రాజధాని లో ఘొల్లుమంటున్న యువతరం

పచ్చని భూముల కోసం ఎన్నెన్నో మోసాలు

రైతు కుటుంబాల్లో ఆవేదన
పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

విజయవాడ: రాజధాని ప్రాంతంలో భూములు లాక్కొనేందుకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన కుట్రలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. భూములు ఇస్తే ఆయా రైతు కుటుంబాల్లోని చదువుకొన్న యువతకు ఉద్యోగాలు ఇస్తామని టీడీపీ నాయకులు నమ్మబలికారు.

పచ్చని భూముల కోసం మోసాలు
పచ్చిన భూముల్ని లాక్కొనేందుకు కంకణం కట్టుకొన్న తెలుగుదేశం నాయకులు ఎన్నెన్నో కల్లబొల్లి కబుర్లు చెప్పారు. రైతులందరికీ భూములు ఇచ్చిన చోటనే ప్లాట్లు ఇస్తామని, వెంటనే కౌలు చెక్కులు పంపిణీ చేస్తామని, అందరికీ రుణమాఫీ చేసేస్తామని, వ్యవసాయ కూలీలకు పెన్షన్ ఇస్తామని, అన్నార్తులకు రూ. 5కే భోజనం పెట్టిస్తామని హామీలు ఇచ్చారు. ఇదే కోవలో రైతుల కుటుంబాలకు చెందిన వారిలో విద్యావంతులు ఉంటే వెంటనే ఉద్యోగాలు కల్పిస్తామని గొప్పలు చెప్పారు. ఇది నమ్మిన రైతులు తమ పిల్లల్ని వెంటనే రాజధాని ప్రాంతానికి పిలిపించారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడల్లో ఉద్యోగాలు చేసుకొనేవారు, సాంకేతిక కోర్సుల్లో శిక్షణ తీసుకొంటున్నవారు.. అర్థాంతరంగా నిలిపివేసి గ్రామాలకు వెళ్లి అప్లయ్ చేసుకొన్నారు.

మోసానికి మార్గం
పొలాలు ఇచ్చిన రైతు కుటుంబాలకే అర్హత అంటూ కొత్త దందా కు తెరదీశారు. దీంతో పెద్ద ఎత్తున రైతులు తమ పొలాని ప్రభుత్వానికి అప్పగించేశారు. తర్వాత ఈ విద్యార్థులు, యువత నుంచి దరఖాస్తులు సేకరించారు. తర్వాత పరీక్షలు, ఇంటర్వ్యూలు అంటూ బాగానే హడావుడి చేశారు. గుంటూరు లోని లామ్ ఫామ్ లో తతంగం అంతా నడిపించి 190 మందిని ఎంపిక చేశారు. మొదటి బ్యాచ్ లో 160 మంది ఎంపిక అయ్యారని, మిగిలిన వారందరికీ తర్వాత కాలంలో ఉద్యోగాలు పరిగెత్తుకొంటూ వచ్చేస్తాయని హడావుడి చేశారు. ఈ 160 మందికి శిక్షణ మొదలెట్టారు. తర్వాత కాలంలో ఇవేమీ ఉద్యోగాలకు జరిగిన ఇంటర్వ్యూలు కానే కాదని, కేవలం నైపుణ్యాల పెంపునకు ఇస్తున్న శిక్షణ అని లెక్క తేలింది. దీంతో కోర్సు అలాగే విడిచి పాత ఉద్యోగాల్ని వెదక్కొంటూ చాలా మంది వెళ్లిపోయారు. చివరగా శిక్షణ పూర్తి చేసుకొన్న అభ్యర్థులకు సర్టిఫికేట్లు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొన్నారు.

పోరాట బాట
దీంతో ఈ నిరుద్యోగులంతా ఇప్పుడు సంఘంగా ఏర్పడ్డారు. చంద్రబాబు చేసిన మోసాన్ని ఎండగడుతూ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి జరిగినబాగోతాన్ని వెల్లడించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి తమను ఆదుకోవాలని విన్నవించారు. నమ్మి భూములు ఇచ్చిన పాపానికి తమ కుటుంబాల్ని ఉసురు పెట్టవద్దని వేడుకొన్నారు. మరి, చంద్రబాబు కఠిన మనస్సు ఇటువంటి వేడుకోలుతో కరుగుతుందా లేదా అన్నది చూడాల్సిందే..!

Back to Top