హైదరాబాద్: పేరుకు బ్లూ ప్రాగ్ అయినా దాన్ని నడిపించేది ఎల్లో ప్రాగ్ అనేది అందరికి అర్థమైందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కన్నబాబు అన్నారు. ప్రజలకు సంబంధించిన పల్స్ సర్వే డేటా, లబ్ధిదారుల డేటా, బ్యాంకు అకౌంట్ల డేటా, కుల మత వర్గాలకు సంబంధించిన డేటా అంతా చోరీ చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో చంద్రబాబు ఏ1 అయితే లోకేష్ ఏ2 ముద్దాయి అని తెలిపారు. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో కన్నబాబు మీడియాతో మాట్లాడారు. అన్నింటికీ తానే సృష్టికర్తను అని చెప్పుకునే చంద్రబాబు..సెల్ఫోన్ తానే కనిపెట్టినట్లు..సత్యనాదేళ్లను ఆ స్థితికి తీసుకెళ్లినట్లు రకరకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రజల డేటాను చౌర్యం చేసే ఆధ్యుడిగా చంద్రబాబు పేరు తెచ్చుకున్నారన్నారు. చాలా గోప్యంగా ఉండాల్సిన ప్రభుత్వ లబ్ధిదారుల వివరాలను, ఓటర్ల వివరాల ఓరిజినల్స్ను చోరీ చేశారని, బ్యాంకు అకౌంట్ల వివరాలను కూడా చౌర్యం చేశారన్నారు. చంద్రబాబు ను ఓటమి భయం వెంటాడుతుందన్నారు. 2019లో టీడీపీకి పుట్టగతులు ఉండవన్నదానికి డేటా చౌర్యమే ఉదాహరణ అన్నారు. ఎవరైనా కొడుకులకు సన్మార్గాలు నేర్పిస్తారని, కానీ చంద్రబాబు మాత్రం తన కుమారుడు లోకేష్కు ఏ విధంగా అక్రమ మార్గాల్లో వెళ్లాలో నేర్పించారన్నారు. డేటా చౌర్యం కేసులో ఏ1 ముద్దాయి చంద్రబాబు అయితే, ఏ2 నారా లోకేష్ అన్నారు. పైగా దొంగే దొంగా అన్నట్లు అరుస్తున్నారన్నారు. ఆయనకు ఆయనే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నారన్నారు. చంద్రబాబును కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వ నియంత్రణవ్యవస్థ ఎందుకు వేగంగా అడుగులు వేయడం లేదని ప్రశ్నించారు. ఆర్బీఐకి సంబంధించిన వివరాలు, ఓటర్ల వివరాలు చౌర్యం చేసిన వ్యక్తిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు. ఆధార్ సమాచారాన్ని కూడా చోరీ చేశారన్నారు. లోకేషన్తో సహా కుల, మత వర్గ వ్యక్తిగత కుటుంబ వివరాలు ఏవిధంగా ఓ ప్రైవేట్ సంస్థ చేతికి అందాయని ప్రశ్నించారు. ప్రభుత్వ సర్వీస్ ప్రోవైడర్స్కు ఇంతవరకు ఎంత వరకు పేవ్మెంట్ చేశారని నిలదీశారు. సేవా మిత్ర యాప్ టీడీపీకి చెందినదన్నారు. విచారణలో ఈ విషయాలన్నీ కూడా బయటకు రావాలన్నారు. పబ్లిక్ డోమైన్లో ఉన్న సమాచారం మీ వద్ద ఉంటే చంద్రబాబు ఎందుకు కంగారుపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణలో జరిగిన ఈ వ్యవహరంపై వైయస్ఆర్సీపీ ఫిర్యాదు చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఎందుకు ఉలికిపడుతున్నారని మండిపడ్డారు. నిందితులకు ఏపీ ప్రభుత్వం ఎందుకు రక్షణగా నిలుస్తుందన్నారు. డేటా స్కామ్ విషయంలో కొంతమంది అధికారులు వివరణ ఇచ్చారని, మాకందరికి సమాచారం బ్లాక్ అండ్ ౖÐð ట్లో ఇస్తారని, మీకు కలర్ ప్రింట్లు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎందుకు సేవా మిత్ర యాప్లో మార్పులు, చేర్పులు చేశారని నిలదీశారు. పేరుకు బ్లూ ప్రాగ్ అయినా..చేసిందంతా కూడా ఎల్లో ప్రాగ్ అని అభివర్ణించారు. అందుకే టీడీపీ నేతలు కంగారు పడుతున్నారన్నారు. అసలు స్వరూపం బయటకు వస్తుందని టీడీపీ నేతలకు భయం పట్టుకుందన్నారు. టెక్నాలజీ దుర్వినియోగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారని, ఆదిలోనే దీన్ని అడ్డుకోకపోతే చాలా అనర్థాలకు మూలమవుతుందన్నారు. దీన్ని చిన్న విషయంగా చూడవద్దని, దీని వెనుక స్కామ్ ఉందన్నారు. ఈవీఎంలను ఏవిధంగా ట్యాంపర్ చేయవచ్చు చూపించిన వ్యక్తిని సలహాదారుగా తీసుకున్న చరిత్ర చంద్రబాబుది అన్నారు. టెక్నాలజీని చౌర్యం చేసి ఎన్నికల్లో గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తుందన్నారు. వైయస్ జగన్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 59 లక్షల బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు.