హైదరాబాద్ః రాజన్న బిడ్డ, వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్ర గ్రేటర్ హైదరబాద్ పరిధిలో కొనసాగుతోది. పార్టీ శ్రేణులు, అభిమానులు, గ్రేటర్ ప్రజలు షర్మిలకు అపూర్వ స్వాగతం పలికారు. ప్రతి ఒక్కరినీ షర్మిల ఆత్మీయంగా పలకరించారు. మహానేత మరణాన్ని జీర్ణించుకోలేక చనిపోయిన కుటుంబసభ్యులను పరామర్శించి వారిలో ధైర్యం నింపారు. ఇవాళ మొత్తం 8 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించారు. వారి కుటుంబ స్థితిగతులు, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పరామర్శయాత్రలో భాగంగా జీడిమెట్ల షాపూర్నగర్ చౌరస్తాలో షర్మిల వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళుర్పించారు. భారీ బహిరంగ సభనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. <br/>షర్మిల ఏమన్నారంటే....<br/>ఒక నాయకుడు చనిపోతే ఆబాధను జీర్ణించుకోలేక వందల గుండెలు ఆగిపోవడం ప్రజాస్వామ్య భారత దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడ జరగలేదుప్రజల బాధను తన బాధగా మార్చుకున్న గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేసిన నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి తాను ముఖ్యమంత్రి అయిన క్షణం నుంచి ప్రజల కోసం కనివీని ఎరుగని రీతిలో అద్భుత పథకాలు అందించారు. రైతును రాజును చేశాడు కాబట్టి రాజన్న అయ్యాడు. కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నాడు. అన్నం పెట్టే అన్నదాత అప్పుల పాలు కావొద్దని రుణమాఫీ, గిట్టుబాటు ధర, ఇన్ పుట్ సబ్సిడీ సహా రైతులకు ఎంతో మేలు చేశారు.ప్రతి మహిళా లక్షాధికారి కావాలని కలకు కన్నారు. పావలా వడ్డీకే రుణాలు ఇచ్చి మహిళలందరికీ భరోసా కల్పించారు. డబ్బులేని కారణంగా చదువు ఆగిపోవద్దని ఫీజు రీయింబర్స్ మెంట్ తో ఎంతోమందికి చదువుకునే భాగ్యం కల్పించారు.రాజన్న దయతో ఉచితంగా చదువుకొని ఎంతోమంది లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ముందు ఎవరూ కూడా పేదవాడికి జబ్బు గురించి ఆలోచన చేయలేదు. రాజన్న వచ్చాక ఆరోగ్యశ్రీతో లక్షలాది మంది కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకొని పునర్జన్మ పొందారు.కుయ్ కుయ్ అంటూ వచ్చి 108 ఎంతోమందికి ప్రాణం పోసింది. హైదరాబాద్ మహానగరాన్ని గ్రేటర్ చేసిందే వైఎస్ రాజశేఖర్ రెడ్డి .చుట్టుపక్కల గ్రామాలను గ్రేటర్ లో చేర్చి వారిని కూడా అభివృద్ధి చేయాలనుకున్నారు. దేశంలోనే అతిపెద్ద ఔటర్ రింగ్ రోడ్డు సాధించిన ఘనత వైఎస్సార్ దే.శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మించారు. అక్కడకు వెళ్లడానికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా 12 కి.మీ. ఎలివేటెడ్ ఎక్స్ ప్రెస్ వే నిర్మించారు. మెట్రో రైలుకు రూపకల్పన చేశారు. రాజన్నే గనుక బతికే ఉంటే మెట్రో ఎప్పుడో పూర్తయ్యేది. హైదరాబాద్ లో నీటి కొరత లేదంటే కారణం వైఎస్సార్. కృష్ణా, గోదావరి లను తీసుకొచ్చి ప్రజల దాహార్తిని తీర్చారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పనులను మేమే చేశామంటూ ఆతర్వాత వచ్చిన నాయకులు చెప్పుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తన హయంలో ఐటీ రంగాన్ని ఐదో స్థానంలోకి తీసుకొచ్చారు. సాఫ్ట్ వేర్ రంగానికి సంబంధించి ఎగుమతులను 9 నుంచి 14 శాతానికి పెంచారు. రాజీవ్ గృహకల్ప గురించి చెప్పనక్కర్లేదు. దేశంలోనే ఎక్కడ లేనివిధంగా ఒక్క మన రాష్ట్రంలోనే 46 లక్షల ఇళ్లు కట్టించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. ఆయనే బతికుంటే ప్రతి పేదవాడికి పక్కా ఇల్లు ఉండేది.ప్రతి ముస్లిం సోదరుడికి రిజర్వేషన్ కల్పించారు. 5 శాతం రిజర్వేషన్ కోసం పార్లమెంట్ లో పోరాడి 4 శాతం సాధించారు. కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరికీ తన పథకాలతో మేలు చేశారు. ప్రతి మనిషిని గౌరవించారు. పేదలను గుండెల్లో పెట్టుకున్నారు.అన్ని ప్రాంతాలను సమానంగా చూశారు. రాజన్నకు మరణం లేదు. తెలుగుజాతి ఉన్నతంకాలం రాజన్న బతికే ఉంటాడు.ఆయన ఆశయాలను పథకాలను మనమే బతికించుకోవాలి. చేయి చేయి కలిపి రాజన్న రాజ్యం తెచ్చుకోవాలి. మండుటెండను సైతం లెక్కచేయకుండా వచ్చిన ప్రతి ఒక్కరికీ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.