వైయస్ఆర్ జిల్లా: నీటి సాధన కోసం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన పాదయాత్రకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ.. గండిపేట నుంచి సర్వరాయసాగర్కు నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రేపటిలోగా నీరు విడుదల చేయకపోతే వైయస్ఆర్ కడప జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్ష చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాయలసీమకు నీరు ఇవ్వకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. పట్టసీమతో సీమకు నీరు ఇస్తానని, వ్యవసాయాన్ని సస్యశ్యామలం చేస్తానని ప్రగల్భాలు పలికి చుక్క నీరు కూడా విడుదల చేయడం లేదని ధ్వజమెత్తారు. పట్టిసీమ ప్రాజెక్టు పేరుతో టీడీపీ నేతలు వందల కోట్లు దండుకున్నారని విమర్శించారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞం పేరుతో ప్రాజెక్టును చేపట్టి దాదాపు పూర్తి చేస్తే మిగిలిన పనులను కంప్లీట్ చేయడానికి చంద్రబాబు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారన్నారు. గండిపేట నుంచి సర్వరాయసాగర్కు నీరు విడుదల చేయాలని పలుమార్లు ధర్నాలు చేసినా ప్రభుత్వం పెడచెవిన పెట్టడం దుర్మార్గమన్నారు.