హైదరాబాద్: నిస్సిగ్గుగా జరుగుతున్న పార్టీ ఫిరాయింపుల మీద పార్లమెంటు వేదికగా పోరాడాలని వైయస్సార్సీపీ నిర్ణయించిందని పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు మేకపాటి రాజమోహన్ రెడ్డి వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఇతర పార్టీలను కలుపుకొని చట్ట సవరణ కోసం ప్రయత్నిస్తామని పేర్కొన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన అంశాలపై పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో శనివారం భేటీ అయ్యారు. ఆ వివరాలను ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి మీడియాకు తెలిపారు. ఆయన మాట్లాడుతూ..పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలోనూ వైఎస్సార్సీపీ తొలిసారి తన వాణిని వినిపించనుందని ఆయన పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో సవరణలు తీసుకురావాలంటూ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి తన తొలి సమావేశాల సందర్భంగానే రాజ్యసభలో ప్రైవేట్ బిల్లును ప్రతిపాదించనున్నామని ఆయన తెలిపారు. విభజన సమయంలో హామీ ఇచ్చిన ప్రత్యేకహోదాను అమలు చేస్తే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చెప్పిన విషయాన్ని మేకపాటి గుర్తుచేశారు. దీనికి చంద్రబాబు ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు.... 10 సంవత్సరాలు కావాలన్నారు... బీజేపీ నాయకులు సైతం పదేళ్లు తప్పనిసరిగా ఇస్తామని రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల హామీల అమలులో విఫలం బీజేపీ, టీడీపీ పార్టీలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యాయని మేకపాటి రాజమోహన్రెడ్డి విమర్శించారు. 2017 వరకు పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేస్తామన్నారని, ఇప్పటికి తూతూ మంత్రగానే పోలవరం పనులు జరుగుతున్నాయన్నారు. కనీసం 2019 ఎన్నికల వరకైనా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలన్నారు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మాణ దశలో ఉన్న కొన్ని కాలువ పనులను పూర్తి చేసి పట్టిసీమను తానే పూర్తి చేశానని బాబు చెప్పడం హస్యస్పదంగా ఉందన్నారు. దివంగత నేత రాజశేఖరరెడ్డి ప్రాజెక్టును 145 కిలోమీటర్ల పూర్తి చేయకుండా ఉండుంటే ఈ రోజు పట్టిసీమలో నీళ్లు ఎలా ఇచ్చేవారని చంద్రబాబును ప్రశ్నిచారు. చంద్రబాబు చెప్పేదీ గొప్పగా ఉంటుంది... చేసేదీ మాత్రం శూన్యమని దుయ్యబట్టారు... ప్రజలను మభ్య పెట్టడం రాజకీయ నాయకులకు మంచిది కాదని హితవు పలికారు. ఎన్నికలకు ముందు బాబు సుమారు 600 వాగ్ధానాలు చేశారని గుర్తు చేశారు. వీటిలో ఏ ఒక్కటి నెరవేరలేదని గడప గడపకూ వైయస్ ఆర్ కాంగ్రెస్ కార్యక్రమంలో స్పష్టమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా పాలిటెక్నిక్ చదివే మానస అనే విద్యార్థిని తన కుటుంబ సభ్యులతో కలిసి కరపత్రం నింపితే అందులో బాబుకు వందకు 7 మార్కులు వేశారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సహకారం రాష్ట్రాభివృద్ధికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుందని ఎంపీ మేకపాటి రాజమోహన్రెడ్డి తెలిపారు. చంద్రబాబు నాయుడు తన పార్లమెంట్ సభ్యులకు కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వద్దని చెప్పితే ప్రత్యేక హోదా, రైల్వేజోన్, అమరావతికి నిధులు ఎలా సాధ్యమని నిలదీశారు.తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులకు చిత్తశుద్ది లేకుండా పోయిందని మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరు రాష్ట్రాభివృధ్ధికి సంబంధించిన విషయాలపై పార్లమెంటులో పోరాడతామన్నారు. రాష్ట్రంలో ప్రతి విషయంలో అవినీతి జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని భూములు, పట్టిసీమ ప్రాజెక్టు, సదావర్తి భూములు ఇలా అన్ని విషయాల్లో బాబు అవినీతి సిగ్గుచేటు అని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు నీతి, నిజాయితీ లేకుండా పాలన కొనసాగిస్తున్నారని ఫైర్ అయ్యారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవినీతిలో నంబర్ వన్ స్థానానికి తీసుకురావడం పట్ల బాబు సిగ్గుతో తలదించుకోవాలన్నారు.