హోదా సాధనలో 40 ఏళ్ల అనుభవమేమైంది


టీడీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు
రేపు అనంతలో వంచనపై గర్జన దీక్ష
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి

ఉరవకొండ: ప్రత్యేక హోదా సాధించడంలో 40 ఏళ్ల అనుభవం ఏమైందని, నాలుగేళ్లుగా ఎన్డీయే ప్రభుత్వాన్ని భుజానికి ఎత్తుకున్న చంద్రబాబు ఎన్నికలు దగ్గరపడుతున్నాయని మొసలి కన్నీరు కార్చడం సిగ్గుచేటని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఉరవకొండ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వంచనను ప్రజలకు తెలియజెప్పేందుకే రేపు అనంతపురంలో ‘వంచనపై గర్జన దీక్ష’ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ముఖ్య నాయకులు, తమ పదవులను తృణప్రాయంగా వదిలేసిన తాజా మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, ముఖ్యనేతలు పాల్గొంటారన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీల అమలుకు గత నాలుగేళ్లుగా ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అలుపెరుగని పోరాటం సాగిస్తున్నారన్నారు. హోదా అంశం ఇప్పటికీ సజీవంగా ఉందంటే అది ఒక్క వైయస్‌ జగన్‌ వల్లేనన్నారు. 
29 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించిందేమి చంద్రబాబు
ప్రత్యేక హోదా సాధనలో భాగంగా ప్రధాని మోదీపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు 29 సార్లు ఢిల్లీకి వెళ్లారని టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పగా చెప్పుకుంటున్నారని, అయితే ఆయన ఏమి సాధించారో ప్రజలకు వివరించాలన్నారు. నాలుగేళ్లుగా చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా కేంద్రాన్ని పొగడ్తలతో ముంచెత్తడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయని విధంగా మోదీ సర్కారు అభివృద్ధి చేసిందని చెప్పిన నోటితోనే ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలని అడగటం వెనుక దురుద్దేశం ప్రజలకు తెలియనిది కాదన్నారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. 
Back to Top