అన్నొస్తున్నాడు



- ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు భారీ స్పంద‌న‌
- స‌మ‌స్య‌లు చెప్పుకుంటున్న ప్ర‌జ‌లు
- సావ‌ధానంగా వింటున్న ప్ర‌తిప‌క్ష నేత  
- ఇవాల్టి నుంచి ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలో వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌
 

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ల‌పెట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఊహించిన దానికంటే ఎక్కువ స్పంద‌న వ‌స్తోంది. నాలుగేళ్ల చంద్ర‌బాబు పాల‌న‌లో విసిగిపోయిన ప్ర‌జ‌లు రాజ‌న్న బిడ్డ కోసం ప‌నులు మానుకొని ఎదురుచూస్తున్నారు. జ‌న‌నేత ఏగ్రామానికి వెళ్లినా ఊరంతా ఏక‌మ‌వుతోంది. కుల‌, మ‌తాల‌కు అతీతంగా ప్ర‌జ‌లు ఒక్క‌ట‌వుతున్నారు. అదిగో అన్నొస్తున్నాడ‌ని ఎదురెళ్లి స్వాగ‌తం ప‌లుకుతున్నారు. ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభ‌మైన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్ర‌స్తుతం క‌ర్నూలు జిల్లాలో సాగుతోంది. నిన్న‌టి వ‌ర‌కు మూడు రోజుల పాటు ఎమ్మిగ‌నూరు నియోజ‌క‌వ‌ర్గంలో పాద‌యాత్ర చేసిన వైయ‌స్ జ‌గ‌న్ ఇవాల్టి నుంచి ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టారు. 

అడుగు పెట్ట‌డ‌మే ఆల‌స్యం..
పాదయాత్ర సాగిస్తున్న వైయ‌స్ జగన్‌ పట్ల పల్లెల్లో ఆత్మీయత ఉట్టిపడుతోంది. అడుగడుగునా అభిమానం అడ్డుపడుతుండటంతో ఊరు దాటాలంటే ఆలస్యమైపోతోంది. జననేతను చూసేందుకు ఊరంతా పోటీపడుతోంది. అడుగు పెట్టడమే ఆలస్యం.. అలసిపోయిన పాదాలకు ముద్ద బంతులు పాన్పులవుతున్నాయి. మహిళల మంచి మనసులే మంగళహారతులవుతున్నాయి. ‘అన్నొస్తున్నాడు’ అంటూ జనం రోడ్డుపైకి పరుగెత్తుకొస్తున్నారు. మిద్దెలు, మేడలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. ఆమడ దూరం నుంచే అభివాదం చేసేవాళ్లు.. ముకుళిత హస్తాలతో నమస్కరించే వాళ్లు.. యువత కేరింతలు.. అమ్మల ఆత్మీయ పలకరింపులు. ‘అదిగో అన్న’ అంటూ చిన్నారులను భుజాలకెత్తుకుని చూపించే తల్లిదండ్రులు.. అక్కా చెల్లెమ్మలు.. చేతికర్ర ఊతంతో జననేతను సమీపించేందుకు పోటీపడే వృద్ధులు.. ఈ దృశ్యాలు ఊరూరా కనిపిస్తున్నాయి. ఆ పూట తిండీతిప్పలు పట్టించుకోకుండా వేలాది జనం వైయ‌స్‌ జగన్‌ కోసం ఎదురు చూస్తున్నారు. దగ్గరకు రాగానే.. రాజ‌న్న బిడ్డ‌తో మాట కలపడానికి, కరచాలనం చేయడానికి పోటీ పడుతున్నారు. వైయ‌స్ జగన్‌ను చూసేందుకు, పలకరించేందుకు, కరచాలనం చేసేందుకు జనం ఉత్సాహం చూపుతున్నారు.  దారి పొడువునా బస్సు కిటికీల్లోంచే జనం బయటకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.  త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రిని జ‌న‌నేత ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తున్నారు. వారి స‌మ‌స్య‌లు సావ‌ధానంగా వింటున్నారు. మీ పిల్లలను నేను చదివిస్తా’ నంటూ భరోసా ఇస్తున్నాడు. అన్న‌దాత‌ల‌కు అండ‌గా ఉంటాన‌ని, ఏ క‌ష్టం రానివ్వ‌న‌ని మాట ఇస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు వైయ‌స్ జ‌గ‌న్ 300 కిలోమీట‌ర్ల పాద‌యాత్ర‌ను పూర్తి చేశారు. ఇంకా 2700 కిలోమీట‌ర్లు జ‌న‌నేత పాద‌యాత్ర సాగ‌నుంది. ప్ర‌తి ప్రాంతానికి వెళ్తున్నారు. ప్ర‌తి ఒక్క‌రి స‌మ‌స్య‌లు వింటున్నారు. ప్ర‌జ‌ల‌కు మ‌ళ్లీ రాజ‌న్న పాల‌న తెచ్చేందుకు అవిశ్రాంతంగా పాద‌యాత్ర చేస్తున్నారు. 





Back to Top