<strong>ఐజ (మహబూబ్నగర్ జిల్లా),</strong> 25 నవంబర్ 2012: తెలంగాణ ప్రజలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారని పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు కె.కె. మహేందర్రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో తమ పార్టీ బలపడుతున్న క్రమాన్ని చూసిన టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా టీఆర్ఎస్కు బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి తరఫున ఆయన సోదరి చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో మహేందర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారంనాడు మీడియాతో మాట్లాడారు.<br/>వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అవగాహన లేకుండా అసందర్భంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రాంతాన్ని మిగతా ముఖ్మమంత్రులందరి కంటే దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డే ఎక్కువగా అభివృద్ధి చేశారని ఆయన గుర్తు చేశారు. పాలమూరు జిల్లాలో 4 ప్రాజెక్టులను తీసుకొచ్చింది వైయస్సే అని మహేందర్రెడ్డి తెలిపారు.