<strong><br/></strong><strong><br/></strong><strong>- సీఎం సభలో ఎంపీపై అధికార పార్టీ నేతల దౌర్జన్యం</strong>వైయస్ఆర్ జిల్లా: పులివెందుల జన్మభూమి సభలో టీడీపీ నేతలు బుధవారం ఓవరాక్షన్ చేశారు. గండికోట, చిత్రవతి ఎత్తిపోతల పథకం ప్రారంభ సభలో కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ప్రసంగాన్ని టీడీపీ నేతలు అడుగడుగునా అడ్డుకున్నారు. ఓ దశలో చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు ఆయనను చుట్టుముట్టి... చేతిలోని మైక్ను కూడా లాక్కునేందుకు యత్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలోనే ఎంపీ పట్ల టీడీపీ నేతలు దురుసుగా ప్రవర్తించారు. సాక్షాత్తూ సీఎం కూడా అదే పంథాను అనుసరించారు. ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడనివ్వకుండా ఏయ్..మైక్ తీసుకో... ఇక్కడ ఏమీ మాట్లాడవద్దు అంటూ మైక్ కట్ చేయించారు. అంతేకాకుండా ఎవరేం చేశారో ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదన్న చంద్రబాబు, చెప్పదలుచుకున్న విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలంటూ ఉచిత సలహా ఇచ్చారు. అయితే చంద్రబాబు, టీడీపీ నేతల తీరుపై అవినాష్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.<br/>అంతకు ముందు సభలో అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. గండికోట, చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ప్రారంభించినా, ఆ ప్రాజెక్ట్కు సంబంధించి 85 శాతం పనులు పూర్తి చేయించిన ఘనత దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిదేనని అన్నారు. రూ.1300 కోట్లు వెచ్చించి 85 శాతం పనులు పూర్తి చేయించారని, పులివెందులను సస్యశ్యామలం చేసిన ఘటన వైఎస్ఆర్దేనని గుర్తు చేశారు. దివంగత నేత వైయస్ఆర్ కృషిని ఎవరు మరువలేరని అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. ఏకంగా చంద్రబాబే అడ్డుతగిలి మాట్లాడకుండా అడ్డుకున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎంపీపై పబ్లిక్గా దౌర్జన్యం చేయడం ప్రజాస్వామ్యంలో మాయని మచ్చ. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు ఇలాంటి చర్యలను ప్రోత్సహించడం సిగ్గు చేటు.