అనంతపురం : రాష్ట్ర ప్రజల అభిమానంతో వైయస్ఆర్సిపి అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి నిర్దోషిగా బయటికి వస్తారన్న ధీమాను పార్టీ సిఇసి సభ్యుడు వై. విశ్వేశ్వర్రెడ్డి, అనంతపురం, వైయస్ఆర్ జిల్లాల కిసాన్ సెల్ కో ఆర్డినేటర్ వై. మధుసూదన్రెడ్డి వ్యక్తం చేశారు. శ్రీ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొనే దమ్ములేని కాంగ్రెస్, టిడిపి నాయకులు కుమ్మక్కు రాజకీయాలతో అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారని విశ్వేశ్వరరెడ్డి, మధుసూదన్రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు చూపిస్తున్న అభిమానమే శ్రీ జగన్కు శ్రీరామరక్షగా ఉంటుందని అన్నారు.<br/> ఉరవకొండ కవితా హోటల్ సర్కిల్లో సోమవారం 'జగన్ కోసం.. జనం సంతకం' పేరున కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. సిబిఐని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ పార్టీ శ్రీ జగన్కు బెయిల్ రాకుండా చేస్తోందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు జగన్కు ఉన్నాయని జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ అన్నారు.<br/>సంతకాల సేకరణ శిబిరానికి స్థానికులు, వివిధ గ్రామాల వారు తరలివచ్చి సంతకాలు చేశారు. బస్టాప్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అనేక మంది ప్రయాణికులు ఎంతో ఉత్సాహంగా శిబిరానికి వచ్చి సంతకాలు చేశారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.