<strong>గన్నవరంలో వైయస్ జగన్ కు ఘనస్వాగతం</strong><strong>వెటర్నరీ విద్యార్థుల దీక్షకు మద్దతు</strong><strong>కూలీల కుటుంబాలను పరామర్శించనున్న జననేత</strong><br/><strong>గుంటూరుః </strong> ప్రతిపక్ష నాయకుడు, వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం పెదగొట్టిపాడుకు బయలుదేరారు.అంతకు ముందు హైదరాబాద్ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకున్న వైయస్ జగన్ కు పార్టీశ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా జననేత గుంటూరు జిల్లాకు చేరుకున్నారు. <br/>ఇటీవల మట్టి పెళ్లలు విరిగిపడి సజీవ సమాధి అయిన కూలీల కుటుంబాల్ని వైయస్ జగన్ పరామర్శిస్తారు. ఏడు కుటుంబాల సభ్యులతో మాట్లాడతారు. అనంతరం అక్కడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కూలీలను పలకరిస్తారు.<br/>గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా వైయస్ జగన్...న్యాయబద్దమైన డిమాండ్లతో ఆందోళన చేస్తున్న వెటర్నరీ విద్యార్థుల దీక్షకు మద్దతు పలికారు. క్రిష్ణా జిల్లా గన్నవరం పశువైద్య కళాశాల దగ్గర దీక్షలు చేస్తున్న విద్యార్థుల శిబిరాన్ని ఆయన సందర్శించారు. విద్యార్థులతో ఆయన మాట్లాడారు. సంచార పశు కేంద్రాల్ని పశు వైద్యశాలలుగా మార్చాలని, కాంట్రాక్టు ప్రాతిపదికన కాకుండా శాశ్వతంగా నియామకాలు జరపాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.<br/>ఈ సందర్భంగా వైయస్ జగన్ విద్యార్థులతో మాట్లాడారు. చంద్రన్న పశు సంచార పథకంలో కాంట్రాక్టు పద్దతిలో నియామకాలు జరపాలన్న ప్రతిపాదన్ని వ్యతిరేకిస్తున్నామని, శాశ్వత పద్దతిన నియామకాలు జరపాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయబద్దమైనవి అని ఆయన అభివర్ణించారు. జీవో 97 ని రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలని ఆయన అన్నారు. ఒక వేళ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోతే, వచ్చేది వైయస్సార్సీపీ ప్రభుత్వం అని, వెటర్నరీ విద్యార్థులకు అన్ని రకాలుగా న్యాయం చేస్తామని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.