విశ్వసనీయత ఉన్నవారినే గెలిపిద్దాం

విజయవాడ/ఏలూరు/కాకినాడ/విశాఖపట్నం:

మరో ఐదు రోజుల లోపు జరిగే ఎన్నికలకు ఓ ప్రత్యేకత ఉందని, మనం వేసే ఓటుతో మన తలరాతలు మారుతున్నాయని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి తెలిపారు. ఓటు వేసే ముందు ప్రతి ఒక్కరం మనల్ని మనం ప్రశ్నించుకోవాలన్నారు. ఏ నాయకుడు ప్రతి పేదవాడి గుండెచప్పుడు వింటాడో.. పేదవాడి మనసు తెలుసుకుంటాడో.. చనిపోయిన తర్వాత కూడా పేదల గుండెల్లో నిలిచి ఉండాలని ఆరాటపడతాడో అలాంటి వ్యక్తినే మనం ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తినే మనం ముఖ్యమంత్రిగా తెచ్చుకోవాలన్నారు. అప్పుడే మన తలరాతలు మంచిగా మారతాయని చెప్పారు.

‘వైయస్ఆర్ జనభేరి’ ఎన్నికల ప్రచారంలో భాగంగా‌ శ్రీ వైయస్ జగ‌న్ శనివారం ఒకే‌ రోజు నాలుగు జిల్లాల్లో పర్యటించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం, విశాఖపట్టణంలోని ఆర్కే బీచ్‌లో నిర్వహించిన సభలకు పోటెత్తిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.

'ప్రస్తుత ఎన్నికల్లో ఒకవైపు విశ్వసనీయత, నిజాయితీ ఉంటే.. మరోవైపు కుళ్లు, కుతంత్రాలతో కూడిన రాజకీయాలు పోటీపడుతున్నాయి. ఈ పోటీలో విశ్వనీయతకు ఓటేయండి.. ఆ దివంగత నేత కలలుగన్న సువర్ణయుగాన్ని మనందరం కలసికట్టుగా తెచ్చుకుందాం’ అని శ్రీ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. కేంద్రం ముందు సాగిలపడి మోకరిల్లే చంద్రబాబు నాయుడు కావాలో, కేంద్రం మెడలు వంచే జగన్మోహన్‌రెడ్డి కావాలో తేల్చుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

వాళ్ళెవరికీ మన మీద ప్రేమ లేదు :

'రాష్ట్రాన్ని విభజించిన సోనియా గాంధీకి, అందుకు పూర్తిగా మద్దతిచ్చిన నరేంద్ర మోడీ, నారా చంద్రబాబు నాయుడు.. వీళ్లెవ్వరికీ మన మీద ప్రేమ లేదు. వీరికెవ్వరికీ మన మీద ఆప్యాయత లేదు. వీరికి కావాల్సిందల్లా ఓట్లు, సీట్లే. అందు కోసం ఏ గడ్డి అయినా తింటారు. వీళ్లను ఎవరినీ నమ్మొద్దు. మన ప్రాంతంలో ఉన్న 25 ఎంపీ స్థానాల్లో ఒక్కటి కూడా పక్కకు పోకుండా అన్నింటినీ మనమే గెలుచుకుందాం. మన రాష్ట్రానికి మంచి చేస్తామని ఆ రోజు ఎవరు ముందుకు వస్తారో చూసి వారినే ప్రధాని సీట్లో కూర్చోబెడదాం. ఆ రోజు నరేంద్ర మోడీ కావచ్చు.. ఎల్లయ్య కావచ్చు.. పుల్లయ్య కావచ్చు.. ఎవరైనా కూడా మన రాష్ట్రం కోసం మనం చెప్పిన విధంగా నడచుకుంటామంటేనే వారిని ప్రధాన మంత్రి సీట్లో కూర్చోబెడదాం' అని శ్రీ జగన్‌ అన్నారు.

తెలంగాణ తామే ఇచ్చామన్నారు కదా? :
'చంద్రబాబు, బీజేపీ నాయకులు అందరూ తిరుపతిలో మీటింగ్ తర్వాత ఐదారు మీటింగ్‌లు సీమాంధ్రలో పెట్టారు. వాళ్లు సీమాంధ్రలో మాట్లాడిన మాటలన్నీ తెలంగాణలో ఎన్నికలు అయ్యే దాకా ఏ రోజునా మాట్లాడలేదు. నరేంద్రమోడీ నుంచి సుష్మాస్వరాజ్ వరకు తెలంగాణలో పర్యటించినప్పుడు.. తాము మద్దతు ఇచ్చాం కాబట్టే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, లేదంటే తెలంగాణ రానే రాదని చెప్పుకొచ్చారు. ‘నేనిచ్చిన లేఖతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.. నేను ఆ లేఖను వెన‌క్కి తీసుకొని ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేది కాదు’ అని చంద్రబాబు అన్నారు. ఆశ్చర్యం ఏంటంటే వీరందరూ కూడా తెలంగాణలో ఏప్రిల్ 30న ఎన్నికలు అయిపోయిన రాత్రికి రాత్రే మాట మార్చేశారు. తిరుపతిలో ఒక మీటింగ్ పెట్టి.. జగ‌న్ వల్లనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అభాండాలు వేశారు. వీళ్లు అసలు రాజకీయ నాయకులేనా?‌' అని శ్రీ వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు.

ఒక్క మేలైనా చేయలేదేం ? :
'తమకు ఓటేస్తే ఏమేమో చేస్తామని నరేంద్ర మోడీ, చంద్రబాబు హామీలు గుప్పించారు. ఆకాశం నుంచి స్వర్గాన్ని అలా అలా కిందికి తీసుకొస్తామని చెప్పారు. అయితే వారిని ఒక మాట అడుగుతున్నా... 1999 నుంచి 2004 వరకు ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కేంద్రంలో బీజేపీ చక్రం తిప్పామని చెప్రారు. ఆ ఐదేళ్లలో మీరు ఈ రాష్ట్రానికి చేసిన ఒక్కటంటే ఒక్క మేలు ఏంటో చెప్పగలరా అని చంద్రబాబును, బీజేపీని నిలదీస్తున్నా. రాష్ట్రం అంతా వెయ్యి కిలోమీటర్ల తీరం ఉందని, చంద్రబాబుకు ఓటేస్తే గొప్పగా బాగు చేస్తారని మోడీ అంటున్నారు. ఇదే బీజేపీ, ఇదే చంద్రబాబులను ఒకటి అడగదలచుకున్నా.. 1999 నుంచి 2004 వరకు మీరు కలసి ఉన్నపుడు మీకు ఈ వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరం కనిపించలేదా? పోలవరం ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టు, గాలేరు-నగరి, హంద్రీ నీవా ప్రాజెక్టులు నిర్మించాలని నాడు మీకు గుర్తుకు రాలేదా? ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి కాబట్టి వీళ్లకు ఇవి గుర్తుకు వస్తున్నాయి. కానీ, నేను మాటిస్తున్నా.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక పోలవరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టులను వీలైనంత త్వరలోనే పూర్తి చేస్తా’ అని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు.

మోడీ.. దీనికెవరు కారణం? :
‘ఆంధ్ర రాష్ట్రంలో గ్యాస్ దండిగా ఉందని, దీంతో దేశాన్ని అభివృద్ధి చేస్తానని మోడీ చెప్తున్నారు. మన రాష్ట్రంలోని గ్యా‌స్‌లో మనకు ఎంత వాటా ఇస్తారో చెప్పకుండా.. మన గ్యాస్‌తో దేశాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పడం విడ్డూరం. ఇక్కడి గ్యాస్‌ను గుజరాత్‌కు తీసుకెళ్తున్నారు. గుజరాత్‌లో గ్యాస్ సిలిండర్ రూ. 200కు ఇస్తారు. మన రాష్ట్రంలో మాత్రం రూ. 450కు అమ్ముతున్నారు. దీనికి బాధ్యులెవరని అడుగుతున్నా’‌ అని శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.

తాజా వీడియోలు

Back to Top