హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2012 : దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి మూడవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయనకు కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ ఆదివారం ఉదయం హైదరాబాద్లో నివాళులు అర్పించారు. హైదరాబాద్ బంజారాహిల్స్ సిటి సెంటర్ వద్ద ఉన్న వైయస్ఆర్ విగ్రహానికి మొయిలీ పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, కేవీపి రామచంద్రరావు, దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ స్మృతులను మొయిలీ గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ వైయస్ఆర్ జ్ఞాపకాలు ఎప్పటికీ తమతో ఉంటాయని ఆయన అన్నారు.వైయస్ రాజశేఖరరెడ్డి లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి దానం నాగేందర్ పేర్కొన్నారు. గాంధీ కుటుంబం తరువాత కాంగ్రెస్ పార్టీలో గొప్ప నేతగా వైయస్ఆర్ గుర్తింపు తెచ్చుకున్నారని ఆయన అంజలి ఘటించారు.పంజాగుట్ట వద్ద వైయస్ఆర్ విగ్రహానికి కిరణ్ పుష్పాంజలి :పంజాగుట్టలోని స్వర్గీయ ప్రజా నేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఎంపీలు కేవీపీ, అంజన్కుమార్ యాదవ్, ఉండవల్లి అరుణ్కుమార్, మంత్రులు వట్టి వసంత్కుమార్, కాసు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.