హైదరాబాద్, 27 ఆగస్టు 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి చంచల్గూడ జైలులో చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షను మంగళవారం మూడవ రోజున కూడా కొనసాగిస్తున్నారు. దీనితో ఆయన దీక్ష చేపట్టి 50 గంటలు దాటింది. సమన్యాయం చేయలేని పక్షంలో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలన్న డిమాండ్తో శ్రీ జగన్ గత ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఆమరణ నిరశన దీక్ష చేస్తున్నారు. జైలు వైద్యులు ఉదయం మరోసారి శ్రీ జగన్కు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.
శ్రీ జగన్మోహన్రెడ్డి నిరశన దీక్ష చేపట్టినప్పటి నుంచీ సోమవారం రాత్రి వరకూ వైద్యులు మూడుసార్లు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయనకు ఉదయం, సాయంత్రం... రోజుకు రెండు సార్లు జైలు వైద్యులు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులు చెప్పే వివరాలను, ఇచ్చే నివేదికలను జైలు అధికారులు ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేస్తున్నారు.
కాగా శ్రీ జగన్మోహన్రెడ్డి దీక్ష చేపట్టి మూడు రోజులు కావస్తుండటంతో ఆయనకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. శ్రీ జగన్ ఆరోగ్యం క్షీణిస్తే... ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై జైలు అధికారులు చర్చించే అవకాశముంది.
మరోవైపున శ్రీ వైయస్ జగన్ దీక్షకు మద్దతు తెలిపేందుకు చంచల్గూడ జైలు వద్దకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీనితో జైలు పరిసర ప్రాంతాల్లో పోలీసు భద్రత కట్టుదిట్టం చేశారు. భారీగా బలగాలను మొహరించారు. చంచల్గూడ జైలు పరిసరాల్లోని రోడ్లపై ఆంక్షలు విధించారు.