చరిత్రను మార్చే సంతకాలు చేస్తా

ఏలూరు:

చరిత్రను మార్చే, ప్రజల జీవితాలను మలుపు తిప్పే నాలుగు కీలక పథకాలపై సంతకాలు చేస్తానని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చెప్పారు. తాను సీఎం అయిన వెంటనే ఈ సంతకాలు చేస్తానని హామీ ఇచ్చారు. ‘అక్కా చెల్లెళ్ళ కళ్ళలో ఆనందాన్ని చూడడానికి మొట్టమొదటి సంతకాన్ని ‘వైయస్ఆర్ అమ్మ ఒడి’ పథకంపై చేస్తా. పిల్లలను బడికి పంపించే తల్లికి అండగా నిలుస్తాం. విద్యార్థికి రూ.500 చొప్పున కుటుంబానికి ఇద్దరు పిల్లలకు రూ. వెయ్యి ఆ అమ్మ ఖాతాలో వేస్తాం. ఇక రెండో సంతకం.. ప్రతి అవ్వ కోసం, తాత కోసం వారి మనవడిగా చేస్తా. ప్రస్తుతం ఇస్తున్న పెన్ష‌న్‌ను రూ.700కు పెంచుతా. మూడో సంతకం రైతన్న కోసం పెడతా. రైతన్నలకు గిట్టుబాటు కోసం రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తూ సంతకం చేస్తా. నాలుగో సంతకం డ్వాక్రా రుణాలను మాఫీ చేయడానికి పెడతా. ఈ నాలుగు సంతకాలు చరిత్రను మారుస్తాయి. ఆ తర్వాత రాష్ట్రాన్ని సింగపూర్‌ కన్నా అగ్రగామిగా చేస్తా. విశ్వసనీయతకు అర్థం తీసుకువచ్చే పరిపాలనను చేస్తా’ అని శ్రీ జగన్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సోమవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ‘వైయస్ఆర్ జనభేరి’ సభ నిర్వహించారు. ఈ సభకు తరలివచ్చిన జనవాహినిని ఉద్దేశించి ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు.

‌మహానేత వైయస్ఆర్‌ను చూసి ఈ నేతలు నేర్చుకోవాలి :
‘రాజకీయం అంటే రెండు పదాలకు అర్థం తెలిసి ఉండాలి. ఒకటి విశ్వసనీయత, రెండోది విలువలు, వ్యక్తిత్వం. ప్రస్తుతం చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో టార్చిలైట్ వేసి చూసినా, భూతద్దం పెట్టి వెతికి చూసినా రాజకీయ నాయకుల్లో విలువలు కర‌వైన పరిస్థితులే కనబడుతున్నాయి. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి మరణించి ఐదేళ్ళు కావొస్తోంది. ఆయన ఎక్కడ ఉన్నాడని ఎవరినైనా అడిగితే గుండెలు చూపించి మా గుండె లోతుల్లో ఉన్నాడని చెబుతారు. అటువంటి వారిని విశ్వసనీయమైన వ్యక్తి, రాజకీయాల్లో విలువలు ఉన్న వ్యక్తి అంటారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎన్నాళ్లు బతికామని కాదు, ఎలా బతికామనేది ముఖ్యమని వైయస్ఆర్ ఎప్పుడూ చెప్పేవారు. ఆ చనిపోయిన నేత నుంచి ఈ నాయకులు గుణ పాఠాలు నేర్చుకోవాలి‌' అన్నారు.

చంద్రబాబు భయానక పరిపాలన :
'మహానేత వైయస్ఆర్‌ ముఖ్యమంత్రి కాక ముందు రాష్ట్రంలో చంద్రబాబు భయానక పాలన సాగేది. ఆ సమయంలో గ్రామాలకు వెళ్లినప్పుడు దయనీయమైన పరిస్థితులు కనిపించేవి. అవ్వా తాతలకు ముష్టి వేసినట్టు రూ.70 పెన్షన్ ఇచ్చేవారు. అది కూడా గ్రామానికి 15 మందికో, 20 మందికో  ఇచ్చేవారు. వేరే ఎవరికైనా పెన్ష‌న్ కావాలని అడిగితే.. ఆ గ్రామంలో పెన్ష‌న్ తీసుకుంటున్న ఎవరో ఒకరు చనిపోతేగాని ఇచ్చే పరిస్థితి లేద'ని అధికారులు చెప్పేవారు.‌

'పిల్లలను ఇంజనీరింగ్ చదివించాలంటే అప్పట్లో తల్లిదండ్రులు ఇల్లు, ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చేది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పిల్లల దగ్గరకెళ్లి ఎలా చదువుతున్నారని అడిగిన పాపానపోలేదు. గ్రామాల్లో ఎవరికైనా జబ్బు చేసి వైద్యానికి లక్షో, రెండు లక్షలో కావాల్సి వస్తే.. ఎంత వడ్డీ అయినాసరే డబ్బు తీసుకు రావటానికి పరిగెత్తేవారు. రూ.2 లక్షలతో ఆ పెద్దాయన ప్రాణాలు నిలబెట్టుకున్నా అప్పు తీర్చడం కోసం జీవితాంతం ఊడిగం చేసే దుస్థితి' ఉండేదని శ్రీ జగన్‌ ఆవేదన వ్యక్తంచేశారు.

రెండు రూపాయల బియ్యాన్ని ఐదుంపావలా చేశారు :
ఎన్నికల వేళ చంద్రబాబు అక్కాచెల్లెళ్ల వద్దకు వెళ్లి రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని అబద్ధాలు చెప్పారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ బియ్యాన్ని ఐదు రూపాయల పావలా చేయడం నాకింకా గుర్తుంది. చంద్రబాబు భయానక పాలనలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ‘ఉచితంగా కరెంటు’ ఇచ్చి ఆదుకోవాలని ఉద్యమాలు జరిగాయి. ఉచిత విద్యుత్ ఇస్తే ఈ తీగలు బట్టలు ఆరేసుకోవడానికే పనికొస్తాయని‌ చంద్రబాబు ఎద్దేవా చేశారన్నారు.

'మహానేత రాజశేఖరరెడ్డి చనిపోయాక ఓట్లు, సీట్ల కోసం ప్రజలను అమ్మేయటానికి సిద్ధపడిన రాజకీయ నాయకుడు చంద్రబాబు. ఒక పక్క విభజన బిల్లు అన్యాయం అంటూనే పార్లమెంటులో తన ఎంపీలతో బిల్లుకు అనుకూలంగా ఓటేయిస్తారు. ఇంత దారుణంగా ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సిగ్గు లేకుండా సీమాంధ్రను సింగపూర్ చేస్తానని చెబుతున్నారు. ‌చంద్రబాబూ... నీవు కత్తి తీసుకుని ఒక మనిషిని పొడిచేశావ్. ఆ తర్వాత ఆ వ్యక్తిని మళ్లీ శ్మశానానికి నేనే తీసుకెళతానని చెబుతున్నా‌వ్’‌ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

సింగపూర్‌ కంటే అగ్రగామిగా చేస్తాం:
'కేంద్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ, రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష చంద్రబాబు పార్టీ కలిసిపోయాయి. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించాయి. వీరందరూ చేస్తున్న అన్యాయాన్ని పైనున్న దేవుడు చూస్తున్నాడు. ఎన్నికలు వస్తున్నాయి.. ఆ ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీ ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకుందాం. మన ప్రభుత్వాన్ని మనమే ఏర్పాటు చేసుకుందాం. చంద్రబాబూ ఒక్కటి చెబుతున్నా ప్రజలమంతా కలిసి ఒక్కటవుతాం.. వచ్చే ఎన్నికల్లో 30 ఎంపీ స్థానాలు గెలుచుకుంటాం. మా వల్లే కేంద్రంలో ప్రధానమంత్రి ఎవరనేది నిర్ణయించేలా చేస్తాం. రాష్ట్రానికి అవసరమైన నిధులు తెచ్చుకుంటాం. అప్పుడు సింగపూర్ కాదు‌ కదా షాంఘై, దుబాయ్, వాషింగ్టన్‌ల స్థాయిలో అభివృద్ధి చేస్తాం. చంద్రబాబూ నువ్వు పాతతరం మనిషివి. నేను నీకన్నా 25 ఏళ్ల చిన్నవాడిని. మేమంతా యువకులం. నీకన్నా మెరుగ్గా మా రాష్ట్రాన్ని పాలించుకుంటాం. యువతరాన్ని ఎదిరిస్తే, మోసాలు చేస్తే మిమ్మల్ని బంగాళాఖాతంలో కలిపేస్తాం’ అంటూ హెచ్చరించారు.

Back to Top