షర్మిల పాదయాత్రకు తెలంగాణలో విశేష స్పందన

హైదరాబాద్‌, 11 డిసెంబర్‌ 2012: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ‌ అధ్యక్షుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా విశేష స్పందన, ఆదరణ చూపిస్తున్నారని పార్టీ నాయకుడు శ్రీ వైయస్‌ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. శ్రీమతి షర్మిల పాదయాత్రకు పార్టీలకు అతీతంగా అనూహ్యమైన స్పందన వస్తోందన్నారు. పాలమూరుజిల్లాలో పాదయాత్ర ముగించుకుని రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించిన సమయంలో వివేకానందరెడ్డి శ్రీమతి షర్మిల వెంట పాదయాత్రలో పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని కొలపడకల్‌లో ప్రవేశించడంతో మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేరడంతో రంగారెడ్డి జిల్లాలో ప్రారంభమైంది.

ఈ సందర్భంగా శ్రీ వివేకానందరెడ్డి కాసేపు మీడియాతో మాట్లాడారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి అభిమానులు, పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజల మద్దతుతో శ్రీమతి షర్మిల పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోందని ఆయన హర్షం వ్యక్తం చేశారు.  కాంగ్రెస్, ‌టిడిపిలు కుమ్మక్కు రాజకీయాలతో శ్రీ జగన్మోహన్‌రెడ్డిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయని శ్రీ వివేకానందరెడ్డి నిప్పులు చెరిగారు.

ప్రజా సమస్యలు గాలికి వదిలేని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి, దానితో అంట కాగుతూ, పరోక్షంగా మద్దతుగా నిలుస్తున్న చంద్రబాబు తీరుకు నిరసనగా శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున ఆయన సోదరి శ్రీమతి షర్మిల గత అక్టోబర్‌ 18న మరో ప్రజా ప్రస్థానం సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలోని వైయస్‌ఆర్‌ ఘాట్‌ నుంచి ప్రారంభమైన శ్రీమతి షర్మిల పాదయాత్ర కడప, అనంతపురం, కర్నూలు, పాలమూరు జిల్లాల్లో కొనసాగి మంగళవారం సాయంత్ర రంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశించింది.
Back to Top