ఉద్యోగుల‌కు సంక్రాంతి కానుక‌

పీఆర్‌సీ ప్ర‌క‌ట‌న‌తో పండుగ ముందే వచ్చింది

2022 జనవరి 1 నుంచి అమల్లోకి కొత్త జీతాలు

2018 జూలై 1 నుంచి పీఆర్సీ అమలు..

2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ ప్రయోజనాలు

కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా

కొత్త స్కేల్స్‌ వర్తింపు

సీపీఎస్‌పై జూన్‌ 30లోగా నిర్ణయం

ఇక నుంచి సెంట్రల్‌ పీఆర్సీ ప్రతిపాదనలే పరిగణనలోకి

ఉద్యోగులకు మేలు చేసే విషయంలో మనసుతో, గుండెతో స్పందించి ఈ నిర్ణయాలు ప్రకటిస్తున్నాను. దేవుడి ఆశీస్సులు, ప్రజలందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం మంచి పాలన అందించడంలో ఉద్యోగుల సహాయ, సహకారాలు మరింత మెరుగ్గా ఉంటాయని ఆశిస్తున్నా. – సీఎం వైయ‌స్ జగన్‌

 లక్షలాది మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురు అందించారు. కొత్త సంవత్సరం, సంక్రాంతి కానుకగా వారికి భారీ ప్రయోజనాలను చేకూర్చుతూ పీఆర్సీతో పాటు పలు అంశాలపై శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఉద్యోగులకు 23 శాతం ఫిట్‌మెంట్‌తో పెరిగే వేతనాలను ఈ నెల నుంచే ఇవ్వనున్నట్లు తెలిపారు.

23% ఫిట్‌మెంట్‌ వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.10,247 కోట్ల అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని ఈ బాధ్యతను స్వీకరిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీనిని ఈ జనవరి 1వ తేదీ నుంచే అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. పెండింగ్‌ డీఏలన్నింటినీ ఈ నెల నుంచే చెల్లిస్తామని చెప్పారు.

సొంత ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10% రిజర్వ్‌ చేయడమే కాకుండా 20% రిబేటుతో ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఆర్సీపై గురువారం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించిన సీఎం జగన్‌.. రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని చెప్పినప్పటకీ, గంటల వ్యవధిలోనే ప్రకటన చేశారు.  శుక్రవారం ఉదయం సీఎస్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై చర్చించిన ముఖ్యమంత్రి జగన్‌.. మధ్యాహ్నం ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమై వారి సమక్షంలోనే పీఆర్సీ ఫిట్‌మెంట్‌తో పాటు  పలు సమస్యలను పరిష్కరిస్తూ స్పష్టమైన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే.. 

ఉద్యోగుల ఆకాంక్షలతో పాటు వాస్తవ పరిస్థితి బేరీజు
► నిన్నటి సమావేశం తర్వాత నా కుటుంబ సభ్యులైన ఉద్యోగుల ప్రతినిధులుగా మీరు చెప్పిన అన్ని అంశాలపైనా నిన్ననే (గురువారం) సుదీర్ఘంగా కూర్చొని అధికారులతో చర్చించాను. ఈ ఉదయం (శుక్రవారం) కూడా మరో విడత అధికారులతో మాట్లాడాను. 
► 2–3 రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని చెప్పినప్పటికీ, ఎంత వీలైతే అంత త్వరగా చెబితే మంచిదని భావించి ఈ ఉదయం సమావేశం పెట్టాను. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడ్డ సంక్లిష్ట సమస్యలు, కోవిడ్‌ కారణంగా తలెత్తిన ప్రతికూల పరిస్థితులు, ఒమైక్రాన్‌ ప్రభావం దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతుందనే పరిస్థితుల మధ్య మనం ఉన్నామని నిన్ననే చెప్పాను.
► ప్రభుత్వ పాలనలో ఉద్యోగులు ఒక భాగం. సంక్షేమం, అభివృద్ధి సంతృప్తికరంగా అందాలంటే.. ఉద్యోగుల సహాయ సహకారాలతోనే సాధ్యం. అది లేకపోతే సాధ్యంకాదు. మా కుటుంబ సభ్యులుగానే మిమ్మల్ని అందర్నీ భావిస్తాను. ఇది మీ ప్రభుత్వం. ఈ భరోసా ఎప్పటికీ ఉండాలన్నదే నా భావన. నిన్న పీఆర్సీతో సహా కొన్ని అంశాలు మీరు లేవనెత్తారు. వాటిని కూడా పరిష్కరించే దిశగా సీఎస్‌తో, ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడాను. స్పష్టమైన టైంలైన్స్‌ పైన కూడా మాట్లాడాను. 

సీఎస్‌ కమిటీ చెప్పిన దాని కన్నా 9 శాతం అదనం 
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 14.29 శాతం మించి ఫిట్‌మెంట్‌ ఇవ్వలేమని.. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితులు, సమస్యలను అన్ని కోణాల్లో క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఒక వాస్తవిక ఫిగర్‌ను వారు చెప్పినప్పటికీ.. అటు ఉద్యోగుల ఆకాంక్షలను, ఇటు రాష్ట్ర వాస్తవ ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుని, ఉద్యోగులకు వీలైనంత మంచి చేయాలన్న తపన, తాపత్రయంతో ఫిట్‌మెంట్‌ను 23 శాతంగా నిర్ణయించాం.
►అధికారుల కమిటీ చెప్పిన 14.29 శాతం కన్నా దాదాపు 9 శాతం పెంచి ఫిట్‌మెంట్‌ ఇస్తున్నాం. ఉద్యోగ సోదరులు సవినయంగా అర్థం చేసుకోవాలి.

కొత్త జీతాలు ఈ నెల నుంచే.. 
►2018 జూలై 1 నుంచి పీఆర్సీ, 2020 ఏప్రిల్‌ 1 నుంచి మానిటరీ బెనిఫిట్‌ అమలు చేస్తాం. కొత్త జీతాలు ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఈ నిర్ణయాల వల్ల సంవత్సరానికి రూ.10,247 కోట్లు రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు భారం పడుతున్నప్పటికీ ఉద్యోగులకు మంచి చేయాలని, ఈ బాధ్యతను స్వీకరిస్తున్నాను.
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం సవరించిన జీతాలు ఇవ్వాలని ప్రతిపాదించినప్పటికీ ఉద్యోగుల ఆకాంక్షల మేరకు 10 నెలల ముందే, అంటే ఈ నెల నుంచే ఆ  జీతాలు ఇవ్వాలని ఆదేశించాను. 
► కొత్త స్కేల్స్‌ను రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా 2022 జనవరి 1 నుంచే అమలు చేయాలని నిర్ణయించాం. 

21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్‌ 
►సీఎస్‌తో కూడిన అధికారుల కమిటీ 2022 అక్టోబర్‌ నుంచి కొత్త పీఆర్సీ ప్రకారం మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని చెప్పింది. అయితే మీ అందరి ప్రభుత్వంగా 2020 ఏప్రిల్‌ నుంచే.. అంటే 21 నెలల ముందు నుంచే మానిటరీ బెనిఫిట్స్‌ ఇవ్వాలని నిర్ణయించాం.
► గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ జూన్‌ 30 లోగా ప్రొబేషన్, కన్ఫర్మేషన్‌ ప్రక్రియను పూర్తి చేసి, సవరించిన విధంగా రెగ్యులర్‌ జీతాలను (న్యూ పేస్కేలు) ఈ ఏడాది జూలై జీతం నుంచి ఇస్తాం.
► ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్‌ బకాయిలు, పీఎఫ్, జీఎల్‌ఐ, లీవ్‌ ఎన్‌క్యాష్‌మెంట్‌ తదితరాలన్నీ ఏప్రిల్‌ నాటికి పూర్తిగా చెల్లించాలని ఆదేశించాను. 
►పీఆర్సీ అమలు చేసే నాటికి పెండింగ్‌ డీఏలు ఉండకూడదని నిన్న (గురువారం) మీతో (ఉద్యోగ సంఘాలతో) చెప్పిన విధంగా.. అన్ని డీఏలను ఒకేసారి జనవరి జీతంతో కలిపి ఇవ్వాలని చెప్పాను. 

 
సొంత ఇల్లు లేని వారికి స్థలాలు
►సొంత ఇల్లులేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వమే అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌లో– ఎంఐజీ లే అవుట్స్‌లోని ప్లాట్లలో 10 శాతం రిజర్వ్‌ చేస్తాం. అంతే కాకుండా 20 శాతం రిబేటును ఇవ్వాలని నిర్ణయించాం. 
►నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకుంటాం. ఉద్యోగులు ఎవ్వరికీ కూడా ఇంటి స్థలం లేదనే మాట లేకుండా చూస్తాం. ఆ రిబేటును ప్రభుత్వం భరిస్తుంది.

కారుణ్య ఉద్యోగాలు
►కోవిడ్‌ కారణంగా మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లోని వారికి కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పిస్తున్నాం. జూన్‌ 30లోగా ఈ నియామకాలన్నీ పూర్తి చేయాలని ఆదేశించాను. మీ అందరి సమక్షంలో మళ్లీ చెబుతున్నా. 
►ఈహెచ్‌ఎస్‌– ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీంకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి చీఫ్‌ సెక్రటరీ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నాం. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించాలని చెప్పాం. ఈ కమిటీ ఉద్యోగుల ప్రతినిధులతో మాట్లాడి, వారి సూచనలు, సలహాల ప్రకారం మంచి పాలసీ వచ్చేలా చూస్తుంది.
►సీపీఎస్‌కు సంబంధించి కూడా టైంలైన్‌ పెట్టుకోవాలి. ఇప్పటికే కేబినెట్‌ సబ్‌ కమిటీ వేశాం. జూన్‌ 30లోగా ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాం. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, ఆర్థిక శాఖ అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

ఇకపై సెంట్రల్‌ పే రివిజన్‌ కమిషన్‌ ప్రతిపాదనలే 
►కేంద్రం ప్రభుత్వం విస్తృత ప్రాతిపదికను, డైవర్స్‌ క్రైటీరియా పరిగణలోకి తీసుకుని సైంటిఫిక్‌ పద్ధతుల్లో ఒక వ్యక్తి కాకుండా, ఏకంగా కమిటీ వేసి, ఆ కమిటీ ద్వారా సెంట్రల్‌ పే రివిజన్‌ కమిషన్‌ ప్రతిపాదనలను అమలు చేస్తుంది. 
►దాన్ని యథాతథంగా తీసుకుని ఇప్పటికే అనేక రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి. ఇక నుంచి ఈ పద్ధతిలోనే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పయనించాలని నిర్ణయించింది. 

మీరంతా సుదీర్ఘ కాలం ప్రజా సేవలో జీవితం గడపిన వ్యక్తులు. మీకు ఇంకా మంచి చేయడానికి, మీ అనుభవాన్ని ఈ రాష్ట్రానికి ఆస్తిగా భావించి, మీ సేవలను మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్న నిర్ణయంతో రిటైర్‌మెంట్‌ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాం. అన్ని రకాలుగా మీకు మంచి చేయాలనే ఉద్దేశంతో 2022 జనవరి 1 నుంచే ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం.

కనీస మూల వేతనం 53.84 శాతం పెంపు 

 రాష్ట్ర ప్రభుత్వం 23% ఫిట్‌మెంట్‌ ప్రకటించడంతో ఉద్యోగుల కనీస మూలవేతనం 53.84% అంటే రూ.7 వేలు పెరగనుంది. గరిష్ట మూలవేతనం 35.01 శాతంగా రూ.59,730 పెరగనుంది. ఈ పెరుగుదలకు సంబంధించి ఏ క్షణంలోనైనా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం వైఎస్‌ జగన్‌ 23 శాతం ఫిట్‌మెంట్‌ ప్రకటించడంతో తమకు ఎంత మేర జీతం పెరుగుతుందోనని ఉద్యోగులు లెక్కలు వేసుకుంటున్నారు. 11వ పీఆర్సీ కమిటీ నాలుగో తరగతి ఉద్యోగికి ఇవ్వాల్సిన కనీస మూల వేతనం రూ.20 వేలు, ఉన్నత స్థాయిలో పనిచేసే ఉద్యోగి గరిష్ట మూలవేతనం రూ.1.79 లక్షలుగా మాస్టర్‌ స్కేల్‌ను ఖరారు చేసింది.

అంతకుముందు 2015లో ఇచ్చిన పీఆర్సీలో రూ.13 వేలు ఉన్న కనీస మూలవేతనాన్ని 11వ పీఆర్సీ రూ.20 వేలకు పెంచింది. గరిష్ట వేతనం గత పీఆర్సీలో రూ.1,10,850 ఉండగా ఇప్పుడు రూ.1.79 లక్షలకు పెరగనుంది. అంటే రూ.68,150 పెరుగుదల అధికంగా ఉండనుంది. ఈ మేరకు వేతన స్థిరీకరణ జరగనుంది. గత పీఆర్సీ సిఫారసుల్లో కొత్తగా ఉద్యోగంలో చేరే నాలుగో తరగతి ఉద్యోగి కనీస మూల వేతనం రూ.13 వేలుగా ఉంది. వీరికి బేసిక్‌ పే రూ.7 వేలు పెరగనుంది.

2018 జూలై 1 వరకు ఉన్న డీఏ విలీనం 
కొత్త పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమలు చేయనున్నారు. అప్పటి మూలవేతనం ఆధారంగానే వేతన సవరణ జరగనుంది. ఈ తేదీ నాటికి ఉన్న కరువు భత్యం (డీఏ)ను కొత్త వేతనంలో విలీనం చేస్తారు. 2018 జూలై ఒకటో తేదీ వరకున్న డీఏ 30.392% కొత్త వేతనంలో కలుస్తుంది. ఈ డీఏను, 23 శాతం ఫిట్‌మెంట్‌ను పాత బేసిక్‌ పేతో కలిపి కొత్త మూల వేతనాన్ని నిర్ధారిస్తారు.  

ఫిట్‌మెంట్‌ అంటే..  
ఎప్పటికప్పుడు పెరిగే నిత్యావసరాల ధరలు, ఇతర ఖర్చుల ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చేసే జీతాల పెంపును ఫిట్‌మెంట్‌ అంటారు. కేంద్రం పదేళ్లకు ఒకసారి, ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లకోసారి వేతన సవరణ చేస్తోంది. నిర్ణీత గడువు నాటికి ఉద్యోగికి ఉన్న మూల వేతనానికి అప్పటికి ఉన్న డీఏను, ఫిట్‌మెంట్‌గా ఇచ్చే మొత్తాన్ని కలిపి కొత్త మూలవేతనాన్ని నిర్ధారిస్తారు. అయితే ఉద్యోగుల మూల వేతనాలకు సంబంధించి నిర్ణీత పేస్కేల్‌ ఉంటుంది. ఉద్యోగి కొత్త మూల వేతనాన్ని ఆ పేస్కేల్‌లో ఉన్న మొత్తానికి సర్దుబాటు చేస్తారు. దీనికి ఇతర అలవెన్సులు కలిపి మొత్తం జీతాన్ని లెక్కిస్తారు.

ఉదాహరణకు మధ్యస్థాయి ఉద్యోగి మూలవేతనం రూ.44,250గా ఉంది. అతనికి 2018 జూలై 1 నాటికి ఉన్న 30.392 శాతం డీఏ అంటే రూ.10,177.. 23 శాతం ఫిట్‌మెంట్‌ అంటే రూ.13,448.. మొత్తం కలిపి రూ.23,625ను మూల వేతనానికి కలుపుతారు. అప్పుడు రూ.67,875 అతని కొత్త బేసిక్‌పే అవుతుంది. కానీ మాస్టర్‌స్కేల్‌లో ఈ బేసిక్‌ పే లేదు. దానికన్నా తక్కువ ఉన్న రూ.65,360, ఆపై రూ.70,850 బేసిక్‌పేలు ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు పైన ఉండే స్కేల్‌ను వర్తింపజేస్తారు. దీని ప్రకారం ఆ ఉద్యోగికి రూ.70,850 మూలవేతనం,  అలవెన్సులు కలిపి పూర్తివేతనాన్ని నిర్ధారిస్తారు.   

ఇదీ మాస్టర్‌ స్కేల్‌..  
11వ పీఆర్సీ కమిటీ ఉద్యోగుల మాస్టర్‌ స్కేల్‌ను 32 గ్రేడ్లు, 83 స్టేజ్‌లుగా ఖరారు చేసింది. ప్రస్తుతం ఉన్న మూలవేతనం, వార్షిక ఇంక్రిమెంట్‌ ఇతర అంశాల ఆధారంగా.. ఆ తర్వాత ఉండాల్సిన కనీస మూల వేతనాలను ఖరారు చేసింది. కొత్త పే స్కేల్‌లో బేసిక్‌ పే, 100శాతం డీఏ (2018 జూలై 1 నాటికి ఉన్నది), ఫిట్‌మెంట్‌ కలిసి ఉంటాయి.  

మాస్టర్‌ స్కేల్‌.. 
20,000–600–21,000–660–23,780–720–25,940–780–28,280–850–30,830–920–33,590–990–36,560–1,080–39,800–1,170–43,310–1,260–47,090–1,350–51,140–1,460–55,520–1,580–60,260–1,700–65,360–1,830–70,850–1,960–76,730–2,090–83,000–2,240–89,720–2,390–96,890–2,540–1,04,510–2,700–1,12,610–2,890–1,21,280–3,100–1,30,580–3,320–1,40,540–3,610–1,54,980–3,900–1,70,580–4,210–1,79,000 (83 స్టేజిలు) 

 

కొత్త పే స్కేలు.. ఉద్యోగ భద్రత  

 రెండేళ్ల క్రితం రికార్డు స్థాయిలో ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న లక్ష మందికిపైగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల మరో కల కూడా నెరవేరబోతుంది. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారికి ఈ ఏడాది జూన్‌ 30లోగా ప్రొబేషనరీ ప్రకటించి పే స్కేల్‌ వర్తింపజేస్తామంటూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటనపై హర్షం వ్యక్తమవుతోంది.

ప్రొబేషనరీ పూర్తి చేసుకున్నట్లు ప్రకటన తర్వాత ప్రస్తుతం రూ.15 వేల చొప్పున నెల వారీ జీతం అందుకుంటున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు  నిర్ణీత పే స్కేలు పరిధిలోకి వస్తారు. దీనికి తోడు వారంతా ప్రభుత్వ ఉద్యోగులకు ఉండే  పూర్తి స్థాయి ఉద్యోగ భద్రతను పొందడంతో కొత్తగా ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్‌ ఇన్సూరెన్స్‌ పరిధిలోకి వస్తారని అధికార వర్గాలు వివరించాయి. విధి నిర్వహణలో ఉద్యోగి మరణించిన పక్షంలో ఆ కుటుంబంలో మరొకరికి ఉద్యోగం దక్కే అవకాశం కూడా ఉంటుంది. 

నాలుగు నెలల్లో 1.34 లక్షల ఉద్యోగాలు..  
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజునే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాల్లో నియామకాలపై ప్రకటన చేశారు. ప్రమాణ స్వీకార సభలో ప్రకటించిన విధంగా అప్పటికప్పుడు 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను స్పష్టించారు. జూలైలో నోటిఫికేషన్‌.. సెప్టెంబర్‌ మొదటి వారం నుంచి రాత పరీక్షలు... 20 రోజుల్లో ఫలితాల ప్రకటన.. ఆ తరువాత మరో వారం రోజుల్లో ఎంపికైన వారికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం కూడా పూర్తయింది.

వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే దాదాపు లక్ష మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు దక్కాయి. మొదటి విడతలో మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి 2020 ఆరంభంలో తిరిగి నోటిఫికేషన్‌ జారీ చేసి ఆ ఏడాది చివరి కల్లా రెండో దశ నియామక ప్రక్రియను కూడా పూర్తి చేశారు. అప్పట్లో ఉద్యోగాలు పొందిన వారు తాజాగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన ప్రకటన మేరకు జూన్‌ నెలాఖరు కల్లా ప్రొబేషనరీని కూడా పూర్తి చేసుకోబోతున్నారు. 

ఉద్యోగులకు అత్యుత్తమ పీఆర్సీ : సజ్జల రామకృష్ణారెడ్డి

 ఉద్యోగులకు అత్యుత్తమ పీఆర్సీ అమలు చేసిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అధికారం కోసమే రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతోనే వచ్చానని సీఎం జగన్‌ పదేపదే చెప్తుంటారని, ఆ మాటలను ఆయన నిలబెట్టుకుంటున్నారని తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వం 20 శాతం ఐఆర్‌ ప్రకటిస్తే అధికారంలోకి రాగానే సీఎం జగన్‌ ఉద్యోగులకు 27 శాతం ఐఆర్‌ ఇచ్చి ఉద్యోగుల పక్షపాతిగా ఆనాడే నిలిచిపోయారని సజ్జల తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అన్నీ చూసుకునే సీఎం జగన్‌ ఈరోజు పీఆర్సీ ప్రకటన చేశారన్నారు. చెప్పిన దానికన్నా ఎక్కువ చేయాలని సీఎం జగన్‌కు ఉన్నా, పరిస్థితులు అనుకూలించలేదని చెప్పారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఊహించని రీతిలో కోవిడ్‌ వల్ల ఏర్పడ్డ విపత్కర పరిస్ధితి గురించి ప్రతి ఒక్కరూ ఆలోచించాలన్నారు. కరోనా వల్ల ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయని చెప్పారు. అయినా ఇచ్చిన హామీలను నిజాయితీగా అమలు చేయడంలో సీఎం ప్రథమ స్థానంలో ఉన్నారని చెప్పారు. ఉద్యోగుల విషయంలో ఏదో చెప్పేసి వదిలేయడం కాకుండా తర్వాత వచ్చే పరిస్ధితులకు బాధ్యత వహించాలని సీఎం భావించారన్నారు.

ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగంగా, తన కుటుంబ సభ్యులుగా సీఎం భావిస్తున్నారని తెలిపారు. ఉద్యోగులకు గరిష్టంగా ఎంత చేయాలో సీఎం అంతా చేశారన్నారు. ఎవరూ అడక్కపోయినా రిటైర్మెంట్‌ వయస్సును 60 నుంచి 62 ఏళ్లకు పెంచారన్నారు. దీనివల్ల ఉద్యోగులకు అదనపు ప్రయోజనం ఉంటుందని చెప్పారు. ఉద్యోగుల సర్వీసు రెండేళ్లు పెంచటం అనేది వైఎస్‌ రాజశేఖరరెడ్డి, వైఎస్‌ జగన్‌ లాంటివారే చేయగలరని తెలిపారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వాలన్నా, వారికి పర్మినెంట్‌ చేయాలన్నా ఒక్క సీఎం జగన్‌కే సాధ్యమని చెప్పారు. ఇప్పటికే లక్షలాది ఉద్యోగాలు ఇచ్చామని, మరిన్ని ఉద్యోగాలకు జాబ్‌ కేలండర్‌ కూడా ప్లాన్‌ చేస్తున్నామని సజ్జల తెలిపారు. 1.30 లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలను ఏ ప్రభుత్వమూ ఇచ్చి ఉండదన్నారు.

వైద్య రంగంలో 40 వేల ఉద్యోగాలు సృష్టించి ఇచ్చామని చెప్పారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల సమస్యలనూ సీఎం నెరవేర్చారని తెలిపారు. చేసేది ఏదైనా నిజాయితీగా, పారదర్శకంగా చేయాలన్నది జగన్‌ లక్ష్యమన్నారు. అందువల్లే 2014లో తాము ఎన్ని చెప్పినా, రుణమాఫీ లాంటి హామీలు ఇవ్వలేదని తెలిపారు. చంద్రబాబులా తప్పుడు హామీలు ఇవ్వడానికి జగన్‌ ఒప్పుకోరని చెప్పారు. ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజీనామా చేయాలని తాము ముందు నుంచీ కోరుతున్నామన్నారు. ఆయన రాజీనామా చేస్తేనే ఎవరేమిటో ప్రజలకు తెలుస్తుందని తెలిపారు. పవన్‌తో పొత్తు కోసం చంద్రబాబు చకోర పక్షిలాగా ఎంతగానో ఎదురు చూస్తున్నారని దుయ్యబట్టారు. పవన్‌ కళ్యాణ్‌ పట్ల చంద్రబాబు వన్‌ సైడ్‌ లవ్‌ ప్రదర్శిస్తున్నారని చెప్పారు. అవసాన దశలో ఉన్న చంద్రబాబు పరిస్ధితి చూస్తే జాలేస్తోందన్నారు.

Back to Top