కర్నూలు: కూటమి ప్రభుత్వ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని, ఒకే జెండా మోస్తా.. ఒకే నాయకుడితోనే ఉంటా.. చచ్చినా, బ్రతికినా వైయస్ జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఉంటా అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పష్టం చేశారు. పోలీసుల వేధింపుల కారణంగానే వైయస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కర్నూలులో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, వైయస్ఆర్సీపీకి వెన్నుదన్నుగా నిలిచిన దళితులు, బీసీలు, మైనార్టీలను కూటమి నాయకులు లక్ష్యంగా చేసుకుని వేధింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. రాజకీయ కక్షసాధింపులతో హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మంత్రి టీజీ భరత్ కనుసన్నల్లోనే కర్నూలు పోలీస్ యంత్రాంగం పనిచేస్తోందని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వ్యాఖ్యానించారు. కర్నూలు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బాలు పై త్రీటౌన్ సీఐ శేషయ్య వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. హింసాత్మక ఘటనలను ప్రోత్సహిస్తూ “శునకానందం” పొందుతున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. మంత్రి టీజీ భరత్, నారా లోకేష్ కళ్లుగప్పి వందల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించిన ఆయన, తాను తండ్రి అండతో కానీ, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కానీ రాజకీయాల్లోకి రాలేదన్నారు. వైయస్ఆర్సీపీ కార్యకర్తలు మనోధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా నిలుస్తుందని ఆయన హామీ ఇచ్చారు.