తడిసి మోపెడయిన ఎరువుల ధరలు

గోవాడ (విశాఖ జిల్లా) :

విపరీతంగా పెరిగియిన ఎరువుల ధరల కారణంగా కొనే పరిస్థితి లేక చెరకు పంటకు వేయలేకపోతున్నామని చెరుకు రైతులు శ్రీమతి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ఎరువులు వేయకపోవడంతో చెరకుగడలు సన్నమై, బలహీనం కావడంతో దిగుబడి తగ్గిపోయిందని వారు వాపోయారు. అసలే పెట్టుబడులు పెరిగిపోయి, మద్దతు ధర కూడా దొరకని ఈ సమయంలో పంట దిగుబడి కూడా తగ్గిపోతే ఇక తమ బ్రతుకులు ఎలా బాగుపడతాయంటూ రైతులు విచారంగా చెప్పుకున్నారు. సన్నగా పెరిగిన చెరకుగడలను రైతులు శ్రీమతి షర్మిలకు చూపించి, ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖజిల్లా గోవాడలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 195వ రోజు ఆదివారంనాడు ఈ సందర్భం చోటుచేసుకుంది. ‘చెరకుగడ ఎందుకంత సన్నగా ఉందన్నా?’ అని శ్రీమతి షర్మిల అడిగిన ప్రశ్నకు రైతులు ఇలా ఆవేదన చెప్పుకున్నారు.

ఈ రైతులందరికీ పొలాల్లో బోర్లు ఉన్నాయి. బోర్లలో నీళ్లు కూడా ఉన్నాయి. అయితే రోజుకు 3 నుంచి 4 గంటలకు మించి రాని కరెంటుతో పోటీపడి, చెమటను నీరుగా చేసి చెరకు పంటను వారంతా పెంచుకున్నారు. అయినా లాభం లేకపోయింది. తమ పొలంలో సన్నగా, బలహీనంగా పెరిగిన చెరకుగడలను రైతులు తీసుకు వచ్చి ఆదివారం పాదయాత్రగా వెళ్తున్న శ్రీమతి షర్మిలకు చూపించారు.

‘అమ్మా.. వచ్చీరాని కరెంటుతో పోటీ పడి పంటకు నీళ్లు పెట్టాం. కానీ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ఎరువులు వేయలేకపోయాం. ఎరువులు వేసి పంట పండించాలంటే క్వింటాల్‌కు రూ. 2,500 ఖర్చు అవుతోంది. మహానేత డాక్టర్ వై‌యస్‌ రాజశేఖరరెడ్డి ఉన్నప్పుడు రూ. 450 ఉన్న డిఎపి బస్తా ఇప్పుడు రూ.1,250కు పెరిగింది. రూ.400 ఉన్న కాంప్లెక్సు ఎరువుల ధర ఈ రోజు రూ. 1,100 అయింది. పొటాష్ రూ. 750.. ఇంత ధర‌ పెట్టి ఎరువులు కొని వేయలేకపోయాం’ అని రైతు దొడ్డి రాముడు చెప్పాడు.

ఇంతలో మరో రైతు బుద్ద గురునాయుడు కల్పించుకుని ‘అమ్మా.. నాన్నకు చేతులెత్తి మొక్కాలి. ఆయన ఉన్నప్పుడు క్వింటాల్ చెరకుకు రూ.1,000 ఖర్చు వస్తే రూ. 2,200 గిట్టుబాటు ధర ఇచ్చాడు. రైతులం‌దరం అప్పుల నుంచి బయటపడ్డాం. ఇప్పుడు పెట్టుబడులు పెరిగిపోయాయి కానీ మద్దతు ధర మాత్రం పెరగలేదమ్మా. ఇప్పుడున్న ప్రభుత్వం రూ.100 తగ్గించి రూ. 2,100 మాత్రమే ఇస్తోందమ్మా’ అని గోడు వెళ్లబోసుకున్నాడు.

ప్రజా సమస్యల గురించి ప‌ట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు, దానితో నిస్సిగ్గుగా అంటకాగుతున్న చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం విశాఖ జిల్లా చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల్లో కొనసాగింది. గోవాడ జంక్షన్‌లో రైతులు ఇలా చెరకు గెడలు చూపించి శ్రీమతి షర్మిల వద్ద ఆవేదన వ్యక్తంచేశారు.

కమిటీల సిఫారసులనూ ప్రభుత్వం పట్టించుకోదా?:
చెరకు రైతుల సమస్యలు విన్న శ్రీమతి షర్మిల స్పందిస్తూ వారికి ధైర్యం చెప్పారు. ‘ఈ నాలుగేళ్లలో వ్యవసాయంపై పెట్టుబడి ఖర్చులు చాలా పెరిగిపోయాయి. ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతం వరకు పెరిగాయి. విత్తనాల ధరలు పెరిగాయి.. రవాణా చార్జీలు పెరిగాయి. పెట్టుబడులేమో ఇంతలా పెరిగాయి. కానీ మద్దతు ధర మాత్రం పెరగలేదు. ఇలా అయితే రైతులు నష్టపోక ఏమవుతారు? ఈ అన్న చెప్తున్నాడు వైయస్‌ఆర్ ఉన్నప్పుడు క్వింటా‌ల్ చెరకుకు రూ. 2,200 మద్దతు ధర ఇచ్చారట. ఐదేళ్లు అవుతోంది. మద్దతు ధర పెంచాల్సింది పోయి ఈ ప్రభుత్వం ఉన్న మద్దతు ధర‌నే కోసేస్తొంది. కనీసం కమిటీలు సిఫారసు చేసిన మేరకు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధర పెంచడం లేదు.

వీళ్లకు రైతులంటే పగా? లేక చిన్న చూపా?:

రైతన్న నెలసరి సగటు ఆదాయం రూ. 1,600 మాత్రమే అని అర్జున్‌‌ సేన్ గుప్తా కమిషన్ చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లోనే అన్నం పెట్టే ‌రైతన్నకు మద్దతు ధర లేక నష్టాల పాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వచ్చాయి. కిరణ్‌ ప్రభుత్వానికి రైతులంటే పగా? లేకపోతే చిన్నచూపా? అని దుయ్యబట్టారు. 'అన్నా ఒక్క మాట మళ్లీ చెప్తున్నా. త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుంది. రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత రైతును రాజులా చూసుకుంటారు. ఏ రైతు కూడా నష్టపోకుండా తమ పంటను గిట్టుబాటు ధరకే అమ్ముకునే పరిస్థితులు వస్తాయి. రైతన్న నష్టపోకుండా ఉండేందుకు రూ.3000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. మరొక్క ఆరు నెలలో, ఏడాదో ఓపిక పట్టండి’ అని ధైర్యం చెప్పారు.

గోవాడ చక్కెర పరిశ్రమకు జీవం :
పాదయాత్రలో శ్రీమతి షర్మిల గోవాడ చక్కెర పరిశ్రమను సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి కార్మికులు ఆమెతో మాట్లాడుతూ మహానేత వైయస్‌ఆర్ గోవాడ చక్కెర పరిశ్రమను నిలబెట్టి తమను ‌ఏ విధంగా ఆదుకున్నారో వివరించారు. ‘2003లో చిత్తూరు, శ్రీవెంకటేశ్వర, గోవాడ, నిజామాబాద్ సహకార చక్కెర మిల్లులను చంద్రబాబు నాయుడు వేలానికి పెట్టారు. గోవాడ సహకార చక్కెర పరిశ్రమ మీద ఆధారపడి ఉన్న 10 మండలాలకు చెందిన దాదాపు 100 గ్రామాల రైతులు, కార్మికులు వేలాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేశారు. అదే సమయంలో రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తూ చోడవరం వచ్చారు. ఆ సమయంలో 100 గ్రామాల ప్రజలు తరలివచ్చి వైయస్‌ఆర్‌కు తమ సమస్యలు వివరించారు. గోవాడ చక్కెర పరిశ్రమను కాపాడాలని కోరారు.

‘మన ప్రభుత్వం రాగానే సహకార రంగానికి చేయూత అందించి మిల్లులను రక్షించుకుందాం’ అని ‌వైయస్‌ఆర్‌ మాటిచ్చారు. ఇటు వైపు చంద్రబాబు నాయుడు గోవాడ కర్మాగారం విక్రయానికి టెండర్లు కోరుతూ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. ఇంతలో ఎన్నికల నోటిఫికేష‌న్ వచ్చింది. టెండర్లు వేసే గడువు ముగిసింది.‌ ఈ చక్కెర ఫ్యాక్టరీని సొంతం చేసుకునేందుకు అప్పటి టిడిపి ఎం.పి, ప్రస్తుత మంత్రి ఒకరు మిల్లును తీసుకునేందుకు సిద్ధమయ్యారు. రైతులు కోర్టుకు వెళ్లారు. టెండర్లను తాత్కాలికంగా నిలిపివేస్తూ కోర్టు ఆదేశాలిచ్చింది. దొరికిన వెసులుబాటుతో రైతులు కదంతొక్కారు. నిలబడి వైయస్‌ఆర్‌కు ఓటు వేసి గెలిపించుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం కూలిపోయింది. వైయస్‌ఆర్ ప్రభుత్వం వచ్చింది. హామీ ఇచ్చినట్లుగానే తొలి విడతలో రూ. 30 కోట్లు ఇచ్చారు. ‌ఆ మహానేత సహకారంతో ఊపిరి పోసుకున్న మిల్లులు ఇప్పుడిప్పుడే లాభాల బాట పడుతున్నాయి’ అని వివరించారు.

గజపతినగరం - గుల్లెపల్లి 14.5 కిలోమీటర్ల యాత్ర :
పాదయాత్ర 195వ రోజు ఆదివారం విశాఖపట్నం జిల్లా చోడవరం నియోజకవర్గంలోని గజపతినగరం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి వెంకన్నపాలెం చేరింది. అక్కడి నుంచి మాడుగుల నియోజకవర్గంలోని రాయపురాజుపేట, సెమునవాడ, చౌడువాడ మీదుగా నడుస్తూ శ్రీమతి షర్మిల గుల్లెపల్లి శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 7.30 గంటలకు చేరుకున్నారు. ఆదివారం మొత్తం 14 .5 కిలోమీటర్లు నడిచారు. కాగా,  శ్రీమతి షర్మిల 195వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ ముగిసే సమయానికి మొత్తం 2,593.4 కిలోమీటర్లు నడిచారు.

Back to Top