పిచ్చోడి మాటలు విని ఎవరైనా ఓటేస్తారా?

కాకినాడ:

మీ ఊరికి పిచ్చోడొకడు వచ్చి ఒక సెంటర్‌లో నిలబడి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే ఆ పిచ్చిమనిషి చెప్పినట్టు వింటారా? ఆ పిచ్చిమనిషి చెప్పినవారికి ఓట్లు వేస్తారా? అని ప్రజలను వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల అడిగారు. అలాంటి పిచ్చోడికి పవన్ కల్యా‌ణ్‌కు తేడా లేనేలేదన్నారు. పేరుకు తగ్గట్టే పవన్‌వి అన్నీ గాలిమాటలు, సొల్లు మాటలే చెబుతున్నారని విరుచుకుపడ్డారు. తూర్పు గోదావరి జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండవ రోజు ఆదివారం కోరుకొండ, రంపచోడవరం, కరపల్లో జరిగిన వైయస్ఆర్ జనభేరి సభల్లో‌ శ్రీమతి షర్మిల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.

‌'పవన్‌ కళ్యాణ్ మొదట ఒక ఆడిటోరియం తీసుకొని పెద్ద సభ పెట్టాడు. జనసేన అనే పార్టీ పెట్టానని ఆర్భాటంగా ప్రకటించాడు. ప్రస్తుతం పోటీచేయడం లేదు, మీ ఇష్టం వచ్చిన వారికి ఆత్మసాక్షిగా ఓట్లు వేసుకోండని చెప్పాడు. వారం రోజులు కూడా తిరక్కుండానే... లేదు, లేదు నేను మోడీని కలిసొచ్చాను... మీరంతా మోడీకి ఓట్లేయండని చెప్పాడు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబుకు ఓట్లేయమని చెబుతున్నాడు. పూటకో మాట మార్చే ఈ పవన్ కల్యా‌ణ్‌కు విలువల్లేవు.. విశ్వసనీయత లేదు. ఆయనకు ఉన్నదంతా ఒకటే... లెక్కలేనంత తిక్క. ఆ తిక్కంతా ఆయన మాటలు, చేతలు, చేష్టల్లో స్పష్టంగా కనిపిస్తూనే ఉంది’ అని శ్రీమతి షర్మిల నిప్పుల చెరిగారు.

‘అధికారం కోసం చంద్రబాబు ఎవరితోనైనా కలుస్తాడు... ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడు. ఆనాడు రాజశేఖరరెడ్డి గారిని ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక రాష్ర్టంలోని మిగిలిన పార్టీలతో కలసి మహాకూటమి పెట్టుకున్నాడు. కానీ తెలుగు ప్రజలు తెలివైనవారు... చంద్రబాబు మహాకూటమిని నమ్మలేదు. మాట తప్పని, మడమ తిప్పని మహానేతకే పట్టం కట్టారు. ఇప్పుడు ఆ రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్మోహన్‌రెడ్డిని కూడా ఒంటరిగా ఎదుర్కోలేక బీజేపీని, మోడీని, వెంకయ్య నాయుడిని తీసుకొచ్చాడు. ఇవే ఆఖరి ఎన్నికలు కదా... పాపం తెచ్చుకున్నాడులే అనుకోవచ్చు. ఆఖరికి పవ‌న్ కళ్యాణ్ కాళ్లు కూడా పట్టుకున్నాడంటే చంద్రబాబు అధికారం కోసం ఏ గడ్డి తినడానికైనా వెనకాడడని అర్థమవుతోంది. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలుతుందంతే’ అ‌ని దుయ్యబట్టారు.

మహానేత వైయస్ఆర్ రాష్ట్రం సుభిక్షం‌ :
‘రాజశేఖరరెడ్డి మన రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఉన్నప్పుడు రాష్ర్టం ఎంత సుభిక్షంగా ఉండేదో నేను మీకు ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. రైతులు, చేనేతలు, కార్మికులు, మహిళలు, విద్యార్థులు, వృద్ధులు, మైనార్టీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు... ఇలా ప్రతి వర్గానికీ భరోసా కల్పించిన నాయకుడు వైయస్ రాజశేఖరరెడ్డి. కులా‌లు.. మతాలు.. ప్రాంతాలు.. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కృషి చేసిన మహానేత మన రాజన్న. దురదృష్టం కొద్దీ వైయస్ఆర్ మరణం తర్వాత అధికారం చేపట్టిన కిర‌ణ్‌కుమార్‌రెడ్డి అని పథకాలకు తూట్లు పొడిచారు’ అని శ్రీమతి షర్మిల ఆరోపించారు.

Back to Top