతృప్తి!. దాన్ని అసంతృప్తిగా చిత్రీకరించడానికి రామోజీ చేస్తున్న అక్షర విధ్వంసంలో భాగమే తాజా కథనం.  

రబీలో పంటనష్టం తక్కువని తెలియదా? 
రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని పరిశీలిస్తే రబీలో ప్రకృతి వైపరీత్యాలు అత్యంత అరుదు. మంచు లేదా బోర్లమీదో.. లేకుంటే పక్కా నీటి సరఫరా ఉంటేనే ఈ సీజన్లో పంటలు సాగవుతాయి. వైపరీత్యాలు అత్యంత అరుదు కాబట్టి, పంటల బీమా పరిస్థితులూ సహజంగా రావు. రబీ పంట ఫిబ్రవరి– మార్చి నెలల్లో వస్తుంది కాబట్టి... అప్పటికి వర్షాల సీజన్‌ కూడా మొదలు కాదు కాబట్టి నష్టమూ తక్కువే.

ఒక్క ఖరీఫ్‌ సీజన్‌లోనే అత్యధిక వర్షపాతం వల్లో... అత్యల్ప వర్షపాతం వల్లో పంటలు దెబ్బతిని బీమా చెల్లించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ఖరీఫ్‌లో తెగుళ్లు, ఇతర వ్యాధులు ప్రబలి పంటలు నష్టపోయిన పరిస్థితులు కూడా ఎక్కువే. బాబు హయాంలో ఖరీఫ్‌లోనే పంటల బీమా. రబీలో బీమాయే లేదు. ఈ విషయం ఇటు రామోజీరావుకు గానీ... అటు చంద్రబాబు నాయుడికి గానీ తెలియంది కాదు.

అయినా పంట నష్టం జరిగి పరిహారమివ్వకపోతే ప్రశ్నించినా తప్పు లేదు. కానీ బీమా చెల్లించలేదంటూ నిందలేల? రాష్ట్ర ప్రభుత్వమే బీమా కంపెనీని నిర్వహిస్తోంది. నష్టపోయి పరిహారం క్లెయిమ్‌ చేసిన రైతులకు తనే పరిహారం చెల్లిస్తుంది. మరి ఇందులో బీమా ప్రీమియం అంశం ఎక్కడుంది? ప్రభుత్వమే బీమా కంపెనీ నిర్వహిస్తున్నపుడు రబీ ప్రీమియం గురించి రామోజీకెందుకు అంత ఉలికిపాటు? 

కేంద్రం అభ్యర్ధించటంతో... 
రాష్ట్ర ప్రభుత్వమే బీమా కంపెనీ పెట్టి... శెహబాష్‌ అనిపించుకునే రీతిలో నడుపుతూ ఏ ఒక్క రైతుకూ నష్టం జరగకుండా చూడటంతో కేంద్రం దిగి వచ్చిందనే చెప్పాలి. కొన్నాళ్ల కిందట కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ నేరుగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి ఫోన్‌ చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఫసల్‌ బీమా యోజనలో భాగస్వామి కావాలంటూ ఆయనే అభ్యర్ధించారు. దాన్లో ఉన్న ఇబ్బందులను, చేయాల్సిన మార్పులను ముఖ్యమంత్రి పూర్తిగా వివరించటంతో... కేంద్ర బృందం రాష్ట్రానికి వచ్చింది. ఇక్కడ అమలవుతున్న ఉచిత పంటల బీమా పథకాన్ని అధ్యయనం చేసింది.

నోటిఫైడ్‌ పంటలు సాగు చేస్తున్న ప్రతి ఒక్క రైతుకూ ఆటోమేటిగ్గా బీమా వర్తింప చేసేలా ఫసల్‌ బీమా యోజనలో కొన్ని మార్పులను సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ఆయన సూచనల మేరకు రైతులందరినీ బీమా పరిధిలోకి తీసుకొస్తామని, అందుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామని కేంద్రం మాట ఇచ్చింది. ఈ–క్రాప్‌ డేటా ఆధారంగా ఏపీలో ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుండగా... ఇదే డేటాను తామూ ప్రామాణికంగా తీసుకుంటామని, నోటిఫైడ్‌ పంటలు సాగుచేసే రైతులందరికీ వర్తింప చేసేలా ఫసల్‌ బీమా యోజనలో మార్పులు చేస్తామని కేంద్రం హామీ ఇచ్చి రాష్ట్రానికి రెడ్‌ కార్పెట్‌ వేసింది. దీంతో మళ్లీ కేంద్ర పథకంలో చేరడానికి రాష్ట్రం సుముఖత వ్యక్తం చేసింది.

అయితే ఈలోగా తాము ఏర్పాటు చేసిన బీమా కంపెనీకి రెగ్యులేటరీ లైసెన్సు కోసం ప్రయత్నాలను మాత్రం మానలేదు. ఇది కేంద్ర పరిధిలోని అంశం కావటంతో దీనికోసం లేఖలు రాయటంతో పాటు నేరుగా అభ్యర్థిçస్తూ ఆ ప్రయత్నాలనూ కొనసాగిస్తూనే ఉంది. ‘ఈనాడు’కు మాత్రం ఇవేవీ పట్టవు. కేంద్ర పథకం నుంచి రాష్ట్రం బయటకు వచ్చినపుడు కూడా రామోజీరావు అడ్డగోలు రాతలే రాశారు. ఆ తరవాత మళ్లీ కేంద్ర పథకంలో రాష్ట్రం చేరుతున్నపుడు కూడా అడ్డుకోవటానికి శతథా ప్రయతి్నస్తూ విమర్శలే చేశారు. తాజా సీజన్‌కు రాష్ట్రమే ప్రీమియం, పరిహారం చెల్లిస్తుండగా... దానిపైనా అవాస్తవాలకే పట్టం గడుతున్నారు.  

బాబు హయాంలో అడిగితే ఒట్టు? 
అసలు కేంద్ర పథకంలో లోపాలున్న విషయాన్ని చంద్రబాబు హయాంలో ఒక్కనాడు కూడా రామోజీ ప్రస్తావించలేదు. రాష్ట్రమే నేరుగా అమలు చేయొచ్చుననే ఆలోచన కూడా ఈ గురుశిష్యులకు రాలేదు. అసలు ఖరీఫ్‌ సీజన్లో జరిగిన నష్టాన్ని మళ్లీ ఖరీఫ్‌ మొదలు కాకముందే ఇవ్వటమనేది మీ జన్మలో చూశారా రామోజీ? అలాంటి ఆలోచనైనా మీ చంద్రబాబుకు వచ్చిందా? ఇప్పుడెందుకు పనిచేస్తున్న ఈ ప్రభుత్వంపై పసలేని విమర్శలు? రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా వైఎస్సార్‌ పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్నందుకు ఒక్కనాడైనా ప్రశంసిస్తూ ఒక్క అక్షరమైనా రాశారా? జగన్‌ ప్రభుత్వం చేసే మంచిని చూడకుండా... లేనిపోని విమర్శలకే పరిమితమవుతున్నారెందుకు? మీది ప్రతిపక్ష పాత్రా? లేకపోతే ప్రతినాయకుడి పక్షం వహించే పాత్రా? మీదిప్పుడు రాసే పాత్ర కాబట్టి పాఠకులతో సహా ఎవ్వరికీ సమాధానం ఇవ్వక్కర్లేదనుకోవచ్చు. కానీ మీకు మీరైనా జవాబు చెప్పుకోవాలి కదా? 

అనుమానాస్పద ఖాతాలు పరిశీలించొద్దా? 
కొన్ని ఖాతాలు అనుమానాస్పదంగా ఉండటంతో వాటిపై పరిశీలన జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిగో... అలాంటి వారికే రూ.67 కోట్లు ఇవ్వలేదనేది ‘ఈనాడు’ ఆరోపణ. పత్రికా ముఖంగా ఒక ప్రభుత్వంపై ఆరోపణ చేసేటపుడు అధికారులను అడిగైనా నిజాలు తెలుసుకోవాలి కదా రామోజీ? అనుమానాస్పద ఖాతాలను పరిశీలించాలని అనుకోవటం తప్పా? ఆ పరిశీలన పూర్తయ్యింది.

సోషల్‌ ఆడిట్‌కూడా పూర్తయ్యింది. ఈనెల 29న ఈ డబ్బు ఇవ్వబోతున్నామని స్వయంగా అధికారుల సమీక్షా సమావేశంలోనే ముఖ్యమంత్రి ఇటీవల చెప్పారు. కానీ ఈ విషయం ప్రస్తావించకుండా... పచ్చి అబద్ధాలను వండేశారు రామోజీరావు. రామోజీ, ‘ఈనాడు’ది జీవితం అంతా ఇదే బతుకా? కౌలు రైతుల మేలు కోసం సీసీఆర్సీ కార్డులను తీసుకువచ్చిన ప్రభుత్వమిది. గ్రామ సచివాలయాల్లోనే దరఖాస్తు నింపి అన్ని ప్రభుత్వ పథకాలను, సహాయాలను పొందే అవకాశాన్ని వారికి కలిగించిన ప్రభుత్వమిది. అంతేకాదు! ఎక్కువ మంది రైతులు వీటిని వినియోగించుకునేలా అవగాహన కలిగిస్తున్న ప్రభుత్వమిది. 

టీడీపీ హయాంలో జరిగింది ఇదీ... 
చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో సగటున ఏడాదికి 20.28 లక్షల మంది రైతులు, 23.57 లక్షల హెక్టార్లకు మాత్రమే బీమా చేయించుకోగలిగారు. 2014–16 మధ్య వ్యవసాయ బీమా పథకం కింద 5.38 లక్షల మందికి రూ.471.94 కోట్లు,  2016–19 మధ్య పీఎంఎఫ్‌బీవై కింద 25.47 లక్షల మందికి రూ.2939.26 కోట్ల బీమా మొత్తాన్ని అందించారు. మొత్తంగా ఐదేళ్లలో కేంద్ర బీమా పథకాల ద్వారా రూ.3,411.20 కోట్ల పరిహారాన్ని అందించారు. నాటి ‘ప్రధాని ఫసల్‌ బీమా యోజన’లో పంటను బట్టి ప్రీమియాన్ని నిర్ణయించాక... దాన్లో 2 శాతాన్ని రైతులే చెల్లించేవారు.

బ్యాంకు రుణాలు తీసుకున్న రైతులకు బ్యాంకులే ఈ మొత్తాన్ని మినహాయించేసి బీమా చేయించేవి. మిగిలిన రైతులకు బీమా గురించి తెలిసేదే కాదు. ప్రకృతి వైపరీత్యాలతో వారి పంట దెబ్బతింటే... వారికి బీమాయే లేదు కాబట్టి ప్రభుత్వం చేతులెత్తేసేది. బీమా ఉన్నవారికి కూడా ఒక సీజన్లో నష్టం జరిగితే రెండు మూడు సీజన్లు గడిచాక పరిహారం వచ్చేది. కేంద్ర పథకంలోని పరిమితులతో రైతులు నష్టపోతున్నారని భావించిన వై.ఎస్‌.జగన్‌ సర్కారు.. నోటిఫైడ్‌ పంటలు వేసే రైతులందరికీ బీమా వర్తింప చేయాలని డిమాండ్‌ చేసింది.

ప్రీమియం చెల్లించిన వారికేనని కేంద్రం చెప్పడంతో ఆ పథకం నుంచి బయటికొచ్చేసింది. 2019 జూలై 8న డాక్టర్‌ వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని తెస్తూ బృహత్తర బాధ్యతను భుజానికెత్తుకున్నారు వైఎస్‌ జగన్‌. ఈ–క్రాప్‌ను సమర్థంగా అమలు చేస్తూ... పంట నమోదు చేయించుకున్న ప్రతి రైతుకూ  బీమా వర్తించేలా... ఆర్‌బీకేల్లోనే రసీదు ఇస్తున్నారు. ఆ రసీదు.. ఈ–క్రాప్‌లో నమోదు చేసినట్లు రైతుకిచ్చే అధికారిక గుర్తింపు. దాని ఆధారంగా పంట నష్టపోయిన ప్రతి రైతుకూ నేరుగా సీజన్‌ తిరిగి రాకముందే పరిహారం అందుతోంది.

ఇందులో రైతు వాటాతో పాటు కేంద్రం వాటానూ రాష్ట్రమే భరిస్తోంది. ఇక ఇన్‌పుట్‌ సబ్సిడీని ఏ సీజన్‌లో నష్టం జరిగితే.. ఆ సీజన్లోనే చెల్లిస్తున్నారు. ఇలాంటి ప్రక్రియను చరిత్రలో తొలిసారిగా అమలు చేయటంతో పాటు... ఏటా క్యాలెండర్‌ పెట్టుకుని మరీ రైతులకు డబ్బులు నేరుగా వారి ఖాతాల్లోకి పంపిస్తున్నారు కనకే చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే పంటల బీమా పరిధిలోకి వచ్చే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. బీమా పరిధిలోకి వచ్చిన రైతుల సంఖ్యకూడా 3 రెట్లు పెరిగి... ఇది రైతు ప్రభుత్వమయ్యింది.   

Back to Top