అమరావతి: వికేంద్రీకరణ ప్రాంతీయ సమానాభివృద్ధి బిల్లులకు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదం తెలిపారు. ఇటీవల రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలిపిన బిల్లులను పరిశీలించిన గవర్నర్ తన ఆమోద ముద్ర వేశారు. తాజా నిర్ణయంతో రాష్ట్రమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని ప్రాంతాల ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇకపై పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, శాసన రాజధానిగా అమరావతి, న్యాయ రాజధానిగా కర్నూలు ఆవిర్భవించనున్నాయి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, సమాన అభివృద్ధి లక్ష్యంగా పరిపాలన వికేంద్రీకరణను దృష్టిలో ఉంచుకుని మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయం తీసుకోవడం, దానికి గవర్నర్ ఆమోద ముద్ర వేయడంతో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. సీఎం వైయస్ జగన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. మిఠాయిలు పంచుకొని వేడుకలు చేసుకుంటున్నారు. గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న అన్ని వర్గాలు విస్తృత ప్రజామోదంతో పరిపాలన వికేంద్రీకరణ ద్వారా రాష్ట్ర చరిత్రలో కొత్త అధ్యాయం మొదలైంది. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను గవర్నర్ ఆమోదించడంతో రాష్ట్రవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మూడు ప్రాంతాల్లోని ప్రజలు స్వాగతిస్తున్నారు. విద్యార్థులు, యువత, మేధావులు, రైతులు, కార్మికవర్గాలు, సామాన్యులు...ఇలా అన్ని వర్గాలు గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతించాయి. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. కర్నూలు: ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంబరాలు జరుపుకుంటూ హర్షాతిరేకాలు ప్రకటిస్తున్నారు. మూడు ప్రాంతాల ప్రజలు పాలనా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల అభివృద్ధికి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. పశ్చిమగోదావరి: ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున సంబరాలను నిర్వహించింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడంతో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, స్వీట్లు పంచుకుని, బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. కర్నూలు జిల్లా: పాలన వికేంద్రీకరణతో మూడు ప్రాంతాల అభివృద్ధికి బాటలు వేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే చెరుకులపాడు శ్రీదేవి, వైఎస్సార్సీపీ నేత ప్రదీప్ రెడ్డి పాలాభిషేకం చేశారు. ►జిల్లాలోని నందికొట్కూరులో పటేల్ కూడలి వద్ద వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ నాయకులు, లాయర్ బార్ అసోసియేషన్ సభ్యులు బాణా సంచా పేల్చి, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ►కర్నూలును జ్యుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించినందుకు ఆదోని బార్ అసోసియేషన్ సీఎం జగన్కు ధన్యవాదాలు తెలిపింది. ఇది కర్నూలు న్యాయవాదుల, ప్రజల చిరకాల కోరిక. మా ఆందోళనకు సహకరించిన అన్ని సంఘాల సంఘ ప్రజలకు, అన్ని పార్టీ ప్రజలకు మా కృతజ్ఞతలు అంటూ ఆదోని బార్ అసోసియేషన్ మూడు రాజధానులను స్వాగతించింది. ►రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆళ్ళగడ్డ నాలుగు రోడ్ల కూడలిలో టపాకాయలు కాల్చి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ జిల్లా: మూడు రాజధానుల బిల్లుకు గవర్నర్ ఆమోదంపై కడపలో వైఎస్సార్సీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. రాజధాని వికేంద్రీకరణ బిల్లును గవర్నర్ ఆమోదించడాన్ని స్వాగతిస్తూ వైసీపీ కడప పార్లమెంటు అధ్యక్షులు సురేష్ బాబు అధ్యక్షతన నగరంలో కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు.