నిర్భయ కేసు తీర్పుపై వైయస్ఆర్ కాంగ్రెస్‌ హర్షం

హైదరాబాద్, 13 సెప్టెంబర్ 2013:

గత సంవత్సరం డిసెంబర్‌ 16వ తేదీన న్యూఢిల్లీలో సామూహిక అత్యాచారానికి గురైన నిర్భయ కేసులో దోషులకు కోర్టు ఉరిశిక్ష విధించడ‌ం పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ‌ హర్షం వ్యక్తంచేసింది. నిర్భయ కేసులో తీర్పు వెలువడిన అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు‌ గట్టు రామచంద్రరావు శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో మీడియా సమావేశంలో మాట్లాడారు. మానవ మృగాలుగా ప్రవర్తించిన దోషులకు ఇది సరైన శిక్ష అని ఆయన అభివర్ణించారు. దేశంలో మహిళలకు భరోసా కల్పించడంలో ప్రభుత్వాలు ఘోరం విఫలం అవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ రాజధాని న్యూఢిల్లీలో గత ఏడాది డిసెంబర్‌ 16 రాత్రి ఫార్మసీ విద్యార్థినిపై ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేశారు. అనంతరం ఆమెపై అత్యంత కిరాతకంగా దాడి చేశారు. న్యూఢిల్లీ ఆసుపత్రిలో చికిత్స పొందు‌తున్న ఆమెను మెరుగైన చికిత్స కోసం సింగపూర్ తరలించారు. అయితే నిర్భయ అక్కడ చికిత్స పొందుతూ డిసెంబ‌ర్ నెలాఖరున మరణించింది. ఆ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ‌వెల్లువెత్తాయి. ఆ ఆరుగురినీ కఠినంగా శిక్షించాల దేశంలోని పలు సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.

‌ఈ నేపథ్యంలో శుక్రవారంనాడు ఢిల్లీలోని సాకేత్‌ ఫాస్టు ట్రాక్ కోర్టు నలుగురు ‌దోషిలకు ఉరిశిక్షను ఖరారు చేసింది. అయితే మరో ఇద్దరు నిందితుల్లో ఒకరు తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నిందితుడు బాలనేరస్తుడు కావడంతో అతడికి ప్రత్యేక న్యాయస్థానం మూడేళ్ల జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే.

Back to Top