- రాష్ట్రాన్ని విభజించిన శక్తులతో అవిభక్త ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజే కలిశారు
- చంద్రబాబు పచ్చి అవకాశవాది
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి అవకాశవాదని.. ఆయనకు ఎలాంటి నైతిక విలువలు, సిద్ధాంతాలు గానీ లేనే లేవని వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు వైయస్ జగన్ తన అభిప్రాయాలను ట్విట్టర్లో పోస్టు చేశారు. ఢిల్లీలో రాహుల్గాంధీ – చంద్రబాబు కలయికపై వైయస్ జగన్ స్పందిస్తూ.. 1956 నవంబర్ 1వ తేదీన అవిభక్త ఆంధ్రప్రదేశ్ అవతరించిన రోజే.. రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టిన శక్తులతో చంద్రబాబు చేతులు కలిపి దారుణానికి ఒడిగట్టారని పేర్కొన్నారు.
మళ్లీ బీజేపీతో జతకడతారేమో!
‘చంద్రబాబునాయుడు అవసరమైనప్పుడు బీజేపీని వాడుకున్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో వారు రాష్ట్రానికి ద్రోహం చేసినా కలిసి కాపురం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలుగా విడగొట్టిన కాంగ్రెస్నూ ఇప్పుడు వాడుకుంటారు. దేశం కోసం, మళ్లీ అవసరమనుకున్నపుడు బీజేపీతో జతకడతారేమో. ఆయనకు సిద్ధాంతాలు, ఎలాంటి విలువలు గానీ, శషభిషలు గానీ ఉండవనేందుకు ఆయన వెనుక ఉన్న చరిత్రే సాక్ష్యంగా నిలుస్తుంది.’ అని వైయస్ జగన్ పేర్కొన్నారు.