మహానేత కనుమరుగయ్యాక పట్టించుకునే వారే లేరు

పత్తికొండ: ఎవరిని కదిలించినా ఒకటే మాట.. మహానేత దివికేగిన తర్వాత తమ బాధలు పట్టించుకునే వారే లేకపోయారనేది ఆ మాట. చదువు ఆగిపోయిందనీ, పని దొరకడం లేదనీ, మోసం చేస్తున్నారనీ, ఇలా తమ బాధలను వెళ్ళబోసుకుంటున్నారు. ఇరవై మూడో రోజు పాదయాత్ర మార్గం మధ్యలో తగర్రాయికి చెందిన కూలీలు చేనులో పనిచేస్తుండగా.. షర్మిల రావడంతో వారంతా తమ బాధలు వినిపించారు. ఉపాధి హామీ కింద రూ. 30 కూలి ఇస్తున్నారని వాపోయారు. వారి సంభాషణ సాగిందిలా..

షర్మిల:

ఏమ్మా.. కరువు పని దొరుకుతోందా?

మహిళ: దొరికినా ఏం లాభం ఉండదమ్మా... కూలి రూ. 30 పడుతాంది. 10 మందితో పని చేయించుకుని 20 మంది పేర్లు రాసి వచ్చిన దుడ్లు మాకు సగమిచ్చి సగం తీసేసుకుంటాండారు.

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు ఎంత పడిందమ్మా..

మహిళ: రూ. 70 నుంచి 100 వరకు ఇచ్చినారమ్మా..

షర్మిల: కరెంటు బిల్లు ఎంతొస్తుందమ్మా..

మహిళ: రూ. 300 వస్తాంది. బుగ్గకని(బల్బు), ఫ్యాన్‌కని వే స్తాండారు.

షర్మిల: రాజన్న ఉన్నప్పుడు ఎంతొచ్చిందమ్మా..?

మహిళ: ఇంతకుమునుపు రూ. 50, రూ. 60, రూ. 70 కట్టినాం. ఇప్పుడైతే ఏం తెలియనోళ్లమని రూ. 500 కట్టించుకుంటాండారు.

షర్మిల: ఇది శ్రమదోపిడీ కదా. రాబందుల రాజ్యం ఇది. పీక్కుతింటున్నారు.

మహిళ: ఎండనక వాననక కడప, గుంటూరు వలసపోతాండాం. కొందరు హైదరాబాద్ వెళుతుండారు. కానీ పశువులను ఇడిచి హైదరాబాద్ ఎట్లా పోయేది.

ఓ వృద్ధురాలు: దేవుడున్నంతసేపు(వైయస్‌ను ఉద్దేశించి) బాగుండాది.. దేవుడు పోయినాడు.. మా బతుకులు ఇట్లా మిగిలినాయి.

షర్మిల: చంద్రబాబు హయాంలో 4 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడూ అదే పరిస్థితి ఎదురవుతోంది. సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధిచెప్పి జగనన్నను ఆశీర్వదిస్తే మళ్లీ మనకు మంచిరోజులొస్తాయి.

అఫ్రీన్ చదువు ఆగిపోయింది..

     అగ్రహారం గ్రామానికి చెందిన నిరుపేద అయిన ఇమాంసాహెబ్ కుమార్తె అఫ్రీన్ పదో తరగతిలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. ఇంటర్ బైపీసీలో 72.5 శాతం మార్కులతో పాసైంది. ఎంసెట్‌లో ర్యాంకు సాధించింది. కానీ ఇప్పుడు చదువు ఆగిపోయింది. పాదయాత్ర చేస్తున్న షర్మిలకు ఎదురేగి ఆమె ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంది. ‘ఇంటర్‌లో మంచి మార్కులు తెచ్చుకున్న నేను బీ-ఫార్మసీ చేద్దామనుకున్నా. కానీ కేవలం డబ్బులు లేక చదువు ఆగిపోయింది. హైదరాబాద్‌లో సీటొచ్చిందని కబురొచ్చింది. కానీ ఫోన్ చేసి వివరాలు కనుక్కుంటే రూ. 2లక్షలు కట్టాలన్నారు. దాంతో ఇక చదువు ఆపేశా..’ అని చెప్పడంతో షర్మిల స్పందిస్తూ పూర్తి వివరాలు తెలుసుకుని అమ్మాయి చదువు మళ్లీ కొనసాగేలా చేస్తామని చెప్పారు.

చిన్నారి ప్రాణాలు నిలబెట్టరట..: ఎం.అగ్రహారం గ్రామంలో రఘువర్ధన్, సుజాత దంపతులు షర్మిలను కలిసి ‘ఆరోగ్య శ్రీ’ అందకపోవడంతో తమ కూతురు సాయిలక్ష్మి(10) తమకు దక్కదేమోనని భయమేస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు. ‘నాలుగేళ్ల క్రితం రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ కింద పాపకు గుండె ఆపరేషన్ చేయించాం. దాదాపు రూ.5.70 లక్షలు ప్రభుత్వమే భరించింది. కానీ పాప గుండె కుడిపక్కన ఉండడం, వాల్వ్ చిన్నగా ఉండడంతో రెండోసారి ఆపరేషన్ చేయించాలని అప్పుడే చెప్పారు. రూ. 4 లక్షలు ఖర్చవుతుంది. కానీ అపోలో ఆస్పత్రికి వెళితే రెండోసా రి చేయలేమని తిప్పిపంపిస్తున్నారు’ అని ఆమె వాపోయింది. సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స చేయిం చేందుకు యత్నిస్తామని షర్మిల హామీ ఇచ్చారు.

దళారులకే టమాటా గిట్టుబాటు:
ఎడవల్లి క్రాస్‌లో రైతులు షర్మిల వద్దకు వచ్చి తమ సమస్యలు వివరించారు. టమాటా పంట పెడుతూ ఏటా నష్టపోతూనే ఉన్నామని, మార్కెట్లో టమాటా రూ.7 నుంచి రూ. 10 ఉన్నా.. రైతుల వద్ద మాత్రం కిలో రూ. 1, రూ. 2 చొప్పున దళారులు కొనుగోలు చేస్తున్నారని వాపోయారు. దీనికి షర్మిల స్పందిస్తూ జగనన్న వస్తే మళ్లీ రైతు రాజ్యమే వస్తుందని, టమాట పంటకు కూడా గిట్టుబాటయ్యేలా తగిన విధానం రూపొందిస్తాడని భరోసా ఇచ్చారు.

Back to Top