ఆపరేషన్‌ గరుడ పేరుతో వైయ‌స్ జగన్‌ హత్య కుట్ర


న్యూఢిల్లీ:  ఆపరేషన్‌ గరుడ పేరుతో వైయ‌స్ జగన్‌ హత్య కుట్ర ప‌న్నార‌ని,  హత్య కుట్ర భగ్నమవ్వడంతో ఇది ఎక్కడ మెడకు చుట్టకుంటుందో అన్న భయంతో ముఖ్యమంత్రి చంద్రబాబు దుష్ప్రచారానికి తెరలేపార‌ని వైయ‌స్ఆర్‌సీపీ తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  ఆదొక చిన్న ఘటన, విచారణ అవసరం లేదంటూ ప్రజల దృష్టి మరల్చేందుకు ప్రయత్నించారు. విచారణ జరిపితే ఎక్కడ తన బాగోతం బయటపడుతుందో అన్న భయం చంద్రబాబులో ఉంది. న్యూఢిల్లీలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. వైయ‌స్ జగన్‌పై హత్యాయత్నం చేసిన నిందితుడు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్త అంటూ ఫ్లెక్సీలు సృష్టించారు. నిందితుడు శ్రీనివాసరావు కుంటుంబానికి చంద్రబాబు టీడీపీ సభ్యత్వం ఇచ్చి, రెండు ఇళ్లు, రుణాలు మంజూరు చేసి ఆపరేషన్‌ గరుడ పేరుతో జగన్‌ హత్య కుట్ర పన్నారు.

నిందితుడికి ఎయిర్‌పోర్టులో టీడీపీ నేత హర్షవర్దన్‌ క్యాంటీన్‌లో ఉద్యోగంలో చేర్పించారు. చంద్రబాబు, డీజీపీల ప్రోద్బలంతోనే ఈ కుట్ర జరిగింది. ఘటన జరిగిన తరువాత వారు స్పందించిన తీరే దీనికి నిదర్శనం. ఏయిర్‌పోర్టులో సీఐఎస్‌ఎఫ్‌ భద్రతా సిబ్బంది ఉన్నా శాంతి భద్రతలు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయి. ఘటన జరిగిన తరువాత నిందితుడిని ఏపీ పోలీసులే అదుపులోకి తీసుకున్న దృశ్యాలు అన్ని ఛానళ్లలో ప్రసారం అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం జరిపించే విచారణలో అది తేలదు. కేంద్ర ప్రభుత్వమే ప్రత్యేకంగా ఒక థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలి. అప్పుడే నిజాలు బయటకు వస్తాయి’’ అని తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.  జగన్‌పై జరిగింది ముమ్మాటికీ హత్యాయత్నమే అని రిమాండ్‌ రిపోర్టులో స్పష్టం చేయడంతో కనీసం అర్ధసత్యమైనా బయటపడింది. దీనిపై చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు? ఈ కుట్ర వెనుక ఉన్న అసలు దోషులు బయటకు రావాలని డిమాండు చేశారు.
Back to Top