కడప కార్పొరేషన్: రాయలసీమ సమస్యలపై సెప్టెంబర్ 3న కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని ఆ పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. స్థానిక వైయస్ఆర్సీపీ కార్యాలయంలో నగర అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, యువజన విభాగం అధ్యక్షుడు చల్లా రాజశేఖర్, వైయస్ఆర్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ. సురేష్కుమార్, మైనార్టీ నగర అధ్యక్షుడు షఫీ విలేకరులతో మాట్లాడారు. శ్రీౖశైలంలో 874 అడుగుల నీటిమట్టాన్ని కొనసాగించి పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమలోని సాగునీటి ప్రాజెక్టులకు నీరివ్వాలని ఇక్కడి రైతాంగం కోరుతుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
ఈ ప్రభుత్వానికి అమరావతిపై ఉన్న శ్రద్ధ రాయలసీమపై లేదని, జిల్లాకు రావలసిన ఉక్కుఫ్యాక్టరీపైగానీ, ప్రత్యేక ప్యాకేజీ, ఇతర పరిశ్రమలపైగానీ చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదని మండిపడ్డారు. వీటన్నింటి నేపథ్యంలో సెప్టెంబర్ 3న నిర్వహించే ధర్నాకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్పొరేటర్లు కె. బాబు, జమ్మిరెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు పులి సునీల్కుమార్, విద్యార్ధి విభాగం జిల్లా అధ్యక్షుడు ఖాజా రహమతుల్లా పాల్గొన్నారు.