ఫిబ్రవరి 6న మహాధర్నా

  • సాగునీటి కోసం వైయ్ససార్సీపీ ఆందోళన
  • ఉరవకొండలో వైయస్ జగన్ ధర్నా
  • ఈ ప్రాంత రైతులపై సీఎం వివక్ష 
  • ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి  ధ్వజం
  • ధర్నాను విజయవంతం చేయాలని పిలుపు
అనంత‌పురం:   సాగునీటి కోసం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళ‌న‌కు సిద్ధ‌మైంది. ఈ నెల 6వ తేదీన అనంత‌పురం జిల్లా ఉర‌వ‌కొండ నియోజ‌క‌వ‌ర్గంలో ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఆధ్వ‌ర్యంలో మ‌హాధ‌ర్నా చేప‌ట్టనున‌ట్టు ఎమ్మెల్యే వై.విశ్వేశ్వ‌ర్‌రెడ్డి తెలిపారు. మహాధర్నాకు సంభందించిన పొస్టర్లు, కరపత్రాలను ఎమ్మెల్యే వై.విశ్వేశ్వర్‌రెడ్డి విడుదల చేశారు. ఈ మేర‌కు ఆయ‌న విలేక‌రుల‌తో మాట్లాడుతూ..దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ హంద్రీనీవా పనులు 95 శాతం పూర్తి చేస్తే మిగిలిన 5 శాతం పనులను పూర్తి చేయడంలో చంద్రబాబు సర్కార్‌ నిర్లక్ష్యం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలుగా మాల్యాల నుంచి జీడిపల్లికి నీరు వస్తున్నా వాడుకోలేని దుస్థితి ఏర్పడిందన్నారు. దొంగగా వాడుకోవాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. జిల్లాకు నీళ్లు వస్తున్నాయంటే అది వైయస్సార్‌ పుణ్యమేనన్నారు. 

నియోజకవర్గంలోని 80 వేల ఎకరాలకు హంద్రీనీవా కాలువ ద్వారా అధికారికంగా సాగునీరు ఇవ్వాలని రైతులతో కలిసి జలజాగరణ, ధర్నాలు, నిరాహార దీక్షలు, పంప్‌ హౌస్‌ ముట్టడి తదితర కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యమంత్రిని కూడా నేరుగా కలిసి సమస్యను విన్నవిస్తే... మీ విధానం, మా విధానం వేరని మాట్లాడారన్నారు. ఈ ప్రాంత రైతులకు సాగునీరు ఇవ్వాలన్న చిత్తశుద్ధి సీఎంకు లేదని విమర్శించారు. ఈప్రాంత రైతులకు నీరు ఇవ్వకుండా కుప్పంకు నీరు తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు కుట్ర చేస్తున్నాడన్నారు.

 జిల్లాలో మూడున్నర లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన తర్వాతే ఇతర ప్రాంతాలకు నీరు తీసుకెళ్లాలని డిమాండ్‌ చేశారు.  చంద్రబాబు సర్కార్‌ కేవలం చెరువులకు నీరిచ్చి అంతా తామే చేశామంటూ రైతులను మభ్యపెట్టడం సరికాదని హితవు పలికారు.  రైతులు, ప్రజలకు జరుగుతున్న అన్యాయన్ని ప్రశ్నించడానికి వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఫిబ్రవరి 6న ఉరవకొండకు వస్తున్నారని స్పష్టం చేశారు. రైతులు, పార్టీ శ్రేణులు ఈ ధ‌ర్నాను విజ‌య‌వంతం చేయాల‌ని విశ్వేశ్వ‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. 
Back to Top