<br/>గుంటూరు: పెట్రోల్, డీజిల్ ధరలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన పన్నులు తగ్గించిన తరువాత చంద్రబాబు బంద్కు మద్దతు ఇవ్వాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండు చేశారు. పెట్రోల్ ధరల పెంపు విషయంలో మోడీ, చంద్రబాబు ఇద్దరి ప్రమేయం ఉందని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ఈ రోజు దేశ వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసిస్తూ గుంటూరు జిల్లా సత్తనపల్లెలో వైయస్ఆర్సీపీ నాయకుడు అంబటి రాంబాబు రిక్షా తొక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలే పెట్రోల్ ధరల పెరుగుదలకు కారణమని విమర్శించారు. పన్నులు తగ్గిస్తే రాష్ట్రంలో ఇంధన ధరలు తగ్గుతాయన్నారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉండటానికి కారణం మోడీ తరువాత చంద్రబాబు అన్నారు. పక్క రాష్ట్రాలతో సమానంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన రోజున చంద్రబాబు పాపం లేదనుకుంటామన్నారు. పన్నులు తగ్గించిన తరువాతే చంద్రబాబు బంద్కు మద్దతివ్వాలని సూచించారు. ఇంధన ధరల పెంపుపై మోడీ, చంద్రబాబులకు భాగస్వామ్యం ఉందన్నారు. మోడీ నంబర్ వన్ అయితే, నంబర్ 2 చంద్రబాబే అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన హెచ్చరించారు.