అట్లాంటా : దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 66వ జయంతి వేడుకలు అమెరికాలోని అట్లాంటా లో అమెరికా ఎన్ ఆర్ ఐ కమిటీ, వైఎస్సార్ అభిమానుల ఆధ్వర్యంలో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథులుగా పార్టీ సీనియర్ నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, అంబటి రాంబాబు, కోరుముట్ల శ్రీనివాసులు, ఆళ్ల రామకృష్ణా రెడ్డి, ఆదిమూలపు సురేష్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చలమశెట్టి సునీల్, రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి, గుడివాడ అమర్ నాథ్, మేడపాటి వెంకట్, శ్రీనివాస్ కలబండ్ల, యాడమ్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. మొదటగా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించాక జ్యోతి ప్రజ్వలన కావించి, పుష్ప గుచ్ఛాలు సమర్పించారు.సాయంత్రం పద్మశ్రీ శోభా రాజు నాట్య ప్రదర్శనకతో కార్యక్రమం ప్రారంభమైంది. అమెరికా ఎన్ ఆర్ ఐ కమిటీ కన్వీనర్ గురవారెడ్డి అతిథులకు స్వాగతం పలికారు. గోదావరి పుష్కరాల తొక్కిసలాటలో చనిపోయిన వారి ఆత్మశాంతికి కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత డాక్టర్ వైఎస్సార్ తో తమకు ఉన్న అనుబంధాన్ని ఆహుతులు గుర్తు చేసుకొన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని వర్గాల ప్రజల కోసం వైఎస్సార్ ప్రవేశ పెట్టిన ఆరోగ్య శ్రీ, ఫీజులు రీఇంబర్స్ మెంట్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, మహిళలకు పావలా వడ్డీకే రుణాలు వంటి పథకాల గొప్పదనాన్ని వివరించారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీపీ పాటు పడుతున్న తీరుని వివరించి, అదే విధమైన సహాయ సహకారాల్ని వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ లకు అందించాలని నాయకులు పిలుపు ఇచ్చారు. చివరగా వందన సమర్పణ, కృతజ్ఞతల సమర్పణతో కార్యక్రమం ముగిసింది. <br/>