దిగుబడులు కరవు.. అప్పులు బరువు

ముద్దలాపురం:

‘వేరుశనగకు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. వైయస్ ఉన్నప్పుడు గ్రామం యూనిట్‌గా పంటల బీమా వల్ల పంట పండకపోయినా నష్టపరిహారం వచ్చేది. గ్రామాల్లో జ్వరాలు పెరిగిపోయాయి. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రైతుల లోగిల్లలో పంట దిగుబడులు లేవు.. అప్పులే మిగిలాయి’ అంటూ రైతలు షర్మిలకు సమస్యలను ఏకరువు పెట్టారు. గురువారం ఉదయం ముద్దలాపురంలో ఆమె రచ్చబండ నిర్వహించినపుడు రైతులు తమ కష్టాలు చెప్పుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు. షర్మిల వారిని ఓదార్చారు.  పాలక, ప్రతిపక్షాలు రెండూ రెండేనని ఆమె ధ్వజమెత్తారు. కొద్ది రోజులు ఓపిక పడితే జగనన్న సీఎం అవుతారనీ, మీ కష్టాలను కడతేరుస్తారనీ షర్మిల భరోసా ఇచ్చారు.
వైయస్ఆర్ వాటర్ ప్రాజెక్టు సందర్శన
     ముద్దలాపురం గ్రామం నుంచి షర్మిల వైయస్ఆర్ వాటర్ ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. అక్కడే భోజనం చేసి, కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షంలోనే పాదయాత్రను కొనసాగించారు. జల్లిపల్లి శివారులో గొర్రెల కాపరులతో ముచ్చటించారు. ‘అమ్మా.. వైయస్ ఉన్నప్పుడు గొర్రెకు రూ.18 చొప్పున కట్టించుకుని బీమా సౌకర్యం కల్పించేవారు. గొర్రె చనిపోతే నష్టపరిహారం ఇచ్చేవారు. గొర్రెలకు మందులు కూడా వేసేవారు. కానీ.. ఇప్పుడు బీమా రద్దు చేశార'ని ఆమెకు చెప్పారు. మందులు వేయడం లేదన్నారు.  ఒక్క గొర్రె చనిపోతే ఆరేడు వేల రూపాయల నష్టం వస్తోందనీ, అదే బీమా ఉంటే మాకు ఆ నష్టం జరిగేది కాదనీ తెలిపారు. కులవృత్తులను ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందన్నారు. టీడీపీ కూడా ప్రభుత్వానికే వంతపాడుతోందని ధ్వజమెత్తారు. 'జగనన్న సీఎం అవుతారు.. కులవృత్తులకు పెద్దపీట వేస్తారు. రాజన్న చేపట్టిన పథకాలను మళ్లీ చేపట్టి ఆదుకుంటారు’ అనడంతో గొర్రెల కాపర్ల కళ్లల్లో ఆనందం వెల్లివిరిసింది.
జనం కోసం జగనన్న దీక్షలు :

 అక్కడి నుంచి జల్లిపల్లికి చేరుకున్న షర్మిల అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. ‘జగనన్న రైతుల కోసం, విద్యార్థుల కోసం.. చేనేతల కోసం దీక్షలు చేశారు. పోరాటాలు చేశారు. వైఎస్ తరహాలోనే ప్రజల పక్షాన పోరాడి.. జనం హృదయాలను గెలుచుకున్నారు. దీన్ని చూసి ఓర్వలేక.. కాంగ్రెస్, టీడీపీలకు ఉనికి ఉండదనే భయంతోనే జగనన్నను సీబీఐతో అరెస్టు చేయించాయి. చివరకు బెయిల్ కూడా రాకుండా అడ్డుకుంటున్నాయి. దేవుడనేవాడు ఉన్నాడు. న్యాయం జరుగుతుంది. జగనన్న బయటకు వచ్చి.. రాజన్న రాజ్యాన్ని స్థాపిస్తారు’ అంటూ ప్రజలకు ధైర్యం చెప్పారు. జల్లిపల్లి సభ తర్వాత ఉదిరిపికొండకు చేరుకున్న షర్మిలకు ఆ గ్రామ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ గ్రామంలో రచ్చబండ నిర్వహించి.. సమస్యలు తెలుసుకున్నారు.

     ఉదిరిపికొండ రైతులు మాట్లాడుతూ ‘వైయస్ హయాంలో 99 శాతం పంట నష్టపరిహారం వచ్చింది. దీని వల్ల అప్పులు తీరాయి. కానీ.. ఇప్పుడు వాతావరణ బీమా వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. కరెంట్ సక్రమంగా ఇవ్వడం లేదు. రైతులు ఎలా బతకాలి’ అంటూ విలపించారు. ఇందుకు షర్మిల స్పందిస్తూ.. ‘మహానేత వైయస్ అధికారంలో ఉన్నా లేకున్నా రైతుల కోసం పోరాటం చేశారు. జగనన్న అదే తరహాలో పోరాటం చేస్తున్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మంచి రోజులు వస్తాయి’ అంటూ భరోసా ఇచ్చి ముందుకు కదిలారు.

Back to Top