నెమ్మదిగా కోలుకుంటున్న వైయస్ జగ‌న్

హైదరాబాద్, 1 సెప్టెంబర్‌ 2013:

వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వై‌యస్ జగ‌న్మోహన్‌రెడ్డి ఆరోగ్యం నెమ్మదిగా కుదుటపడుతోందని నిమ్సు వైద్యులు వెల్లడించారు. శ్రీ జగన్‌ ఆరోగ్య పరిస్థితిపై ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు వైద్యులు హెల్తు బులెటిన్‌ విడుదల చేశారు. ఆయన మరింతగా కోలుకుంటే సాయంత్ర ఘనాహారం ఇస్తామని తెలిపారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డిరి ఇంకా ప్లూయిడ్సు అందిస్తున్నట్లు వైద్యులు వివరించారు. ఆయన కోలుకోవడానికి మరి కొంత సమయం పడుతుందని చెప్పారు. మరో రెండు రోజుల వరకు ఆయనకు విశ్రాంతి అవసరమని వారు విడుదల చేసిన హెల్తు బులెటిన్ లో వివరించారు.

‌ఆంధ్రప్రదేశ్ రా‌ష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించేందుకు కాంగ్రెస్ పార్టీ‌ తీసుకున్న నిరంకుశ నిర్ణయ వైఖరికి నిరసనగా ఏడు రోజుల పాటు శ్రీ జగన్ ‌నిరవధిక నిరాహార దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అన్ని ప్రాంతాల వారికీ సమన్యాయం చేయాలని, అలా చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్‌తో ఆయన చంచల్‌గూడ నిర్బంధంలో ఉండి కూడా దీక్ష చేశారు.

నీరసంగానే ఉన్న శ్రీ జగన్:
కాగా, నిమ్సులో ఉన్న శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డికి ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో వైద్యులు పరీక్షలు నిర్వహించారు. శ్రీ జగన్ నీరసంగా ఉ‌న్నారని ఆయన సతీమణి శ్రీమతి వైయస్‌ భారతి మీడియాకు చెప్పారు. శ్రీ జగన్‌కు సహాయంగా ఉండేందుకు శ్రీమతి భారతి ఉదయం 8 గంటలకు నిమ్సుకు చేరుకున్నారు. ఆస్పత్రిలో ఉన్నంతకాలం రోజూ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు శ్రీ జగన్‌కు సహాయంగా ఉండేందుకు శ్రీమతి భారతికి సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే.

Back to Top