బాబు హామీలు నీటి మూటలే


 అనంతపురంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర అప్రతిహతంగా సాగుతోంది. అన్ని వర్గాల ప్రజల నుంచి అపూర్వమైన ఆదరాభిమానాలు వెల్లువై కురుస్తున్నాయి. యువనేతను చూసేందుకు, స్వాగతించేందుకు గ్రామాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతుంటే, మరోవైపు వివిధ వర్గాల ప్రజలు వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. రైతులు, మహిళలు, కూలీలు, విద్యార్థులు, కాంట్రాక్టు లెక్చరర్లు, న్యాయవాదులు ఇలా ప్రతి ఒక్కరూ ప్రతిపక్షనేత ప్రజా సంకల్పంలో భాగం అవుతున్నారు. తమ బాధలను ఆయనతో పంచుకుంటున్నారు. దగా పడ్డామని, చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయామని, మీరే న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అన్ని వర్గాల ప్రజలను, అన్ని ప్రాంతాల ప్రజలనూ నమ్మించి మోసం చేసిన చంద్రబాబు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలనే కాదు, తన నోటితో చెప్పిన హామీలను కూడా నెరవేర్చేలేదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం నీతివంతుల లక్షణం. అవసరానికి అనువైన అబద్ధాలను ఆడి పబ్బం గడుపుకోవడం బాబులాంటి మోసకారి రాజకీయ నాయకుల లక్షణం. అందుకే వైఎస్ జగన్ బాబును నీతిలేని కొంగ అన్నారు. ప్రజలైతే బాబును ఏకంగా దొంగ అనే అంటున్నారు. 
కరువు జిల్లాగా పేరుమోసిన అనంతపురానికి చంద్రబాబు ఇచ్చిన హామీలు చూస్తే కరువు సీమలో వరాల వర్షమేమో అనిపిస్తుంది. కానీ ఆ హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేరాయా అని అడిగితే లేదనే సమాధానం వస్తుంది. 

వ్యవసాయ హామీలకు చుక్కెదురు

చంద్రబాబు అనంతకు ఇచ్చిన హామీల్లో మొదటిది 100% డ్రిప్ ఇరిగేషన్. తుంపర్ల సేద్యం ద్వారా కరువు జిల్లాలో ఏడాది పొడవునా పంటలు పండేలా చేస్తాన్నాడు చంద్రబాబు. అనంతపురంలో గ్రావిటీ ద్వారా నీళ్లందే పరిస్థితి లేదు. మిడ్ పెన్నా, పిఎబిఆర్, జీడిపల్లి  రిజర్వాయిర్లే ఇక్కడ ఆధారం. వీటిని ఉపయోగిస్తూ ఎత్తిపోతల ద్వారా కాల్వల్లోకి వచ్చే నీటిని సాంప్రదాయ పద్ధతుల్లో కాకుండా తుంపర సేద్యం ద్వారా పొలాలకు అందించడం ద్వారా లక్షల హెక్టార్లకు మేలు జరుగుతుంది. అయితే కేంద్రనుంచి విడుదలయ్యే నిథులతో చేసే ఈ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు సరిగ్గా నిర్వహించిందే లేదు. భూ వివరాలు సరిగ్గా లేవని, ఇతర సాకులను చూపుతూ డ్రిప్ పరికరాలకోసం దరఖాస్తు చేసుకున్న వేలాదిమంది రైతుల దరఖాస్తులను తిరస్కరించారు. క్షేత్ర పరిశీలన పేరుతో వేలమంది రైతులను సబ్సిడీకి అనర్హులుగా తేల్చారు. ఇక డ్రిప్ మంజూరైన రైతులకు కూడా వాటిని అందించడంలో, అమర్చడంలోనూ అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. ఇది ఏటా జరుగుతున్న డ్రిప్ ఇరిగేషన్ తీరు. ఉద్యాన వన కేంద్రం అన్నారు అదీ ఆచరణకు నోచుకోలేదు. 

అమలుకు నోచుకోని ఉపాధి, ఉద్యోగ హామీలు

వరస కరువుతో అల్లాడుతున్న అనంత జిల్లాకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఈ జిల్లాపై పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఎపి రాజధానిని విజయవాడ సమీపంలో నిర్ణయించిన సమయంలో మరోసారి అనంతపురం హామీలను నొక్కి వక్కాణించారు చంద్రబాబు. తొలి అసెంబ్లీ సమావేశంలోనూ 14 అంశాలతో ఒక ప్రకటననూ జారీ చేసారు. పారిశ్రామికంగా ఈ జిల్లాను అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు. అందుకోసం వివిధ పరిశ్రమల ఏర్పాటు అన్నారు. కానీ శంకుస్థాపనలు, ప్రకటనలు తప్ప ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదు. యథావిధిగా ఈ జిల్లాకూ టెక్స్ టైల్ పార్కు, ఫుడ్ పార్కూ అన్నారు.  నాలుగేళ్లు గడిచినా వాటి జాడలేదు. ఎలక్ట్రానికి మరియూ హార్డ్ వేర్ క్లస్టర్ అన్నారు. దానికి సంబంధించి మళ్లీ మాట్లాడిన పాపానే పోలేదు. చిలమత్తూరు, లేపాక్షిని కలుపుతూ హిందూపురం మీదగా బెంగుళూరు చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు చేస్తామన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేక అనంతపురం వాసులు పక్క రాష్ట్రాలకు వలస పోతున్నారు. నంబూల పూలకుంటలో సోలార్పవర్ ప్రాజెక్టు ఉన్నా స్థానికులకు ఒక్క ఉద్యోగమూ లేదు. 8,800 ఎకరాల్లో లేపాక్షి హబ్ పేరుతో పారిశ్రామిక వాడ అన్నా ఆ ప్రాంతంలో ఏ అభివృద్ధి పనులూ మొదలే పెట్టలేదు. పుట్టపర్తిలో విమానాల నిర్వహణ, మరమ్మత్తుల కేంద్రం ద్వారా 12వేలమందికి ఉద్యోగాలు అన్నారు. ఇంత వరకూ దిక్కులేదు. కుద్రేముఖ్ ఇనుప ఖనిజ ఆధారిత ప్రాజెక్టు చేప్పట్టి 35వేలమందికి ఉద్యోగాలిస్తామని చెప్పారు. దానికి కనీసం భూసేకరణైనా జరగలేదు. పెనుకొండను టూరిస్టు హబ్ చేస్తామంటూ శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాల్లో ప్రకటించారు. మళ్లీ దాని ఊసే లేదు.  బెల్ (భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్) శిలాఫలకం వేసారు, కానీ తమకు నష్టపరిహారం ఇవ్వమంటూ ప్రారంభోత్సవం రోజే రైతులు శిలాఫలకాన్ని ధ్వంసం చేసారు. దాని వ్యవహారాన్ని అలాగే గాలికొదిలేసారు. ఇక సెంట్రల్ యేనివర్సిటీ కి స్థలం నిర్ణయం కాలేదు, ఎయిమ్స్ అనుబంధ కేంద్రం లక్ష్యం కూడా అటకెక్కింది. కనీసం దశల వారీగా అయినా హామీలను అమలు చేస్తారని ఎదురుచూసిన అనంతపురం వాసులకు ఇన్నేళ్లుగా నిరాశే మిగింలింది. చంద్రబాబు పదే పదే చెప్పిన ఈ విషయాలన్నీ ముందు ఎన్నికల కోసం, ఆ తర్వాత కాలయాపన కోసం అని అర్థం అయ్యింది. 

చంద్రబాబు కాదు దొంగ బాబు

చంద్రబాబును దొంగ బాబు అని పిలవాలన్నా అంటూ ప్రజాసంకల్పంలో ప్రతిపక్ష నేతకు తమ గోడు చెప్పుకున్నారు అనంత యువత. లక్షల్లో ఉన్న నిరుద్యోగులకు కనీసం వందల్లో అయినా ఉద్యోగాలు కల్పించ లేకపోయాడని, ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆవేదన చెందారు. త్వరలో మన ప్రభుత్వం వస్తుందని, అనంతకు మంచి రోజులొస్తాయని భరోసా ఇచ్చారు ప్రతిపక్షనేత వైఎస్స్ జగన్. 
  
Back to Top