విశాఖ: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా సోమవారం వైయస్ జగన్ మోహన్ రెడ్డి బ్రాహ్మణ సంఘాలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. 258వ ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా విశాఖ నగరంలోని సిరిపురం విజ్ఞాన్ స్కూల్ గ్రౌండ్స్లో మధ్యాహ్నం 2.30 గంటలకు బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమావేశం ఉంటుందని ఎమ్మెల్యే కోన రఘుపతి వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం అభివృద్ధికి వైయస్ఆర్సీపీ చేయబోయే అంశాల మీద సమావేశంలో చర్చించనున్నట్లు తెలిపారు. ఏపీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన బ్రాహ్మణ కార్పొరేషన్ మీద అనేక ఆరోపణలు వస్తున్నాయని, ఈ ప్రభుత్వ పోకడ చూస్తుంటే చంద్రబాబుకు బ్రాహ్మణులంటే లెక్కేలేదని కోన రఘుపతి వ్యాఖ్యానించారు. ఐవైఆర్ కృష్ణారావు లాంటి సీనియర్ ఐఏఎస్ అధికారిని బయటకు పంపించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వంలో చూశామన్నారు. రమణ దీక్షితులు లాంటి ఆగమ శాస్త్ర పండితులను అన్యాయంగా టీడీపీ ప్రభుత్వం బయటకు పంపించిందని విమర్శించారు. చంద్రబాబు దయవల్ల ఈ రోజు ఎన్నికలు క్యాష్, కాస్ట్ ఉంటేనే రావాల్సిన పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. బ్రాహ్మణ సంఘాల ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో బ్రాహ్మణులు హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు.<br/><br/>