జగన్ కేసులో సీబీఐ కొత్త డ్రామా

హైదరాబాద్, జనవరి 22, 2013: 

తమ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో సీబీఐ కొత్త నాటకానికి తెరలేపిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డాక్టర్ ఎమ్.వి. మైసూరారెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆరోపించారు. వీలైనన్ని ఎక్కువరోజులు ఆయనను జైలులో ఉంచడానికి ప్రభుత్వం, సీబీఐ కుట్ర పన్నాయని వారు వివరించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పెట్టిన ఏడు కేసుల్లోని నాలుగింటిలో రెండు నెలల్లో చార్జి షీటు వేస్తామని సుప్రీం కోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందన్నారు. మరో కేసులో మూడు నెలల్లో చార్జి షీటు దాఖలు చేస్తామని పేర్కొన్నారు. దీనిని అంగీకరిస్తూ తొందరగా పూర్తి చేయమని సుప్రీం కోర్టు సీబీఐని ఆదేశించిందన్నారు. తాజాగా హైకోర్టులో బెయిలు పిటిషనుపై తమకు ప్రభుత్వం సహకరించడంలేదని సీబీఐ కొత్త వాదన చేసిందని మైసూరా రెడ్డి చెప్పారు. ఇది  డ్రామాలాడడమేనన్నారు. ప్రభుత్వం, సీబీఐ కుమ్మక్కుకు ఇది ప్రత్యక్ష నిదర్శనంమని స్పష్టంచేశా. దర్యాప్తులో ప్రభుత్వం సహకరించడం లేదనే అంశాన్ని సుప్రీం కోర్టులో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. బెయిలును  అడ్డుకోవడానికే ఇది ఎత్తుగడ వేసిందన్నారు. చిత్తశుద్ధితో దర్యాప్తుచేసి చార్జి షీటు వేయాలన్న ధ్యాస సీబీఐకి లేదని ఆయన ఆరోపించారు.



     ఎప్పుడో జరిగిన కేసులను చూపి ఇప్పుడు అరెస్టు చేస్తున్నారని మైసూరా రెడ్డి చెప్పారు. ఎమ్ఐఎమ్ కాంగ్రెస్ తో మిత్రత్వం నెరపుతున్నప్పుడు లేని కేసును ఇప్పుడు తిరగదోడారన్నారు. మద్దతు ఉపసంహరించగానే అరెస్టు చేశారు. కాంగ్రెస్ కక్ష సాధింపునకు పూనుకుంటోందనడానికి ఇది నిదర్శనమని అసదుద్దీన్ ఒవైసీ అరెస్టుపై  ఆయన  వ్యాఖ్యానించారు.


     ఇతర పార్టీలపై బురద జల్లడానికి తెలంగాణ అంశాన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని ఆయన పేర్కొన్నారు. తమ వైఖరి చెప్పకుండా కాంగ్రెస్ ఎనిమిదికోట్లమంది ప్రజలతో ఆడుకుంటోందన్నారు. ఎమ్మెల్యే గుర్నధరెడ్డి నిర్ణయంపై అడిగిన ప్రశ్నకు సమాధానంగా అది ఆయన వ్యక్తిగతమన్నారు.

Back to Top