జగన్‌పై కుట్రలకు వైయస్ఆర్ కాంగ్రెస్ ఖండన

హైదరాబాద్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డిపై సీబీఐ చేస్తున్న కుట్రలను ఆ పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా ఖండించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ముఖ్య నేతల అత్యవసర సమావేశం ఏర్పాటైంది. నేతలంతా సీబీఐ తీరును ఎండగట్టారు. పార్టీ సీజీసీ సభ్యుడు డాక్టర్ ఎమ్.వి. మైసూరా రెడ్డి, డి. రవీంద్రనాయక్, పీఏసీ సభ్యులు డీఏ సోమయాజులు, బాజిరెడ్డి గోవర్ధన్, పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావుతో సహా పలువురు నేతలు ఈ భేటీకి హాజరయ్యారు. సీబీఐ ఒక దర్యాప్తు సంస్థ మాదిరిగా కాకుండా జగన్మోహన్ రెడ్డిపై కక్ష  సాధింపుతో వ్యవహరిస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు. దేశంలో ఏ కేసు విషయంలోనూ సీబీఐ ఇలా వ్యవహరించలేదన్న అంశం సమావేశంలో ప్రధానంగా చర్చకు వచ్చింది. శ్రీ జగన్మోహన్ రెడ్డిపై  కుట్రలు, కుతంత్రాలు, సీబీఐ వ్యవహరిస్తున్న తీరును అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇందుకు ‘జగన్ కోసం-జనం సంతకం’ పేరుతో ఆయనకు కోటి సంతకాలతో వినతి పత్రాన్ని సమర్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. జగన్ జన్మదినం సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రారంభమైన ఈ సంతకాల సేకరణకు.. కార్యకర్తలు, ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. పార్టీ నేత డి. రవీంద్రనాయక్ తొలి సంతకం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా... డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి సంతకాల సేకరణ లక్ష్యాన్ని వివరించారు. ఎలాగైనా సరే శ్రీ జగన్‌ను దోషిగా చిత్రీకరించాలని అదే పనిగా సీబీఐ చేస్తున్న ప్రయత్నాలను రాష్ట్రపతికి తెలియజేసేందుకే ఈ సంతకాల సేకరణ చేపట్టామని వెల్లడించారు.

ఒక్కొక్కరికి ఒక్కో న్యాయమా

     పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. దేశంలో ఒక్కొక్కరికి ఒక్కో రకమైన న్యాయం అమలవుతోందన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సీబీఐ కేసులు ఎదుర్కొంటున్న ములాయం సింగ్ యాదవ్, మాయావతికి  ఒక న్యాయం, శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఒక న్యాయమా అని నిలదీశారు. శ్రీ జగన్మోహన్‌ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి సొంతంగా పార్టీ పెట్టుకున్నరన్న కక్షతోనే ఆయన్ను వేధిస్తున్నారని జూపూడి ప్రభాకరరావు చెప్పారు. సంతకాలు చేసిన నేతల్లో డీఏ సోమయాజులు, వాసిరెడ్డి పద్మ, జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాశరావు, హెచ్‌ఏ రెహ్మాన్, గట్టు రామచంద్రరావు, కె.శివకుమార్, రాజ్ ఠాకూర్, మేడపాటి వెంకట్, బి.జనార్దన్‌రెడ్డి, చల్లా మధుసూదనరెడ్డి, విజయారెడ్డి, నాగదేశి రవికుమార్ ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల సంఘం(హెచ్-128 యూనియన్)కు చెందిన ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో జగన్‌కు మద్దతుగా సంతకాలను చేశారు.

‘జగన్ కోసం-జనం సంతకం’లో రాష్ట్రపతికి విజ్ఞప్తి ఇదీ

     వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభ సభ్యుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మీద రాజకీయపరంగా బనాయించిన కేసును తీవ్రంగా గర్హిస్తున్నామని లేఖలో నేతలు పేర్కొన్నారు. నిజాలను నిర్ధారించాల్సిన సీబీఐ శ్రీ జగన్‌ను దోషిగా చిత్రీకరించడానికి  చేస్తున్న యత్నాలను అధికార దుర్వినియోగానికి పరాకాష్టగా భావిస్తున్నామన్నారు. రాజకీయ ఒత్తిళ్లకు లొంగి, పక్షపాతంతో సీబీఐ చేస్తున్న దర్యాప్తు భారతదేశంలో అధికార వ్యవస్థల దుర్వినియోగానికి నిలువెత్తు నిదర్శనమని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టుకున్నందుకు, అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చినందుకు శ్రీ జగన్మోహన్ రెడ్డిని 200 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధంలో ఉంచడాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనీ, ఈ కక్ష సాధింపులు ఆపి ప్రభుత్వ వ్యవస్థల ఔన్నత్యాన్ని పెంచాలనీ  ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు.

Back to Top