హైదరాబాద్) గత చంద్రబాబు పరిపాలన లోని అంశాలు నెమ్మదిగా పునరావ్రతం అవుతున్నాయి. సమస్యలు తీర్చమన్నందుకు గతంలో అంగన్ వాడీ మహిళల్ని చంద్రబాబు ప్రభుత్వం గుర్రాలతో తొక్కించింది. ఇప్పుడు అదే అంశం అందరి కళ్ల ముందు మెదలుతోంది. ఆందోళన పథంలో ఉన్న మహిళల్ని ఎక్కడికక్కడ పోలీసులు వేధిస్తున్నారు. ప్రజాస్వామ్యయుతంగా నిరాహార దీక్షలు చేస్తున్న వారిని ఈడ్చి పారేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వేతనాల పెంపు కోసం అంగన్ వాడీ మహిళలు ఆందోళన చేపట్టారు. తెలంగాణ లో వెంటనే వేతనాల్ని పెంచేందుకు నిర్ణయం తీసుకొన్నారు. చంద్రబాబు ప్రభుత్వం జాప్యం చేయటంతో అంగన్ వాడీ కార్యకర్తలు, ఆయాలు ఆందోళన్ని ఉధ్రతం చేశారు. దీంతో ఆగస్టు నెలలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తరపున హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన్ని విరమించి అంగన్ వాడీ ఉద్యోగులు విధుల్లో చేరిపోయారు. నెలలు గడుస్తున్నాయి కానీ, వేతనాల పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు మాత్రం విడుదల కాలేదు. దీంతో అంగన్ వాడీ ఉద్యోగుల్లో అసహనం పెరుగుతూ వచ్చింది. ఆగస్టు మొదటివారంలో హామీ ఇచ్చిన ప్రభుత్వం మూడు నెలల దాకా ఉత్తర్వులు విడుదల చేయకపోవటంతో వేతనాల పెంపు నిర్ణయం అమల్లోకి రాలేదు. దీంతో జిల్లాల్లో ఎక్కడికక్కడ అంగన్ వాడీలు ఆందోళనలు చేపడుతున్నారు. రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు.ఇక్కడ అంగన్ వాడీ మహిళలు అడుగుతున్నది గొంతెమ్మ కోర్కె కానే కాదు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ ని అమలు చేయమని అడుగుతున్నారు. ప్రచారం కోసం హామీ ఇచ్చిన ప్రభుత్వం ఆచరణలో మొండి చేయి చూపించటమే కాకుండా, ఇప్పుడు ఆందోళన చేస్తున్న మహిళల మీద జులుం ప్రదర్శిస్తోంది. పోలీసుల్ని రంగంలోకి దింపి ఎక్కడికక్కడ ఆందోళన శిబిరాల్ని తొలగించేందుకు ప్రయత్నాలు సాగిస్తోంది.