అనంతపురం : అనంతపురం టీడీపీ నేతలకు చీము నెత్తురు, సిగ్గూశరం ఉంటే చంద్రబాబు ను నిలదీయాలని వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. అనంతపురం జిల్లాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కరివేపాకులా వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం పర్యటన సందర్భంగా అనంత వెంకట్రామిరెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. గత నాలుగేళ్లుగా కరవు ప్రాంతమైన అనంతపురం జిల్లాకు చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారని.. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. పదవులను కరివేపాకులా చూస్తున్న వారంతా రాజీనామా చేస్తే బాగుంటుందని సూచించారు. అక్రమ సంపాదన, దౌర్జన్యాలను పక్కనపెట్టి సమస్యలు తీర్చేందుకు ఎంపీ జేసీ దివాకర్రెడ్డి ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని అన్నారు. ఏపీ సర్కార్ ఆర్భాటంగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమం ఓ బోగస్ అని, అర్జీలు తీసుకోవడం మినహా సాధించింది శూన్యమని ఆయన వ్యాఖ్యానించారు.