విజయవాడ: రాజధాని ప్రాంతంలో సామాజిక ప్రభావ అధ్యయన సర్వే విషయంలో ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరిస్తోంది. గ్రామాల్లోని అందరినీ సర్వే చేయాల్సి ఉండగా, సమీకరణకు భూములు ఇవ్వని వారితోనే ఈ కార్యక్రమం ముగుస్తోంది. ఇందుకు గ్రామసభ పేరిట గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నిడమర్రు, బేతపూడి, ఉండవల్లి గ్రామాల్లో సర్వే సభలు నిర్వహించారు. దీన్ని రైతులు వ్యతిరేకించారు. నిడమర్రులో బహిష్కరించారు. ఉండవల్లిలో అభ్యంతరాలు నమోదు చేయించారు. ఈ విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి విచిత్రంగానూ, విడ్డూరంగానూ కనిపిస్తోంది. భూ సేకరణ వల్ల గ్రామాల్లో వచ్చే అన్ని రకాల మార్పులపైనా, ఉత్పన్నమయ్యే సమస్యలపైనా అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ సర్వే నిర్వహిస్తారు. రాజధాని పరిధిలో 29 రెవెన్యూ గ్రామాల్లో భూములు ఇవ్వని వారినే సభలకు పిలుస్తున్నారు. దీంతో రైతులు భయపడుతున్నారు. పూలింగును వ్యతిరేకించి భూములు ఇవ్వని వారిని పిలిచి భూములు లాక్కుంటామని చెబుతున్నారు. తాము ఇవ్వమంటే సభలు పెట్టి ఎందుకు బెదిరిస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో తాము భూములు ఇవ్వబోమని గ్రామ సభల్లో తీర్మానించామని, అది అమలు చేయాల్సిందేనని నిడమర్రులో కోరారు. అదే విషయాన్ని సభలోనూ తెలిపారు. ప్రస్తుతం జరీబు గ్రామాల్లో లింగాయపాలెం తదితర ప్రాంతాల్లో సమావేశాల నిర్వహణకు సిద్ధమయ్యారు. తాము భూములు ఇవ్వబోమని, ఇంకా ఎందుకు వేధింపులకు గురిచేస్తున్నారని రైతులు కార్యాలయం వద్ద సీఆర్డీఏ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని అధికారులు సమాధానమిస్తున్నారు. ఇప్పటికే నాలుగు గ్రామాల్లో సభలు పూర్తి చేశారు. ఎక్కడా రైతులు సహకరించలేదు. గ్రామసభ ద్వారా చట్ట ప్రకారం సమావేశం ముగించుకోవచ్చని అధికారులు నిర్ణయించారు. రాజధాని ప్రాంతంలో వ్యవసాయం వద్దా..?రాజధాని ప్రాంతంలో వ్యవసాయం చేయాలా... వద్దా చెప్పాలని వైయస్ఆర్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లాపరిషత్ సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును నిలదీశారు. గుంటూరులో శుక్రవారం జరిగిన జిల్లాపరిషత్ సమావేశంలో ఈ విషయమై తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. ఇప్పటికే 90 శాతం భూ సమీకరణ జరిగిందని, రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల్లో రైతులకు రుణాలివ్వబోమని మంత్రి పుల్లారావు స్పష్టం చేశారు. దీంతో ల్యాండ్ పూలింగ్ గ్రామాల్లో రుణాలివ్వబోమని రాసిస్తారా? అని ఆర్కే మంత్రిని నిలదీశారు. దానికి సమాధానం చెప్పలేక మంత్రి నీళ్లు నమిలారు. అంతేకాకుండా రాజధాని అభివృద్ధి విషయంలో సహకరించట్లేదంటూ అధికారపార్టీ నేతలు విషయాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించడం దారుణం.