<span style="text-align:justify">హైదరాబాద్: ప్రజల నాడిని గమనించిన చంద్రబాబు 2019లో టీడీపీ అధికారంలోకి రాదనే నమ్మకంతో రాష్ట్ర వనరులన్నింటినీ తన కోటరీకి కట్టబెట్టేందుకు కుతంత్రాలు చేస్తున్నాడని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రి కొలుసు పార్థసారధి విమర్శించారు. హైదరాబాద్ లోటస్పాండ్లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను, ప్రమాణ స్వీకరం రోజు పెట్టిన సంతకాలను పక్కనబెట్టి ఇంకా ఏ రకంగా రాష్ట్రాన్ని దోచుకోవాలని సీఎం కొత్త విధానాలను రచిస్తున్నాడని ఆరోపించారు. తాగునీటి సమస్యలను పరిష్కరించకుండా మద్యం అమ్మకాలు ఎలా పెంచాలని తాపత్రయపడుతున్నాడని దుయ్యబట్టారు. బెల్ట్షాపులు రద్దు చేస్తానని ప్రమాణ స్వీకరం రోజున పెట్టిన మొదటి సంతకం ఏమైందని చంద్రబాబును ప్రశ్నించారు. <br/></span>