<strong><br/></strong><strong>- ప్రత్యేక హోదా సాధనకు వైయస్ జగన్ నాలుగేళ్లుగా ఉద్యమం</strong><strong>- నేడు వైయస్ఆర్సీపీ ఎంపీల రాజీనామా.. ఆమరణ దీక్ష</strong><strong> </strong>అమరావతి: పార్లమెంటు సాక్షిగా దేశ రాజధానిలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదుకోట్లమంది ఆంధ్రులకు అపర సంజీవని వంటి ప్రత్యేకహోదా అంశాన్ని సజీవంగా ఉంచేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాలుగేళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఈ ఉద్యమం చివరి దశకు చేరుకుంది. హోదా సాధనకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేసి ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు కూర్చోబో తున్నారు. <br/><strong>అలుపెరగని పోరాటం</strong>ప్రత్యేక హోదా కోసం వైయస్ఆర్సీపీ అలుపెరగని పోరాటం చేస్తోంది. ఈ పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకెళ్లి.. పార్లమెంటు వేదికగా పోరాటం సాగించి.. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించేందుకు అవిశ్రాంతంగా ప్రయత్నించి.. దేశవ్యాప్తంగా చర్చనీయాం శంగా మార్చిన వైయస్ఆర్సీపీ ఇప్పుడు అంతిమ పోరాటానికి సన్నద్ధమయ్యింది. కేంద్రంపై అవిశ్వాస తీర్మానం శుక్రవారం కూడా చర్చకు రాకుండా పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడినట్లయితే ఆ మరుక్షణమే వైయస్ఆర్ కాంగ్రెస్ లోక్సభ సభ్యులు తమ పదవులను తృణప్రాయంగా త్యజించనున్నారు. స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసి ఆ లేఖలను కేంద్రం మొఖాన కొట్టి బయటకు రానున్నారు. రాజీనామాలను ఆమోదించాలని కోరనున్నారు. ఆ వెనువెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆస్తి అయిన ఏపీభవన్లో వారు ఆమరణ నిరాహార దీక్షకు దిగనున్నారు.<br/><strong>అధినేత పిలుపు మేరకు..</strong>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు తమ నాలుగేళ్ల ప్రత్యేక హోదా పోరాటాన్ని పతాక స్థాయికి చేర్చిన ఎంపీలు తాజా బడ్జెట్ సమావేశాల్లో జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మార్చగలిగారు. చరిత్రలో మునుపెన్నడూ ఎరుగని రీతిలో కేంద్రంపై 13సార్లు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. జాతీయ పార్టీల మద్దతు కూడగట్టారు. అవిశ్వాస తీర్మానానికి అందరూ కలసి వచ్చే పరిస్థితి కల్పించారు.<br/><strong>ప్రాణ త్యాగాలకు సిద్ధం</strong>అవసరమైతే ప్రాణ త్యాగం చేస్తాం తప్ప ప్రత్యేకహోదా పోరాటాన్ని వదిలేది లేదని వైయస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ప్రకటించారు. ప్రత్యేక హోదా ముందు పదవులు తమకో లెక్క కాదన్నారు. ప్రత్యేక హోదాపై ప్రజల ఆకాంక్షలను బలంగా చాటిచెబుతామని, ప్రజాన్యాయస్థానంలోనే తేల్చుకుంటామని ప్రతిన పూనారు. కాగా పదవులను త్యాగం చేసి ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్న ఎంపీలకు మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా సంఘీభావ ర్యాలీలు నిర్వహించనున్నారు. ఇప్పటికే పలు ప్రజా సంఘాలు ఎంపీల దీక్షలకు మద్దతు ప్రకటించాయి. <br/><br/><br/>