బంతిపూల వనంలా జనం

కర్నూలు:

అనంతపురం జిల్లా నుంచి కర్నూలు జిల్లాలో అడుగిడిన మరో ప్రజా ప్రస్థానం అభిమానంతో తడిసి ముద్దయ్యింది. అడుగడుగునా మంగళ హారతులు.. జయజయ నినాదాలు... ప్రతి అడుగుకీ బంతిపూల స్వాగతాలు... తిరునాళ్లను తలపించింది. హోరుగా డప్పుల దరువులు, విచిత్ర వేషధారణలు.. కిలోమీటరు పొడవునా ఇసుకేస్తే రాలనంత జనం.. చూడ్డానికి ఓ మహా జాతర సాగుతోందనే భావన.... వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర గురువారం సాయంత్రం కర్నూలు జిల్లాలోకి ప్రవేశించినప్పుడు కనిపించిన దృశ్యమిది. ప్రజల సమస్యలు పట్టని ప్రభుత్వ వైఖరికి, దానితోనే కుమ్మక్కయిన టీడీపీ రాజకీయాలకు నిరసనగా వైయస్ జగన్ తరఫున పాదయాత్ర చేపట్టిన షర్మిలకు జిల్లా ప్రజానీకం ఘన స్వాగతం పలికింది.

ఎటుచూసినా కనుచూపు మేర నేల కనిపించని రీతిలో జన ప్రవాహం కిలోమీటరు మేర కిక్కిరిసిపోయింది. గురువారం ఉదయం 10.45కు అనంతపురం జిల్లా గుంతకల్లు సమీపంలో 22వ రోజు పాదయాత్ర ప్రారంభించిన షర్మిల 11.30కు కసాపురం చేరుకున్నారు. అక్కడ సభలో మాట్లాడిన తరువాత షర్మిల కసాపురం ఆంజనేయస్వామిని దర్శిం చుకున్నారు. అనంతరం కర్నూలు జిల్లా మరో రెండు కిలోమీటర్ల దూరంలో ఉండగా మధ్యాహ్న భోజనానికి ఆగారు. సాయంత్రం 4.40కి మద్దికెర సమీపంలో షర్మిల కర్నూలు జిల్లాలోకి ప్రవేశించేసరికి వేలాదిగా ఆ జిల్లా ప్రజలు తరలివచ్చి ఘనస్వాగతం పలికారు.

     షర్మిలను చూడాలని, పాదయాత్రలో కదం తొక్కాలని యువతీయువకులు, మహిళలు, రైతులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. షర్మిల జిల్లాలోకి అడుగు పెట్టిన ప్రాంతం నుంచి సభ ప్రాంతానికి వెళ్లడానికి మధ్య దూరం 3 కిలోమీటర్లు. అడుగు తీసి అడుగు వేయడానికి వీల్లేనంతలా జనం పోటెత్తడంతో ఆమె సభ ప్రాంతానికి చేరుకోవడానికి రెండుగంటలు పట్టింది. మద్దికెర సభలో షర్మిల మాట్లాడుతూ.. ‘జగనన్న మాట మేరకు ఈ మరో ప్రజాప్రస్థానం చేపట్టి వైయస్ఆర్ జిల్లా, అనంతపురం జిల్లా పూర్తిచేసుకుని ఈ జిల్లాలో అడుగుపెట్టగానే అపూర్వ స్వాగతం పలికారు. మీ ప్రేమ, ఆత్మీయతలు ఎన్నటికీ మరిచిపోలేం’ అని కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు తీరును, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు.

ఢిల్లీ వెడితే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్లా
     అమ్మా, వదిన ఢిల్లీ వెళితే కాంగ్రెస్‌తో కుమ్మక్కయినట్టా?: ‘మాట ఇవ్వడమంటే, దానిపై నిలబడడమంటే చంద్రబాబుకు ఈ జన్మలో అర్థం కాదు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చే సి ప్రభుత్వంతో కుమ్మక్కయి అబద్ధపు కేసులు, వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారు. పైగా వాళ్లంటారు జగనన్న కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారట. అందుకే అమ్మ, వదిన ఢిల్లీ వెళ్లారట. అసలు మీరు మనుషులా? మా లాయర్లు ఢిల్లీలో ఉంటే వారిని కలవడానికి వెళితే కూడా కుమ్మక్కయినట్టా? అలా కుమ్మక్కయి ఉంటే జగనన్న ఎప్పుడో కేంద్ర మంత్రో, ముఖ్యమంత్రో అయ్యేవారు. కుమ్మక్కయ్యింది మీరు.. అందుకే మీపై కేసులు ఉండవు. విచారణ ఉండదు. అందుకు ప్రతిఫలంగా మీరు ఈ ప్రభుత్వాన్ని కాపాడుతారు. అవిశ్వా సం పెట్టరు’’ అని బాబుపై షర్మిల నిప్పులు చెరిగారు.

రైతు కడుపు మీద కొడుతున్నారు
‘దారిలో ఓ టమాటా రైతును కలిశాను.. తాను పండించిన టమాటాలను కింద పారబోశాడు. కారణం.. దానికి ధర రాదట. కిలో ఒక్క రూపాయి వస్తుందట. ఈమాత్రం దానికి ఇంత తీసుకెళ్లి అమ్మడం ఎందుకని పారబోశామని చెప్పాడు. మనసుకు చాలా బాధేసింది. చాలా కష్టమనిపించింది. రాజన్న రైతుకు సకాలంలో ఎరువులు, విత్తనాలు ఇచ్చి, కరెంటు ఇచ్చి, గిట్టుబాటు ధర ఇచ్చి, దురదృష్టవశాత్తూ పంట నష్టపోతే పరిహారం ఇచ్చి రైతన్నకు అండగా నిలబడ్డాడు. కానీ వైఎస్ రెక్కల కష్టం మీద వచ్చిన ఈ ప్రభుత్వం రైతన్నను గాలికి వదిలేసింది. కడుపు మీద కొట్టి వేడుక చూస్తోంది’ అని షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు.

     కర్నూలు జిల్లా మద్దికెర వద్ద షర్మిలకు స్వాగతం పలికేందుకు తరలివచ్చిన నేతల్లో వైయస్‌ఆర్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత శోభా నాగిరెడ్డి, ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మాజీ ఎంపీ భూమా నాగిరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి, పత్తికొండ నియోజకవర్గ ఇన్‌చార్జి కోట్ల హరిచక్రపాణిరెడ్డి, మాజీ మంత్రి మారెప్ప, మాజీ ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎస్.వి.మోహన్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జిలు బుగ్గన రాజారెడ్డి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, ఎర్రబోతుల వెంకటరెడ్డి, జి.జయరామ్, పార్టీ నేతలు బుడ్డా శేషురెడ్డి, కర్రా హర్షవర్ధన్‌ రెడ్డి, ఎర్రకోట జగన్మోహన్‌ రెడ్డి, హఫీజ్ ఖాన్, సురేందర్ రెడ్డి, జయంతి వెంకటేశ్వర్లు తదితరులున్నారు.

Back to Top